త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

PM Modi | 21వ శతాబ్దపు అతిపెద్ద ఇంధ‌న సంక్షోభాన్ని భార‌త్ విజ‌య‌వంతంగా అధిగ‌మించింది : ప్ర‌ధాని మోదీ

PM Modi | మ‌ధ్య‌ప్రాచ్యంలో నెల‌కొన్న ఉద్రిక్త ప‌రిస్థితుల కార‌ణంగా త‌లెత్తిన 21వ శతాబ్దపు అతిపెద్ద ఇంధ‌న సంక్షోభాన్ని భార‌త్ విజ‌య‌వంతంగా అధిగ‌మించింద‌ని ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ తెలిపారు. ఈ సంక్షోభ స‌మ‌యంలో ప్ర‌భుత్వ రంగ చ‌మురు మార్కెటింగ్ కంపెనీలు రూ.75,000 కోట్ల‌కుపైగా న‌ష్టాల‌ను చ‌విచూశాయ‌ని తెలిపారు.

D

National | Published On Jul 4, 2026, 4.56 pm IST

PM Modi | 21వ శతాబ్దపు అతిపెద్ద ఇంధ‌న సంక్షోభాన్ని భార‌త్ విజ‌య‌వంతంగా అధిగ‌మించింది : ప్ర‌ధాని మోదీ
Advertisement
  • దౌత్య‌ప‌ర‌మైన చొర‌వే దేశాన్ని కాపాడింది
  • సంక్షోభ స‌మ‌యంలో చ‌మురు కంపెనీల‌కు రూ.75,000 కోట్ల న‌ష్టం
  • వివిధ దేశాల‌తో ఉన్న స్నేహ‌సంబంధాలు భార‌త్‌కు క‌లిసొచ్చాయి
  • రాజ‌స్థాన్ ప‌ర్య‌ట‌న‌లో రూ. 1.06 లక్షల కోట్ల అభివృద్ధి ప‌నులు ప్రారంభించిన ప్ర‌ధాని

PM Modi | త్రినేత్ర.న్యూస్ : ప‌శ్చిమాసియా యుద్ధం కార‌ణంగా త‌లెత్తిన 21వ శతాబ్దపు అతిపెద్ద ఇంధ‌న సంక్షోభాన్ని (energy crisis) భార‌త్ విజ‌య‌వంతంగా అధిగ‌మించింద‌ని ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ (PM Modi) పున‌రుద్ఘాటించారు. స‌కాలంలో తీసుకున్న విధాన‌ప‌ర‌మైన నిర్ణ‌యాలు, వ్యూహాత్మ‌క ప్ర‌ణాళిక‌లు, దౌత్య‌ప‌ర‌మైన చొర‌వ‌లే దేశాన్ని తీవ్ర‌మైన ఇంధ‌న సంక్షోభం నుంచి బ‌య‌ట‌ప‌డేశాయ‌ని తెలిపారు.

ప్ర‌ధాని మోదీ నేడు రాజస్థాన్‌లో ప‌ర్య‌టించారు. ఈ సంద‌ర్భంగా ప‌లు అభివృద్ధి కార్య‌క్ర‌మాల‌కు శంకుస్థాప‌న చేశారు. బలోత్రా జిల్లా పచ్‌పద్రలో దేశంలోనే మొట్టమొదటి గ్రీన్‌ఫీల్డ్ ఇంటిగ్రేటెడ్ రిఫైనరీ-కమ్-పెట్రోకెమికల్ కాంప్లెక్స్‌ను ప్ర‌ధాని మోదీ ప్రారంభించారు. అనంత‌రం ఏర్పాటు చేసిన బ‌హిరంగ స‌భ‌లో ప్ర‌సంగించారు. "ప‌శ్చిమాసియాలో ఘ‌ర్ష‌ణ‌లు ప్ర‌పంచాన్ని అత‌లాకుతలం చేశాయి. అతిపెద్ద ఆర్థిక వ్య‌వ‌స్థ‌లుగా ఉన్న దేశాలు కూడా మునుపెన్న‌డూ లేని విధంగా ఇంధ‌న సంక్షోభాన్ని ఎదుర్కొన్నాయి. భార‌త్ త‌న ఎల్‌పీజీ అవ‌స‌రాల్లో దాదాపు 60 శాతం దిగుమ‌తుల‌పైనే ఆధార‌ప‌డుతోంది. ఈ యుద్ధం స‌మ‌యంలో హ‌ర్మూజ్ జ‌ల‌సంధి మ‌త‌ప‌డ‌టంతో దేశంలో ఓ పెద్ద ఇంధ‌న అత్య‌వ‌స‌ర ప‌రిస్థితి ఏర్ప‌డే ప్ర‌మాదం వ‌చ్చింది.

ఇంత‌టి సంక్షోభ స‌మ‌యంలో వివిధ దేశాల‌తో ఉన్న స్నేహ‌సంబంధాలు భార‌త్‌కు క‌లిసివ‌చ్చాయి. ప్ర‌భుత్వం తీసుకున్న ముంద‌స్తు చ‌ర్య‌లు, నిర్ణ‌యాలు, దౌత్యపరమైన చర్చల వ‌ల్ల భార‌త్ ఈ సంక్షోభం నుంచి సుర‌క్షితంగా బ‌య‌ట‌ప‌డింది. ఈ స‌వాలును అధిగ‌మించేందుకు భార‌త్ ప్ర‌తి స్థాయిలోనూ స‌రైన నిర్ణ‌యాలు తీసుకుంది. పశ్చిమాసియా సంక్షోభానికి ముందు కేవ‌లం 26 దేశాల నుంచి మాత్ర‌మే భార‌త్ ఇంధ‌నాన్ని దిగుమ‌తి చేసుకునేది. ఉద్రిక్త‌త‌లు కొన‌సాగుతున్న‌ప్ప‌టికీ సుమారు 40 దేశాల నుంచి భార‌త్ ఇంధ‌నాన్ని దిగుమ‌తి చేసుకుంది. దేశ ప్ర‌యోజ‌నాలు, ప్ర‌జ‌ల సంక్షేమ‌మే కీల‌క‌మ‌న్న విష‌యాన్ని ప్ర‌పంచానికి చాటి చెప్పింది" అని ప్ర‌ధాని స్ప‌ష్టం చేశారు.

ఇంధ‌న కంపెనీల‌కు 75 వేల కోట్ల న‌ష్టం..

ఈ సంక్షోభ స‌మ‌యంలో ప్ర‌భుత్వ రంగ చ‌మురు మార్కెటింగ్ కంపెనీలు రూ.75,000 కోట్ల‌కుపైగా న‌ష్టాల‌ను చ‌విచూశాయ‌ని ప్ర‌ధాని తెలిపారు. అంత‌ర్జాతీయంగా పెరుగుతున్న ఇంధ‌న ధ‌ర‌ల పూర్తి భారం వినియోగ‌దారుల‌పై ప‌డ‌కుండా ఆ భారాన్ని ప్ర‌భుత్వ‌మే భ‌రించింద‌న్నారు. లీట‌రుపై ఎక్సైజ్ సుంకాన్ని రూ.10 త‌గ్గించిన‌ట్లు మోదీ తెలిపారు. ప్ర‌జ‌లపై ఎటువంటి అద‌న‌పు భారం ప‌డ‌కుండా చూశామ‌న్నారు.

ఇదే సమయంలో ప్ర‌తిప‌క్షాల‌పై ప్ర‌ధాని తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డ్డారు. సంక్షోభ స‌మ‌యంలో కొన్ని శ‌క్తులు ప్ర‌జ‌ల్లో భ‌యాందోళ‌న‌ల‌ను సృష్టించే ప్ర‌య‌త్నం చేశాయ‌ని మండిప‌డ్డారు. ప్ర‌భుత్వం మాత్రం దేశానికి నిరంత‌రాయంగా ఇంధ‌న స‌ర‌ఫ‌రా జరిగేలా అవిశ్రాంతంగా శ్ర‌మించింద‌ని చెప్పుకొచ్చారు. ఈ సంక్షోభ స‌మ‌యంలో ప్ర‌భుత్వం తీసుకున్న చొర‌వ‌, విధాన‌ప‌ర‌మైన‌, దౌత్య‌ప‌ర‌మైన నిర్ణ‌యాలు చ‌రిత్ర‌లో నిలిచిపోతాయ‌ని ప్ర‌ధాని పేర్కొన్నారు.

రూ. 1.06 లక్షల కోట్ల విలువైన అభివృద్ధి ప‌నులు ప్రారంభం..

ఈ ప‌ర్య‌ట‌న‌లో పట్టణ రవాణా, రైల్వేలు, జాతీయ రహదారులు, పునరుత్పాదక ఇంధనం, విద్యుత్ పంపిణీ రంగాలకు చెందిన రూ. 1.06 లక్షల కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రధాని మోదీ ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. జోధ్‌పూర్‌లో నూతనంగా నిర్మించిన విమానాశ్రయ టెర్మినల్ భవనాన్ని ప్రధాని మోదీ ప్రారంభించారు. సుమారు రూ.480 కోట్ల వ్యయంతో ఈ ప్రాజెక్టును పూర్తి చేశారని చెప్పారు. 23వేల చదరపు మీటర్ల విస్తీర్ణంలో నిర్మించిన ఈ టెర్మినల్ ద్వారా ఏడాదికి 20 లక్షల మంది ప్రయాణికులకు సేవలు అందించే వీలుంటుందని ప్రధాని తెలిపారు. ఈ నూత‌న టెర్మిన‌ల్‌కు సంబంధించిన చిత్రాల‌ను నిన్న ఎక్స్ వేదిక‌గా ప్ర‌ధాని షేర్ చేసిన విష‌యం తెలిసిందే.

దేశవ్యాప్తంగా ప్రాంతీయ విమానయాన అనుసంధానాన్ని మెరుగుపరచడానికి సవరించిన ఉడాన్ పథకాన్ని ప్రధాని మోదీ ప్రారంభించారు. రాబోయే 10 సంవత్సరాలకు గానూ ఈ పథకం కింద రూ.28,840 కోట్లను కేటాయించారు. దీని ద్వారా కొత్తగా 100 ఎయిర్‌డ్రోమ్‌లు, 200 హెలిప్యాడ్‌లను అభివృద్ధి చేయనున్నారు. వాటితోపాటూ సుమారు రూ.13,000 కోట్ల‌కుపైగా అంచ‌నా వ్య‌యంతో నిర్మించ‌నున్న జైపూర్ మెట్రో రైలు ప్రాజెక్ట్ ఫేజ్-2 కు ప్రధాని శంకుస్థాపన చేశారు.

Advertisement
Advertisement