త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Ramchander Rao | కాంగ్రెస్‌ను ఓడించాల్సిందే.. అరెస్టుపై రామ‌చంద‌ర్ రావు ఫైర్

Ramchander Rao | రాష్ట్రంలో ప్ర‌జాస్వామ్యాన్ని ర‌క్షించాలంటే కాంగ్రెస్ పార్టీని ఓడించాల్సిన అవ‌స‌రం ఉంద‌ని బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు రామ‌చంద‌ర్ రావు తేల్చిచెప్పారు.

S

Telangana | Published On Sep 1, 2026, 11.20 am IST

Ramchander Rao | కాంగ్రెస్‌ను ఓడించాల్సిందే.. అరెస్టుపై రామ‌చంద‌ర్ రావు ఫైర్
Advertisement

Ramchander Rao | త్రినేత్ర‌.న్యూస్ : రాష్ట్రంలో ప్ర‌జాస్వామ్యాన్ని ర‌క్షించాలంటే కాంగ్రెస్ పార్టీని ఓడించాల్సిన అవ‌స‌రం ఉంద‌ని బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు రామ‌చంద‌ర్ రావు తేల్చిచెప్పారు. న‌ల్ల‌గొండ జిల్లా బీజేపీ అధ్య‌క్షుడు నాగం వ‌ర్షిత్ రెడ్డిని ప‌రామ‌ర్శించేందుకు తార్నాక నుంచి బ‌య‌ల్దేరిన రామ‌చంద‌ర్ రావును పోలీసులు అరెస్టు చేశారు. ఈ సంద‌ర్భంగా రామ‌చంద‌ర్ రావు ప్ర‌భుత్వ తీరుపై నిప్పులు చెరిగారు.

న‌ల్ల‌గొండ జిల్లా బీజేపీ అధ్య‌క్షుడు నాగం వ‌ర్షిత్ రెడ్డిని ప‌రామ‌ర్శించేందుకు వెళ్తుంటే.. పోలీసులు త‌నను అరెస్టు చేశారు. ప్ర‌జాస్వామ్యంలో ఇండ్ల మీద, కార్యాల‌యాల‌పై దాడులు చేయ‌డం మంచిది కాదు. ఈ ర‌క‌మైన వాతావ‌ర‌ణాన్ని ఏర్పాటు చేసి భార‌తీయ జ‌న‌తా పార్టీని రెచ్చ‌గొడితే త‌గిన మూల్యం చెల్లించుకోవాల్సి వ‌స్తుంద‌ని కాంగ్రెస్ ప్ర‌భుత్వాన్ని హెచ్చ‌రిస్తున్నాం. ప్ర‌జాస్వామ్యాన్ని గౌర‌వించాలి. రాష్ట్రంలో శాంతి భ‌ద్ర‌త‌లు క్షీణిస్తున్నాయి. ప్ర‌జాస్వామ్యం కూడా ఖూనీ అయిపోయింది. ప్ర‌జాస్వామ్యాన్ని ర‌క్షించాలంటే కాంగ్రెస్ పార్టీని ఓడించాల్సిన అవ‌స‌రం ఉంద‌ని రామ‌చంద‌ర్ రావు అన్నారు.

తెల్ల‌వారుజాము నుంచే పోలీసుల మోహ‌రింపు

తార్నాక‌లోని రామ‌చంద‌ర్ రావు ఇంటి వ‌ద్ద మంగ‌ళ‌వారం తెల్ల‌వారుజాము నుంచే పోలీసులు భారీగా మోహ‌రించారు. ఆయ‌న‌ను న‌ల్ల‌గొండ జిల్లా వెళ్ల‌కుండా అడ్డుకున్నారు. హౌస్ అరెస్టు చేశారు. ఈ క్ర‌మంలో బీజేపీ నేత‌లు, కార్య‌క‌ర్త‌లు రామ‌చంద‌ర్ రావు నివాసానికి భారీ సంఖ్య‌లో చేరుకున్నారు. అనంత‌రం ఉద‌యం 10 గంట‌ల స‌మ‌యంలో త‌న ఇంటి నుంచి న‌ల్ల‌గొండ ప‌ర్య‌ట‌న‌కు బ‌య‌ల్దేరిన రామ‌చంద‌ర్ రావును పోలీసులు అరెస్టు చేశారు.

నాగం వ‌ర్షిత్ రెడ్డి ఇంటిపై నిన్న సాయంత్రం దాడి

న‌ల్ల‌గొండ జిల్లా బీజేపీ అధ్య‌క్షుడు నాగం వ‌ర్షిత్ రెడ్డి ఇంటిపై నిన్న సాయంత్రం కాంగ్రెస్ కార్య‌క‌ర్త‌లు దాడికి పాల్ప‌డ్డ సంగ‌తి తెలిసిందే. వ‌ర్షిత్ రెడ్డి ఇంట్లోకి ప్ర‌వేశించిన కాంగ్రెస్ కార్య‌క‌ర్త‌లు.. ఫ‌ర్నీచ‌ర్‌ను ధ్వంసం చేశారు. కిటికీల అద్దాల‌ను ప‌గుల‌గొట్టారు. వ‌ర్షిత్ రెడ్డి కుటుంబ స‌భ్యుల‌పై దాడి చేశారు. ఈ దాడుల్లో వ‌ర్షిత్ త‌ల్లికి కూడా స్వ‌ల్ప గాయాలైన‌ట్లు స‌మాచారం. మంత్రి కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి కార్యాల‌యంపై బీజేపీ దాడి చేసిన అనంత‌రం హ‌స్తం నేత‌లు ఈ దాడికి పాల్ప‌డ్డారు.

Advertisement
Advertisement