త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Pawan Khera Bail Plea | కరుడుగట్టిన నేరస్థుడేం కాదు.. అరెస్ట్ అవసరమా? సుప్రీంకోర్టులో పవన్ ఖేరా బెయిల్ పిటిషన్‌పై ఆసక్తికర వాదనలు

అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ సతీమణిపై వివాదాస్పద ఆరోపణలు చేసిన కేసులో కాంగ్రెస్ సీనియర్ నేత పవన్ ఖేరా ముందస్తు బెయిల్ పిటిషన్‌పై సుప్రీం కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. పవన్ ఖేరా కరుడుగట్టిన నేరస్థుడు కాదని, కేవలం పరువు నష్టం కేసులో అరెస్ట్ చేయాల్సిన అవసరం లేదని ఆయన తరపు న్యాయవాది ఏఎం సింఘ్వీ వాదించారు. ఫేక్ డాక్యుమెంట్ల మూలాలు లాగేందుకు కస్టోడియల్ విచారణ అవసరమని అస్సాం ప్రభుత్వం వాదించింది.

J

National | Published On Apr 30, 2026, 4.13 pm IST

Pawan Khera Bail Plea | కరుడుగట్టిన నేరస్థుడేం కాదు.. అరెస్ట్ అవసరమా? సుప్రీంకోర్టులో పవన్ ఖేరా బెయిల్ పిటిషన్‌పై ఆసక్తికర వాదనలు
Advertisement

Pawan Khera Bail Plea | త్రినేత్ర.న్యూస్ : అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ సతీమణిపై ఆరోపణల కేసులో చిక్కుకున్న కాంగ్రెస్ సీనియర్ నేత పవన్ ఖేరా ముందస్తు బెయిల్ పిటిషన్‌పై గురువారం సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. ఇరు వర్గాల వాదనలు విన్న జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ అతుల్ చందూర్కర్‌లతో కూడిన ధర్మాసనం.. తీర్పును రిజర్వ్ చేసింది. ఈ సందర్భంగా కోర్టులో ఆసక్తికర వాదనలు జరిగాయి.

ఆయనొక 'కౌబాయ్' లా మాట్లాడుతున్నారు: సింఘ్వీ

పవన్ ఖేరా తరపున సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ వాదనలు వినిపిస్తూ.. అస్సాం సీఎం హిమంత బిస్వా శర్మపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. "ఖేరాను జీవితకాలం అస్సాం జైలులోనే ఉంచుతామని సీఎం బెదిరిస్తున్నారు. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న వ్యక్తి ఒక 'కౌబాయ్' లేదా 'రాంబో' లాగా మాట్లాడటం దారుణం. ఆయన మాటలు వింటే డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కూడా ఆవేదన చెందుతారు. ఖేరా కరుడుగట్టిన నేరస్థుడు కాదు. ఆర్టికల్ 21 ప్రకారం ఆయన వ్యక్తిగత స్వేచ్ఛను కాపాడాలి. ఇది కేవలం పరువు నష్టం కేసు మాత్రమే, దీనికి అరెస్ట్ చేసి కస్టోడియల్ విచారణ చేయాల్సిన అవసరం ఏముంది?" అని సింఘ్వీ ప్రశ్నించారు.

ఫేక్ పత్రాలు ఎవరు సృష్టించారు?: తుషార్ మెహతా కౌంటర్

అస్సాం ప్రభుత్వం తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపిస్తూ.. సింఘ్వీ వాదనలను తిప్పికొట్టారు. ఖేరా చూపించిన పాస్‌పోర్టులు, పత్రాలు పూర్తిగా నకిలీవని స్పష్టం చేశారు. "ఆ ఫేక్ డాక్యుమెంట్లను ఎవరు సృష్టించారు? ఈ కుట్ర వెనుక విదేశీ శక్తుల ప్రమేయం ఏమైనా ఉందా? అన్న విషయాలు తెలియాలంటే కస్టోడియల్ విచారణ తప్పనిసరి. ఎఫ్‌ఐఆర్ నమోదైనప్పటి నుంచి ఖేరా పరారీలో ఉన్నారు" అని మెహతా కోర్టుకు తెలిపారు.

అసలు కేసు ఏమిటి?

ఏప్రిల్ 4న జరిగిన ఒక ప్రెస్ మీట్‌లో పవన్ ఖేరా.. అస్సాం సీఎం భార్య రినికి భూయాన్ శర్మకు మూడు దేశాల పాస్‌పోర్టులు ఉన్నాయని, దుబాయ్‌లో ఆస్తులు ఉన్నాయని ఆరోపించారు. ఈ ఆరోపణలను శర్మ కుటుంబం తీవ్రంగా ఖండించింది. ఇవి పాకిస్థాన్ సోషల్ మీడియా గ్రూపులు సృష్టించిన ఫేక్ డాక్యుమెంట్లు అని కొట్టిపారేసింది. దీనిపై గువాహటి పోలీసులు పవన్ ఖేరాపై చీటింగ్, ఫోర్జరీ సహా పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

హైకోర్టులో చుక్కెదురు.. సుప్రీంను ఆశ్రయించిన ఖేరా

ఈ కేసులో అరెస్ట్ నుంచి రక్షణ కల్పించేందుకు గౌహతి హైకోర్టు నిరాకరించింది. ఇది కేవలం పరువు నష్టం కేసని చెప్పలేమని, డాక్యుమెంట్ల మూలాలు తెలుసుకునేందుకు పోలీసుల విచారణ అవసరమని స్పష్టం చేస్తూ బెయిల్ పిటిషన్‌ను కొట్టివేసింది. అంతకుముందు ఏప్రిల్ 10న తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ట్రాన్సిట్ బెయిల్‌ను ఏప్రిల్ 15న సుప్రీం కోర్టు స్టే చేసింది. గౌహతి హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఇరు పక్షాల సుదీర్ఘ వాదనల అనంతరం సర్వోన్నత న్యాయస్థానం తీర్పును రిజర్వ్ చేసింది.

Advertisement
Advertisement