త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

PM Modi | భార‌త్‌లో ప్రైవేట్ అంతరిక్ష రంగం వేగంగా అభివృద్ధి చెందుతోంది : ప్ర‌ధాని మోదీ

PM Modi | భార‌త్‌లో ప్రైవేట్ అంతరిక్ష రంగం వేగంగా అభివృద్ధి చెందుతోందని ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ (PM Modi) తెలిపారు. భారత అంతరిక్ష ప్రయాణంలో ప్రపంచ దేశాలు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

D

National | Published On Sep 10, 2026, 4.20 pm IST

PM Modi | భార‌త్‌లో ప్రైవేట్ అంతరిక్ష రంగం వేగంగా అభివృద్ధి చెందుతోంది : ప్ర‌ధాని మోదీ
Advertisement

PM Modi | త్రినేత్ర‌.న్యూస్ : భారత అంతరిక్ష ప్రయాణంలో (India's space journey) ప్రపంచ దేశాలు భాగస్వాములు కావాలని ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ (PM Modi) పిలుపునిచ్చారు. సురక్షితమైన, భద్రమైన, సుస్థిరమైన అంతరిక్ష వ్యవస్థకు భారత్​ మద్దతు ఇస్తుందని తెలిపారు. అంతర్జాతీయ చట్టాలకు అనుగుణంగా అంతరిక్ష కార్యకలాపాలు కొనసాగాలని పేర్కొన్నారు. పారిస్ (Paris)లో జ‌రుగుతున్న అంత‌ర్జాతీయ అంత‌రిక్ష స‌ద‌స్సును (International Space Summit) ఉద్దేశించి ప్ర‌ధాని వ‌ర్చువ‌ల్‌గా ప్ర‌సంగించారు. ఈ సంద‌ర్భంగా అంత‌రిక్ష రంగంలో భార‌త్ సాధిస్తున్న ప్ర‌గ‌తి, భ‌విష్య‌త్తు ల‌క్ష్యాల‌ను వివ‌రించారు.

2035 నాటికి భారత్ సొంతంగా అంతరిక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేయడమే లక్ష్యంగా పెట్టుకున్న‌ట్లు చెప్పారు. 2040 నాటికి చంద్రుడిపైకి భారత వ్యోమగామిని పంపడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. ప్రపంచ అంతరిక్ష రంగంలో భారత్ ఒక కీలక శక్తిగా ఎదిగిందని చెప్పారు. ఇందులో భార‌త అంత‌రిక్ష ప‌రిశోధ‌నా సంస్థ ఇస్రో కీల‌క పాత్ర పోషిస్తోంద‌ని పేర్కొన్నారు. అత్యుత్త‌మ ప‌నితీరు, త‌క్కువ ఖ‌ర్చుతో కూడిన ప్ర‌యోగాల‌తో ఇస్రో ప్ర‌పంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంద‌ని ప్ర‌ధాని ప్ర‌శంసించారు.

ఇప్ప‌టి వ‌ర‌కూ 34 దేశాల‌కు చెందిన 430కి పైగా ఉప‌గ్ర‌హాల‌ను భార‌తీయ రాకెట్లు విజ‌య‌వంతంగా అంత‌రిక్షంలోకి చేర‌వేసిన‌ట్లు వివ‌రించారు. చంద్రుని దక్షిణ ధ్రువంపై విజయవంతంగా ల్యాండింగ్ కావడం, సూర్యుడి రహస్యాలను ఛేదించేందుకు చేపట్టిన ఆదిత్య-ఎల్1 (Aditya-L1) మిషన్ దేశ సామర్థ్యాన్ని చాటిచెప్పాయ‌ని పేర్కొన్నారు. భారత్ చేపట్టిన వివిధ అంతరిక్ష మిషన్ల విజయాల వెనుక ఇస్రో శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు, టెక్నీషియన్ల కృషి ఎంతో ఉందని ప్రధాని కొనియాడారు.

అదే స‌మ‌యంలో భార‌త్‌లో ప్రైవేట్ అంతరిక్ష రంగం వేగంగా అభివృద్ధి చెందుతోందని ప్ర‌ధాని చెప్పుకొచ్చారు. భార‌త అంత‌రిక్ష కార్య‌క్ర‌మ ప్రారంభ ద‌శ నంచీ ఫ్రాన్స్ ఓ న‌మ్మ‌క‌మైన భాగ‌స్వామిగా ఉంద‌ని గుర్తు చేశారు. ఇరు దేశాలూ భ‌విష్య‌త్తులోనూ అంత‌రిక్ష స‌హ‌కారాన్ని మ‌రింత విస్త‌రిస్తామ‌ని వెల్ల‌డించారు. ఇందులో భాగంగా ఇరు దేశాల కంపెనీల మధ్య మూడు నూతన ఒప్పందాలు కుదిరినట్లు అధికారికంగా ప్రకటించారు. ఉపగ్రహ ప్రయోగాలు, స్పేస్ సర్వైలెన్స్, మైక్రోశాటిలైట్ టెక్నాలజీ విభాగాలకు సంబంధించి ఒప్పందం కుదిరిన‌ట్లు తెలిపారు.

Also Read..

సిగ్గుగా ఉంది.. ప్రారంభోత్స‌వానికి నేను రాను : ర‌హ‌దారి నిర్మాణం ఆల‌స్యంపై గ‌డ్క‌రీ అస‌హ‌నం

క్యూర్ కోడ్‌ స్కాన్ చేసి.. న‌కిలీ స్క్రీన్ షాట్ చూపించి

921 ఆస్ప‌త్రుల్లో ఈహెచ్ఎస్ అమ‌లు

Advertisement
Advertisement