త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

New EHS | 921 ఆస్ప‌త్రుల్లో ఈహెచ్ఎస్ అమ‌లు

New EHS | రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు, వారి కుటుంబ సభ్యులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు నూతన ఉద్యోగుల ఆరోగ్య పథకంను అమలు చేస్తున్నామని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ తెలిపారు.

S

Telangana | Published On Sep 10, 2026, 4.14 pm IST

New EHS | 921 ఆస్ప‌త్రుల్లో ఈహెచ్ఎస్ అమ‌లు
Advertisement
  • నెల‌కు రూ. 88 కోట్ల నిధులు ఖ‌ర్చు
  • ఈ ప‌థ‌కం కింద 17 ల‌క్ష‌ల ల‌బ్ధిదారులు
  • మండ‌లిలో మంత్రి దామోద‌ర వెల్ల‌డి

New EHS | త్రినేత్ర‌.న్యూస్ : రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు, వారి కుటుంబ సభ్యులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు నూతన ఉద్యోగుల ఆరోగ్య పథకంను అమలు చేస్తున్నామని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ తెలిపారు. ఈ అంశంపై గురువారం శాసన మండలిలో ఎమ్మెల్సీలు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు.

2026 జూలై 17 నుంచి ఈ పథకం అమల్లోకి వచ్చిందని మంత్రి తెలిపారు. చీఫ్ సెక్రటరీ
అధ్యక్షతన నూతన ఈహెచ్ఎస్ ట్రస్ట్ (ఈహెచ్‌సీటీ) ఏర్పాటు చేశామని చెప్పారు. 30 మంది సభ్యులతో ఉన్న ఈ ట్రస్ట్‌లో ఉద్యోగ సంఘాల నుంచి 10 మంది, పెన్షనర్ సంఘాల నుంచి 3 మంది, ప్రభుత్వం నుంచి 16 మంది సభ్యులు ఉన్నారని తెలిపారు.

ఈ ప‌థ‌కానికి ఏడాదికి రూ. 1,056 కోట్ల బ‌డ్జెట్

ఉద్యోగులు, పెన్షనర్లు తమ బేసిక్ పే/చివరిగా పొందిన పెన్షన్‌లో 1.5 శాతం చొప్పున నెలకు చెల్లిస్తుండగా, అంతే మొత్తాన్ని ప్రభుత్వం కూడా ఇస్తోందని మంత్రి తెలిపారు. ఉద్యోగులు, పెన్షనర్ల నుంచి నెలకు రూ.44 కోట్లు, ప్రభుత్వం నుంచి మరో రూ.44 కోట్లు కలిపి నెలకు రూ.88 కోట్లు సమకూరుతున్నాయని చెప్పారు. ఈ పథకానికి ఏడాదికి రూ.1,056 కోట్ల బడ్జెట్ ఉందని తెలిపారు.

807 ప్ర‌యివేటు ఆస్ప‌త్రుల్లో అమ‌లు

నూతన ఉద్యోగుల ఆరోగ్య పథకం కింద 921 ఆసుపత్రుల్లో ఇన్‌పేషెంట్ వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయని మంత్రి తెలిపారు. ఇందులో 114 ప్రభుత్వ, 807 ప్రైవేట్ ఆసుపత్రులు ఉన్నాయని చెప్పారు.

37 వెల్‌నెస్ కేంద్రాల ఏర్పాటు

ఉద్యోగులు, పెన్షనర్లు, వారి కుటుంబ సభ్యులకు ఓపీ వైద్యం, వైద్య పరీక్షలు, మందులు అందించేందుకు ప్రస్తుతం 12 జిల్లాల్లో 12 వెల్‌నెస్ కేంద్రాలు పనిచేస్తున్నాయని మంత్రి తెలిపారు.

మరో 25 వెల్‌నెస్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించామని చెప్పారు. ఇందులో 21 జిల్లాల్లో, హైదరాబాద్‌, మేడ్చల్‌-మల్కాజిగిరిలో అధిక రద్దీ ఉన్న ప్రాంతాల్లో మరో 4 కేంద్రాలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. దీంతో మొత్తం వెల్‌నెస్ కేంద్రాల సంఖ్య 37కు చేరుతుందని చెప్పారు.

ఇప్పటివరకు 8,511 కేసులకు రూ.55.14 కోట్లు

పథకం ప్రారంభమైన తర్వాత ఇప్పటివరకు 8,511 కేసులకు రూ.55.14 కోట్ల ప్రీ-ఆథరైజేషన్ ఇచ్చామని మంత్రి తెలిపారు.

17 లక్షలకు పైగా లబ్ధిదారులు

నూతన ఉద్యోగుల ఆరోగ్య పథకం పరిధిలో 17 లక్షలకు పైగా లబ్ధిదారులు ఉన్నారని మంత్రి తెలిపారు. అర్హులైన వారికి డిజిటల్ ఆరోగ్య కార్డులను వెబ్ పోర్టల్ ద్వారా జారీ చేస్తున్నామని చెప్పారు.

ఓటీపీ ద్వారా స్వయంగా హెల్త్ కార్డును డౌన్‌లోడ్ చేసుకునే అవకాశం కల్పించామని తెలిపారు. అందరికీ హెల్త్ కార్డులు ఇస్తామని, ఉద్యోగులు కోరుకున్న విధంగా ఆరోగ్య సేవలు అందిస్తామని మంత్రి స్పష్టం చేశారు.

Advertisement
Advertisement