త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Bengaluru Restaurants | బెంగళూరులో ఫుట్‌బాల్ ఫీవర్: అర్ధరాత్రి దాటాక 3.30 వరకు రెస్టారెంట్లకు పర్మిషన్!

ఫిఫా వరల్డ్ కప్ సెమీస్, ఫైనల్స్ ఫీవర్ మొదలైంది! బెంగళూరులో ఫుట్‌బాల్ అభిమానుల కోసం రెస్టారెంట్లు రాత్రి 3:30 గంటల వరకు తెరిచి ఉంచేందుకు సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

J

National | Published On Jul 14, 2026, 6.22 pm IST

Bengaluru Restaurants | బెంగళూరులో ఫుట్‌బాల్ ఫీవర్: అర్ధరాత్రి దాటాక 3.30 వరకు రెస్టారెంట్లకు పర్మిషన్!
Advertisement
  • ఫిఫా వరల్డ్ కప్ సెమీ ఫైనల్స్, ఫైనల్స్ సందర్భంగా బెంగళూరులో హోటళ్లు, రెస్టారెంట్ల సమయం పొడిగింపు
  • జూలై 14, 15, 19 తేదీల్లో రాత్రి 3:30 గంటల వరకు ఫుడ్ సర్వ్ చేయడానికి, మ్యాచ్ స్క్రీనింగ్‌కు అనుమతి
  • నేషనల్ రెస్టారెంట్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (NRAI) విజ్ఞప్తి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపిన కర్ణాటక సీఎం డీకే శివకుమార్
  • శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా బాధ్యతాయుతంగా ఎంజాయ్ చేయాలని ఫ్యాన్స్‌కు ప్రభుత్వం సూచన

Bengaluru Restaurants | త్రినేత్ర.న్యూస్ : ఫుట్‌బాల్ (Football) అభిమానులకు కర్ణాటక ప్రభుత్వం అదిరిపోయే శుభవార్త చెప్పింది. ప్రస్తుతం జరుగుతున్న ఫిఫా వరల్డ్ కప్ 2026 (FIFA World Cup 2026) సెమీ ఫైనల్స్, ఫైనల్స్ మ్యాచ్‌లను ఫ్యాన్స్ అంతా కలిసి ఎంజాయ్ చేసేందుకు వీలుగా.. బెంగళూరులోని రెస్టారెంట్లు, పబ్స్ తెరిచి ఉంచే సమయాన్ని తెల్లవారుజామున 3:30 గంటల వరకు పొడిగిస్తూ మంగళవారం కీలక నిర్ణయం తీసుకుంది.

NRAI విజ్ఞప్తితో సర్కార్ సానుకూల నిర్ణయం

నేషనల్ రెస్టారెంట్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (NRAI) చేసిన ప్రత్యేక విజ్ఞప్తి మేరకు తమ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని కర్ణాటక సీఎం డీకే శివకుమార్ 'X' వేదికగా వెల్లడించారు. దీని ప్రకారం, ఎంపిక చేసిన రోజుల్లో రాత్రి 1 గంటకు మూసివేయాల్సిన హోటళ్లు, రెస్టారెంట్లు.. ఇకపై తెల్లవారుజామున 3:30 గంటల వరకు కస్టమర్లకు ఫుడ్ సర్వ్ చేయవచ్చు. అలాగే తమ ప్రాగంణాల్లో లేట్ నైట్ మ్యాచ్ స్క్రీనింగ్స్ (Match screenings) నిర్వహించుకోవచ్చు.

"ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల కొద్దీ అభిమానులను ఫుట్‌బాల్ ప్రభావితం చేస్తుంది. ఫిఫా వరల్డ్ కప్ అనేది ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూసే ఒక పండుగ. అయితే, ప్రజల భద్రత, శాంతిభద్రతల నిర్వహణ, పౌరుల సౌకర్యమే మా ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యం. కాబట్టి ఫ్యాన్స్ అందరూ బాధ్యతాయుతంగా మ్యాచ్‌లను ఎంజాయ్ చేయాలి, ఈ పొడిగించిన సమయాల్లో అధికారులకు పూర్తి సహకారం అందించాలి" అని సీఎం డీకే శివకుమార్ కోరారు.

టైమ్ జోన్ ఎఫెక్ట్ వల్లే ఈ క్రేజ్

ఈ ఏడాది జూన్ 11న ప్రారంభమైన ఫిఫా వరల్డ్ కప్‌కు అమెరికా, కెనడా, మెక్సికో దేశాలు సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్నాయి. మన ఇండియన్ టైమ్ జోన్‌కు, ఆ దేశాల టైమ్ జోన్‌కు చాలా వ్యత్యాసం ఉండటంతో మ్యాచ్‌లు ఇక్కడ అర్ధరాత్రి లేదా తెల్లవారుజామున ప్రసారం అవుతున్నాయి. 48 జట్లు తలపడిన ఈ మెగా టోర్నీ ఇప్పుడు క్లైమాక్స్‌కు చేరుకుంది. జూలై 14, 15 తేదీల్లో సెమీ ఫైనల్స్, జూలై 19న ఫైనల్ మ్యాచ్ జరగనుంది.

బెంగళూరు లాంటి మెట్రో సిటీలో ఫుట్‌బాల్‌కు విపరీతమైన క్రేజ్ ఉండటం, యువత అంతా పబ్స్, స్పోర్ట్స్ బార్స్‌ (Sports bars)లో లైవ్ స్క్రీనింగ్ చూసేందుకు ఇష్టపడటంతో.. రెస్టారెంట్ల యజమానులు సైతం ఈ నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement
Advertisement