త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

PM Modi in Kerala | కేరళలో మార్పు తథ్యం: లెఫ్ట్, కాంగ్రెస్‌లపై ప్రధాని మోదీ నిప్పులు.. శబరిమల దోషులను వదిలేది లేదు

కేరళ పర్యటనలో ప్రధాని మోదీ ఎల్డీఎఫ్, యూడీఎఫ్ కూటములపై విరుచుకుపడ్డారు. శబరిమల బంగారం మాయం కేసులో దోషులను వదలబోమని, కాంగ్రెస్ 'MMC' పార్టీగా మారిందని సంచలన వ్యాఖ్యలు చేశారు.

J

National | Published On Jan 23, 2026, 3.53 pm IST

PM Modi in Kerala | కేరళలో మార్పు తథ్యం: లెఫ్ట్, కాంగ్రెస్‌లపై ప్రధాని మోదీ నిప్పులు.. శబరిమల దోషులను వదిలేది లేదు

సంక్షిప్త సారాంశం

ప్రధాని నరేంద్ర మోదీ తిరువనంతపురంలో పలు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించి, ప్రతిపక్షాలపై విమర్శల వర్షం కురిపించారు. దశాబ్దాలుగా కేరళను పాలిస్తున్న ఎల్డీఎఫ్, యూడీఎఫ్ పార్టీలు రాష్ట్రాన్ని అవినీతి కూపంలోకి నెట్టాయని మండిపడ్డారు. శబరిమల ఆలయ అంశంపై విచారణ జరిపిస్తామని హామీ ఇస్తూ, కేరళలో బీజేపీకి పట్టం కట్టాలని ఓటర్లను కోరారు.

Advertisement

PM Modi in Kerala | త్రినేత్ర.న్యూస్: కేరళ రాజకీయాల్లో పెనుమార్పులు రాబోతున్నాయని, రాష్ట్ర అభివృద్ధికి బీజేపీ ఒక్కటే ప్రత్యామ్నాయమని ప్రధాని నరేంద్ర మోదీ ధీమా వ్యక్తం చేశారు. శుక్రవారం తిరువనంతపురంలో పర్యటించిన ఆయన, వేల కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడంతో పాటు భారీ బహిరంగ సభలో ప్రసంగించారు. ఈ సందర్భంగా ఎల్డీఎఫ్ (LDF), యూడీఎఫ్ (UDF) కూటములపై మోదీ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.

కాంగ్రెస్‌పై ఘాటు విమర్శలు: 'MMC' పార్టీ

కాంగ్రెస్‌ పార్టీని ప్రధాని సరికొత్త పేరుతో విమర్శించారు. "కాంగ్రెస్ ఇప్పుడు MMC (Muslim League-Maoist-Congress) గా మారిపోయింది" అని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో లెఫ్ట్, కాంగ్రెస్ పార్టీలు కేవలం ఓటు బ్యాంకు రాజకీయాల కోసమే పనిచేస్తున్నాయని, వారి మధ్య ఉన్నది ఫ్రెండ్లీ ఫైట్ మాత్రమేనని విమర్శించారు. దశాబ్దాలుగా కేరళను దోచుకున్న ఈ రెండు కూటములకు స్వస్తి పలికే సమయం వచ్చిందని పిలుపునిచ్చారు.

'మోదీ గ్యారెంటీ'.. శబరిమల దోషులకు జైలు శిక్ష

శబరిమల అయ్యప్ప ప్రధాన ఆలయంలో జరిగిన బంగారు ఆభరణాల మాయం అంశాన్ని ప్రధాని ప్రస్తావించారు. "శబరిమల ఆలయ సంప్రదాయాలను దెబ్బతీసేందుకు ఎల్డీఎఫ్ ప్రభుత్వం వెనుకాడటం లేదు. ఇప్పుడు అక్కడ బంగారం దొంగతనం జరిగిందనే వార్తలు వస్తున్నాయి. కేరళలో బీజేపీ ప్రభుత్వం రాగానే, దీనిపై పూర్తి స్థాయి విచారణ జరిపిస్తాం. దోషులను జైలుకు పంపడం ఖాయం.. ఇది మోదీ గ్యారెంటీ" అని భరోసా ఇచ్చారు.

అవినీతిపై ఉక్కుపాదం: 'ప్రతి పైసా వెనక్కి తెస్తాం'

కేరళలో అవినీతి కారణంగా అభివృద్ధి కుంటుపడిందని ప్రధాని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా సహకార బ్యాంకు కుంభకోణం వల్ల పేద, మధ్యతరగతి ప్రజల కష్టార్జితం లూటీ అయిందని మండిపడ్డారు. "బీజేపీకి ఒక్క అవకాశం ఇవ్వండి.. దోచుకున్న ప్రతి పైసాను లూటీ చేసిన వారి నుండి తిరిగి వసూలు చేస్తామని నేను హామీ ఇస్తున్నాను" అని మోదీ ప్రకటించారు.

కేంద్ర పథకాలకు అడ్డంకులు

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను కేరళలో అమలు కాకుండా ఎల్డీఎఫ్ ప్రభుత్వం అడ్డుకుంటోందని ప్రధాని ఆరోపించారు. పట్టణ పేదలకు ఇళ్లు నిర్మించే పీఎం ఆవాస్ యోజన (అర్బన్) పథకం తదుపరి దశ అమలును రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకుంటోంది. పైపుల ద్వారా తాగునీటిని అందించే పనుల్లో కావాలనే జాప్యం చేస్తున్నారు. పేద పిల్లలకు ఆధునిక విద్యను అందించే పీఎం శ్రీ (PM SHRI) స్కూల్స్ స్థాపనను కూడా ప్రభుత్వం అడ్డుకుంటోందని ఆయన విమర్శించారు. రాష్ట్ర ప్రయోజనాల కంటే రాజకీయాలే ముఖ్యమనుకుంటున్న ఇటువంటి పేద వ్యతిరేక ప్రభుత్వానికి ప్రజలు తగిన బుద్ధి చెప్పాలని ప్రధాని పిలుపునిచ్చారు.

అభివృద్ధికి బాటలు.. అమృత్ భారత్ రైళ్లకు పచ్చజెండా

రాజకీయ విమర్శలతో పాటు కేరళ అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందన్న మోదీ, నాలుగు కొత్త రైళ్లను (3 అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు) ప్రారంభించారు. తిరువనంతపురం కార్పొరేషన్‌లో బీజేపీ సాధించిన చరిత్రాత్మక విజయం.. కేరళ అసెంబ్లీ ఎన్నికలకు నాంది అని ఆయన పేర్కొన్నారు. 'వికసిత్ కేరళం' (అభివృద్ధి చెందిన కేరళ) సాకారం కావాలంటే డబుల్ ఇంజిన్ సర్కార్ అవసరమని మోదీ నొక్కి చెప్పారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏకి కేరళ ప్రజలు ఒక్క చాన్స్ ఇవ్వాలని మోదీ విజ్ఞప్తి చేశారు.

 

Advertisement

తాజావార్తలు

Advertisement