త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

India GDP | పీఆర్​ ద్వారా జీడీపీ గణాంకాలను అందంగా మార్చగ‌ల‌రేమో.. ఆర్థిక వ్యవస్థను కాదు : కాంగ్రెస్‌

India GDP | దేశ జీడీపీ వృద్ధి గ‌ణాంకాలపై (India GDP) కాంగ్రెస్ పార్టీ (Congress) తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించింది. పీఆర్​ ద్వారా జీడీపీ గణాంకాలను అందంగా మార్చవచ్చేమో కానీ, అసలు ఆర్థిక వ్యవస్థను మార్చలేరు అంటూ ఎద్దేవా చేసింది.

D

National | Published On Sep 2, 2026, 3.54 pm IST

India GDP | పీఆర్​ ద్వారా జీడీపీ గణాంకాలను అందంగా మార్చగ‌ల‌రేమో.. ఆర్థిక వ్యవస్థను కాదు : కాంగ్రెస్‌
Advertisement

India GDP | త్రినేత్ర‌.న్యూస్ : దేశ జీడీపీ వృద్ధి గ‌ణాంకాలపై (India GDP) కాంగ్రెస్ పార్టీ (Congress) తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించింది. మోదీ ప్ర‌భుత్వం విడుద‌ల చేసిన జీడీపీ గ‌ణాంకాల‌ను అంకెల గార‌డీగా అభివ‌ర్ణించింది. 'మేక్ ఇన్ ఇండియా' కార్యక్రమం చాలా తక్కువ ఫలితాలనే సాధించిందని, అయితే మోదీ ప్రభుత్వానికి అసలైన గుర్తింపుగా మారిన 'ఫేక్ ఇన్ ఇండియా' మాత్రం నిరంత‌రాయంగా కొనసాగుతూనే ఉందని ఎద్దేవా చేసింది.

మ‌రోవైపు జీడీపీ గణాంకాలపై మాజీ ఆర్థిక కార్యదర్శి సుభాష్​ చంద్ర గార్గ్​ (Subhash Chandra Garg) చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోను ఎక్స్‌లో పోస్టుచేస్తూ.. కేంద్ర ప్ర‌భుత్వంపై కాంగ్రెస్ జ‌న‌ర‌ల్ సెక్ర‌ట‌రీ జైరామ్ ర‌మేష్ (Jairam Ramesh) తీవ్ర స్థాయిలో ధ్వ‌జ‌మెత్తారు. పీఆర్​ ద్వారా జీడీపీ గణాంకాలను అందంగా మార్చవచ్చేమో కానీ, అసలు ఆర్థిక వ్యవస్థను మార్చలేరు అంటూ ఎద్దేవా చేశారు.

వృద్ధి రేటు 2.6 శాత‌మే..

జైరామ్ ర‌మేష్ పోస్టు చేసిన వీడియోలో సుభాష్​ చంద్ర గార్గ్​ మాట్లాడుతూ.. గతేడాది జీడీపీని సుమారు రూ. 6 లక్షల కోట్లు సవరించడం వల్ల, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో జీడీపీ వృద్ధిరేటు సుమారు 10.3 శాతానికి పెరిగినట్లు కనిపిస్తోందని చెప్పారు. ఒక‌వేళ గ‌తేడాది జీడీపీని స‌వ‌రించ‌క‌పోయి ఉంటే ప్ర‌స్తుత‌ ధ‌ర‌ల ప్ర‌కారం వృద్ధి రేటు కేవ‌లం 2.6 శాతంగానే ఉండేద‌ని చెప్పుకొచ్చారు. ఈ వీడియోను పోస్టు చేసిన జైరామ్ ర‌మేష్ కేంద్ర స‌ర్కార్‌పై ఘాటు విమ‌ర్శ‌లు చేశారు. "ప్రభుత్వం చెబుతున్నట్లుగా జీడీపీ వృద్ధి రేటు 7.8% కాదు.. అది కేవలం 2.6% మాత్రమేనని మాజీ ఆర్థిక కార్యదర్శి సుభాష్ గార్గ్ తేల్చిచెప్పారు" అని జైరామ్ ర‌మేష్ కేంద్ర ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు గుప్పించారు. దేశ జీడీపీ వృద్ధి గురించి మోదీ ప్ర‌భుత్వం ఎంత‌లా డ‌ప్పు కొట్టుకున్నా.. అంకెల గారడీతో సృష్టించిన జీడీపీ వృద్ధి అసలు నిజం త్వరలోనే బ‌ట్ట‌బ‌య‌ల‌వుతుంద‌ని పేర్కొన్నారు.

ముందు ఆ ప‌ని చేయండి..

దేశ ఆర్థిక వ్య‌వ‌స్థ నిజంగా బ‌ల‌ప‌డాల‌ని తాము కోరుకుంటున్న‌ట్లు జైరామ్ ర‌మేష్ చెప్పారు. అయితే అబద్ధాల పునాదులపై సృష్టించిన అంకెలను అలంకరించడం ద్వారా ఆ లక్ష్యం నెరవేరదని పేర్కొన్నారు. వాస్తవాలను అంగీకరించడం ద్వారానే సాధ్యమవుతుందని హితవు పలికారు. ప్ర‌భుత్వం ముందుగా వాస్త‌వ ఆర్థిక ప‌రిస్థితిని గుర్తించాల‌ని, ఆ త‌ర్వాతే సంస్క‌ర‌ణ‌లు చేప‌ట్టాల‌ని సూచించారు. యువతకు ఉద్యోగాలు కల్పించాలని, ఎంఎస్ఎంఈలను, ప్రైవేట్ పెట్టుబడులను ప్రోత్సహించాలని, ప్రజల డిమాండ్‌, ఆదాయం పెరిగేలా చూడాల‌ని, ఆర్థిక అసమానతలను తగ్గించాలని పేర్కొన్నారు. కొద్దిమంది బడా వ్యాపారవేత్తలకు పెద్దపీఠ వేయకుండా, మార్కెట్లో సరైన పోటీ ఉండేలా చూడాలని జైరామ్ రమేష్ డిమాండ్ చేశారు.

పీఆర్​ స్ట్రాటజీలు వద్దు..

"మోదీ ప్రభుత్వం ఒక విష‌యం అర్థం చేసుకోవాలి. పీఆర్​ ద్వారా జీడీపీ చిత్రాన్ని అందంగా మార్చవచ్చు. కానీ ఆర్థిక వ్యవస్థను కాదు. ఏ జీడీపీని చూసి ప్రజలందరినీ ప‌టాకులు కాల్చి దీపావళి జరుపుకోవాలని ప్ర‌ధాని కోరుతున్నారో.. అదే జీడీపీపై ఆయన ప్రభుత్వంలో పనిచేసిన మాజీ ఆర్థిక కార్యదర్శే తీవ్రమైన ప్రశ్నలు లేవ‌నెత్తుతున్నారు" అని జైరాం రమేశ్​ ఘాటు విమ‌ర్శ‌లు చేశారు.

గార్గ్ వ్యాఖ్య‌ల‌ను కొట్టిపారేయ‌లేం.. ఖేరా

మ‌రోవైపు భారతదేశ నిజమైన జీడీపీ వృద్ధి రేటు దాదాపు 2.6 శాతమేనని మాజీ ఆర్థిక కార్యదర్శి సుభాష్ గార్గ్ చేసిన వ్యాఖ్య‌ల నేప‌థ్యంలో మోదీ ప్ర‌భుత్వంపై కాంగ్రెస్ మీడియా, ప‌బ్లిసిటీ విభాగం హెడ్ ప‌వ‌న్ ఖేరా (Pawan Khera ) తీవ్ర స్థాయిలో మండిప‌డ్డారు. "జీడీపీ 7.8 శాతం వృద్ధి చెందిందన్న ప్రభుత్వ గొప్పలు కేవలం కట్టుకథలేనని సుభాష్ గార్గ్ తేల్చేశారు. భారతదేశ నిజమైన జీడీపీ వృద్ధి రేటు దాదాపు 2.6 శాతమేనని ఆయన వాదించారు. గత ఏడాది జీడీపీ వృద్ధి గణాంకాలను త‌గ్గించి.. ఈ ఏడాది వృద్ధి రేటు బలంగా ఉన్నట్లు చూపించారనే ఆయన వాదన మరింత ఆందోళనకరమైనది.

దేశంలో పెరుగుతున్న ధరలు, ప‌డిపోతున్న ప్ర‌జ‌ల కొనుగోలు శ‌క్తి, పొదుపు త‌గ్గ‌డం, నిరుద్యోగం, పెరుగుతున్న గృహ రుణాల భారంతో స‌త‌మ‌త‌మ‌వుతున్న సామాన్యుల వాస్త‌వ ప‌రిస్థితుల‌కు సుభాష్​ గార్గ్ చెప్పిన విషయాలు చాలా ద‌గ్గ‌ర‌గా ఉన్నాయి. ఆయ‌న చేసిన ఈ వ్యాఖ్య‌ల‌ను కొట్టిపారేయ‌లేం. 2017-19 మ‌ధ్య మోదీ ప్ర‌భుత్వ హ‌యాంలో ఆర్థిక వ్యవహారాల కార్యదర్శిగా పనిచేసిన వ్యక్తి నుంచి ఈ వ్యాఖ్య‌లు రావ‌డం ఆందోళ‌న‌క‌రం. గ‌తేడాది జీడీపీ గ‌ణాంకాల‌ను ఎందుకు త‌గ్గించి చూపించారు..? గ‌ణాంకాల‌ను ఎందుకు తారుమారు చేస్తున్నారు..? అస‌లైన జీడీపీ వృద్ధి రేటు ఎంత‌..? అనే విష‌యాల‌పై దేశ ప్ర‌జ‌ల‌కు ప్ర‌భుత్వం స్ప‌ష్టమైన వివ‌ర‌ణ ఇవ్వాలి" అని ఖేరా డిమాండ్ చేశారు.

భారత్‌ 7.8 శాతం ఆర్థిక వృద్ధి

ఆర్థిక సంవత్సరం 2026-27 తొలి త్రైమాసికంలో భారత్‌ 7.8 శాతం ఆర్థిక వృద్ధిని న‌మోదు చేసిన విష‌యం తెలిసిందే. అమెరికా-ఇరాన్‌ యుద్ధం ప్రభావం ఆర్థిక కార్యకలాపాలపై ప్రతికూల ప్రభావం చూపుతుందని అంచనాలు ఉన్నప్పటికీ, తొలి త్రైమాసికంలో వృద్ధి బలంగా నమోదైంది. అయితే 2025-26 ఆర్థిక సంవత్సరం జనవరి-మార్చి త్రైమాసికంలో నమోదైన 8.6 శాతం వృద్ధితో పోలిస్తే తాజా వృద్ధి 80 బేసిస్‌ పాయింట్లు తగ్గింది.

Also Read..

జార్ఖండ్‌లో SIR వివాదం.. ఓటర్ల జాబితా నుంచి మైనారిటీల పేర్లు తొలగింపునకు బీజేపీ ఏజెంట్ల ప్రయత్నం

కృష్ణాష్టమి ఎఫెక్ట్: సెప్టెంబర్ 4న హైదరాబాద్‌లో మాంసం దుకాణాలు బంద్

7000 ఎంఏహెచ్ భారీ బ్యాట‌రీ, వాట‌ర్‌, డ‌స్ట్ రెసిస్టెన్స్‌తో వివో కొత్త ఫోన్‌.. ధ‌ర ఎంతంటే..

Advertisement
Advertisement