త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Nitish Kumar | రాజ్య‌స‌భ స‌భ్యుడిగా నితీశ్ కుమార్ ప్ర‌మాణం.. బీహార్ త‌దుప‌రి సీఎం ఎవ‌రో..?

Nitish Kumar | బీహార్ సీఎం (Bihar CM) నితీశ్ కుమార్ (Nitish Kumar) రాజ్య‌స‌భ స‌భ్యుడిగా (Rajya Sabha MP) ప్ర‌మాణ స్వీకారం చేశారు. శుక్ర‌వారం మ‌ధ్యాహ్నం 12:15 గంట‌ల‌కు ఆయ‌న ప్ర‌మాణం చేశారు.

D

National | Published On Apr 10, 2026, 2.04 pm IST

Nitish Kumar | రాజ్య‌స‌భ స‌భ్యుడిగా నితీశ్ కుమార్ ప్ర‌మాణం.. బీహార్ త‌దుప‌రి సీఎం ఎవ‌రో..?
Advertisement

Nitish Kumar | బీహార్ సీఎం (Bihar CM) నితీశ్ కుమార్ (Nitish Kumar) రాజ్య‌స‌భ స‌భ్యుడిగా (Rajya Sabha MP) ప్ర‌మాణ స్వీకారం చేశారు. శుక్ర‌వారం మ‌ధ్యాహ్నం 12:15 గంట‌ల‌కు ఆయ‌న ప్ర‌మాణం చేశారు. ఉపరాష్ట్ర‌ప‌తి ఎన్‌. రాధాకృష్ణ‌న్ త‌న ఛాంబ‌ర్‌లో నితీశ్ చేత ప్ర‌మాణ‌స్వీకారం చేయించారు. ఈ కార్య‌క్ర‌మానికి బీహార్ ఉప ముఖ్య‌మంత్రులు విజ‌య్ కుమార్ సిన్హా (Vijay Kumar Sinha), సామ్రాట్ చౌద‌రి (Samrat Choudhary), కేంద్ర మంత్రులు జేపీ న‌డ్డా, నిర్మ‌లా సీతారామ‌న్‌, అర్జున్ రామ్ మేఘ్వాల్ స‌హా ప‌లువురు బీజేపీ, జేడీయూ నేత‌లు పాల్గొన్నారు. మార్చి 16న రాజ్యసభకు ఏక‌గ్రీవంగా ఎన్నికైన నితీశ్‌.. మార్చి 30న బీహార్ శాసన మండలి సభ్యత్వానికి రాజీనామా చేశారు.

బీహార్ త‌దుప‌రి సీఎం ఎవ‌రో..?

ఇక రాజ్య‌స‌భ స‌భ్యుడిగా ప్ర‌మాణం చేయ‌డంతో రికార్డు స్థాయిలో ముఖ్య‌మంత్రిగా కొన‌సాగిన నితీశ్ కుమార్ (Nitish Kumar) త‌న ప‌ద‌వికి రాజీనామా చేయ‌నున్నారు. ఈ ప‌రిణామాల‌తో బీహార్ త‌దుప‌రి సీఎం ఎవ‌ర‌న్న‌ది ప్ర‌స్తుతం ఆస‌క్తిక‌రంగా మారింది. బీహార్‌కు బీజేపీ ముఖ్య‌మంత్రి (Bihar May Get A BJP Chief Minister) వ‌స్తారంటూ ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇప్ప‌టి వ‌ర‌కూ బీహార్ రాష్ట్రాన్ని జేడీయూ, ఆర్జేడీ నేత‌లే పాలించారు. అయితే, ఇప్పుడు తొలిసారి బీజేపీ నేత ముఖ్య‌మంత్రి అయ్యే అవ‌కాశం ఉంది. సీఎం పీఠాన్ని బీజేపీకి చెందిన నేత అధిష్టించ‌నున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. ప్ర‌స్తుతం ఉప ముఖ్య‌మంత్రిగా ఉన్న సామ్రాట్ చౌద‌రి సీఎంగా బాధ్య‌త‌లు చేప‌ట్టే అవ‌కాశం ఉన్న‌ట్లు స‌మాచారం. అయితే, దీనిపై స్ప‌ష్ట‌త లేదు.

నితీశ్ కుమారుడికి డిప్యూటీ సీఎం..?

మ‌రోవైపు ఇప్ప‌టి వ‌ర‌కూ ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల‌కు దూరంగా ఉన్న నితీశ్‌కుమారుడు నిషాంత్ ఇటీవ‌లే జేడీయూలో చేరిన విష‌యం తెలిసిందే. త‌న తండ్రి కేంద్ర రాజ‌కీయాల్లోకి వెళ్ల‌డంతో ఆయ‌న రాష్ట్ర రాజ‌కీయాల్లో క్రియాశీల‌కంగా మారారు. ఈ నేప‌థ్యంలో నిషాంత్‌కు ఉప‌ముఖ్య‌మంత్రి ప‌ద‌వి ఇచ్చే అవకాశం ఉంద‌ని సంబంధిత వ‌ర్గాల‌ను ఉటంకిస్తూ జాతీయ మీడియాలో వ‌రుస క‌థ‌నాలు వ‌స్తున్నాయి. ఇక అబేంద్క‌ర్ జ‌యంతి సంద‌ర్భంగా ఈ నెల 14న బీహార్ నూత‌న సీఎంను ఎన్డీయే (NDA) కూట‌మి ఎన్నుకునే అవ‌కాశం ఉన్న‌ట్లు తెలుస్తున్న‌ది.

రికార్డు స్థాయిలో 10 సార్లు సీఎంగా..

గ‌తేడాది జ‌రిగిన బీహార్ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో 243 స్థానాల‌కు గాను బీజేపీ కూట‌మి 202 స్థానాల్లో ఘ‌న విజ‌యం సాధించింది. అందులో బీజేపీకి 89 సీట్లు రాగా, జేడీయూ 85 చోట్ల‌, లోక్ జ‌న‌శ‌క్తి పార్టీ (రాంవిలాస్‌) 19 స్థానాలచొప్పున గెలుపొందాయి. ముఖ్య‌మంత్రిగా నాలుగు నెల‌లు మాత్ర‌మే కొన‌సాగిన నితీశ్ కుమార్ తాజాగా త‌న ప‌ద‌వి నుంచి త‌ప్పుకుని రాజ్య‌స‌భ‌కు వెళ్తుండ‌టం గ‌మ‌నార్హం. దీంతో సీఎంగా తన 22ఏళ్ల రికార్డుకు బ్రేక్ పడుతుంది. ఇప్పటి వ‌ర‌కు బీహార్ సీఎంగా నితీశ్ 10 సార్లు పనిచేశారు.

కుర్మి వర్గానికి చెందిన నితీశ్ కుమార్ 1951, మార్చి 1న జన్మించారు. 1972లో బీహార్ కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ నుంచి నితీశ్ మెకానికల్ ఇంజినీరింగ్ పట్టా పొందారు. తొలుత బీహార్ రాష్ట్ర విద్యుత్ బోర్డులో పనిచేశారు. ఆ తర్వాత రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ప్రముఖ సోషలిస్టు నాయకులైన జయప్రకాశ్ నారాయణ్, రామ్ మనోహర్ లోహియా, ఎస్‌ఎన్ సిన్హా, వీపీ సింగ్‌లతో కలిసి పనిచేశారు.

1974 నుంచి 1977 మధ్య జయప్రకాశ్ నారాయణ్ ఉద్యమంలో నితీశ్ పాల్గొన్నారు. ఎస్‌ఎన్ సిన్హా నేతృత్వంలోని జనతా పార్టీలో చేరారు. 1977లోనే తొలిసారి హర్‌నౌత్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి జనతా పార్టీ టికెట్‌పై పోటీచేసి ఓడిపోయారు. 1985లో అదే స్థానం నుంచి గెలుపొంది మొద‌టిసారిగా శాసన సభలో అడుగుపెట్టారు. 1989లో జనతాదళ్ జనరల్ సెక్రటరీ పదవిని చేపట్టారు. అదే ఏడాది జ‌రిగిన లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో బాడ్ నియోజకవర్గం నుంచి పోటీచేసి విజ‌యం సాధించారు. ఆ తర్వాత మొత్తంగా ఆరుసార్లు ఆయన పార్లమెంటుకు ఎన్నికయ్యారు.

ఏడు రోజుల సీఎంగా..

సుదీర్ఘ రాజ‌కీయ అనుభ‌వం ఉన్న నితీశ్ తొలిసారి ముఖ్యమంత్రిగా మార్చి 2000లో బాధ్యతలు చేపట్టారు. 324 మంది సభ్యులున్న అసెంబ్లీలో అప్పుడు ఎన్‌డీఏకు 151 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంది. మరోవైపు లాలూ చేతిలో 159 మంది ఎమ్మెల్యేలున్నారు. వీరిద్దరికీ సరిపడా ఆధిక్యం (163) దక్కలేదు. అయితే, బల పరీక్షకు ముందే నితీశ్ రాజీనామా చేశారు. అలా ఆయ‌న‌ ఏడు రోజులపాటే సీఎంగా కొనసాగారు.

ఇక నితీశ్ పూర్తిస్థాయిలో ఐదేళ్లపాటు ముఖ్యమంత్రిగా కొనసాగింది మాత్రం 2005లోనే. ఆ తర్వాతి ఎన్నిక (2010)ల్లోనూ ఆయనే విజయం సాధించారు. అయితే, 2014లో జ‌రిగిన‌ లోక్‌సభ ఎన్నికల్లో ఆయ‌న‌ పార్టీ ఘోరంగా ఓడిపోవ‌డంతో నైతిక బాధ్యత వహించి ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. ఆ సమయంలో ఎన్‌డీఏ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చిన‌ జేడీయూ విడిగా పోటీచేసింది. నితీశ్ రాజీనామా అనంతరం జీతన్ రామ్ మాంఝీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేప‌ట్టారు.

2015 అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్జేడీతో పొత్తుపెట్టుకున్న నితీశ్.. ఘన విజయం సాధించారు. దీంతో మరోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. అయితే తేజస్వి యాదవ్‌పై అవినీతి ఆరోపణలు వెలుగుచూడటంతో మహా కూటమి బీటలు వారింది. దీంతో సీఎం పదవికి నితీశ్ రాజీనామా చేశారు. అయితే, వెంటనే ఎన్‌డీఏతో చేతులు కలిపి మళ్లీ ముఖ్యమంత్రి పదవిని చేపట్టారు. 2020 ఎన్నికల్లోనూ ఎన్‌డీఏతో కలిసే నితీశ్ బరిలోకి దిగారు. నితీశ్ ముఖ్యమంత్రి అయినప్పటికీ జేడీయూకి తక్కువ సీట్లు రావ‌డంతో ఆయనపై బీజేపీ నుంచి ఒత్తిడి పెరిగింది. రెండేండ్ల‌పాటు బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని నడిపిన నితీశ్ మళ్లీ యూ టర్న్ తీసుకొని ఆర్జేడీ, కాంగ్రెస్‌తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. 2022 ఆగస్టులో ఆయ‌న‌ మళ్లీ ముఖ్యమంత్రి అయ్యారు. డిప్యూటీ సీఎంగా తేజస్వీ యాదవ్‌ను నియమించారు. అనంత‌రం జ‌రిగిన ప‌రిణామాల‌తో నితీశ్ మ‌రోసారి ఎన్డీఏతో చేతులు క‌లిపారు.

Also Read..

ఈనెల 12న‌ మంచిర్యాల జిల్లా పర్యటనకు కేటీఆర్

అల‌హాబాద్ హైకోర్టు జ‌డ్జి జ‌స్టిస్ య‌శ్వంత్ వ‌ర్మ రాజీనామా

సీఎం భార్య‌పై ఆరోప‌ణ‌లు.. కాంగ్రెస్ నేత ప‌వ‌న్ ఖేరాకు తెలంగాణ హైకోర్టులో ఊర‌ట‌

Advertisement
Advertisement