త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Niranjan Reddy | గోదావరి – కావేరి అనుసంధానానికి ఎలా ఒప్పుకుంటారు?: మాజీ మంత్రి నిరంజ‌న్‌రెడ్డి

Niranjan Reddy | గోదావరిలో తెలంగాణ వాటా తేలకముందే కావేరి అనుసంధానానికి ఒప్పుకోవడం మూలంగా తెలంగాణ శాశ్వతంగా గోదావరి జలాల మీద హక్కులు కోల్పోతుందని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజ‌న్‌రెడ్డి పేర్కొన్నారు. గోదావరి-కావేరి అనుసంధానం ఏపీ పునర్విభజన చట్టం-2014ను ఉల్లంఘించడమేన‌న్నారు.

S

Telangana | Published On May 21, 2026, 11.41 am IST

Niranjan Reddy | గోదావరి – కావేరి అనుసంధానానికి ఎలా ఒప్పుకుంటారు?: మాజీ మంత్రి నిరంజ‌న్‌రెడ్డి
Advertisement
  • వాటా తేల‌క‌ముందే గొర్రెళ్లా త‌లూపుతున్నారు
  • తెలంగాణ గొంతు కోసేందుకు కాంగ్రెస్ సిద్ధ‌మైంది
  • కాంగ్రెస్‌, బీజేపీ క‌లిసి మ‌న ప్ర‌యోజ‌నాల‌ను ఆంధ్రాకు తాక‌ట్టు పెడుతున్నాయి
  • ఇప్పుడు జాగ్ర‌త్త ప‌డ‌క‌పోతే శాశ్వ‌త న‌ష్ట‌మే
  • లేదంటే ప్ర‌జా ఉద్య‌మం త‌ప్ప‌దు
  • మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజ‌న్‌రెడ్డి హెచ్చ‌రిక‌

Niranjan Reddy | త్రినేత్ర‌.న్యూస్‌: గోదావరిలో తెలంగాణ వాటా తేలకముందే కావేరి అనుసంధానానికి ఒప్పుకోవడం మూలంగా తెలంగాణ శాశ్వతంగా గోదావరి జలాల మీద హక్కులు కోల్పోతుందని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజ‌న్‌రెడ్డి పేర్కొన్నారు. వరద జలాల పేరుతో ఆంధ్రప్రదేశ్ బురద రాజకీయం చేస్తుంటే తెలంగాణ కాంగ్రెస్ సర్కార్ గుడ్డిగా తలూపుతుందని మండిప‌డ్డారు. గోదావరి-కావేరి అనుసంధానం ఏపీ పునర్విభజన చట్టం-2014ను ఉల్లంఘించడమేన‌న్నారు. ఈ మేర‌కు ఆయ‌న ఒక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు.

రాత‌పూర్వ‌క ఒప్పందం చేసుకోవాలి..

కాంగ్రెస్ సర్కారు నిర్వాకం మూలంగా కాళేశ్వరం, ప్రాణహిత చేవెళ్ల, హైదరాబాద్ తాగునీటిపై తీవ్ర ప్రభావం చూపుతుంది. కావేరి అనుసంధానం పేరుతో గోదావరి నీళ్లను తరలిస్తున్న ఏపీ కృష్ణా జలాల్లో తన వాటాను వదులుకోవాలని తెలంగాణ డిమాండ్ చేయాలి. ఈ మేరకు రాతపూర్వక ఒప్పందం చేసుకోవాలి. నాగార్జున సాగర్ ను బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ గా ఉపయోగించడం మూలంగా తెలంగాణకు దీర్ఘకాలిక నష్టం వాటిల్లుతుంది. ఇచ్చంపల్లి, సమ్మక్క - సారక్క, ఇంద్రావతి లింక్ చేస్తే తెలంగాణలో ఫ్లడ్ కంట్రోల్ కష్టం అవుతుంది అని సింగిరెడ్డి వివ‌రించారు.

968 టీఎంసీల వాటాను పూర్తిగా ఉప‌యోగించుకోవాలి..

తెలంగాణ కృష్ణా ట్రిబ్యునల్-II (KWDT-II) ముందు డిమాండ్ చేసిన విధంగా కృష్ణా జలాల్లో 763 టీఎంసీలు, గోదావరి జలాల్లో Godavari Water Disputes Tribunal (1980) ప్రకారం తెలంగాణకు 968 టీఎంసీల వాటా ఉంది. తెలంగాణ దీన్ని పూర్తిగా ఉపయోగించుకోవాలి. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి నీటి వాడకం కోసం తెలంగాణ ప్రాజెక్టులను ప్రతిపాదిస్తే అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్రీశైలం హైడ్రో ఎలక్ట్రిసిటీకి మాత్రమే వాడుకోవాలని అభ్యంతరాలు తెలిపి శ్రీశైలం రిజర్వాయర్ ను తెలంగాణకు దూరం చేసింది.

తర్వాత కాలంలో వాటిని పాటించకుండా చెన్నైకి తాగునీటి పేరుతో పోతిరెడ్డిపాడును చేపట్టి 1500 క్యూసెక్కులు తీసుకెళ్లాల్సిన చోట లక్ష క్యూసెక్కులు తరలిస్తూ శ్రీశైలం ప్రాజెక్టును దారి మళ్లించారు. అదే తరహాలో నాగార్జున సాగర్ జలాశయం నుండి నీటిని ఏపీకి తరలించే కుట్రలో భాగంగా గోదావరి- కావేరి అనుసంధానం పేరుతో దీన్ని చేపడుతున్నారు. తెలంగాణ ఇప్పుడు జాగ్రత్త పడకుంటే శాశ్వతంగా నష్టపోతుంది.

అధిష్టానాల చేతుల్లో తోలుబొమ్మ‌లు..

తెలంగాణ హక్కులు, వాటాల గురించి డిమాండ్ చేయకుండా ఏపీ ప్రతిపాదనలకు తెలంగాణ కాంగ్రెస్ గొర్రెలా తలూపుతుంది. తెలంగాణ ఉద్యమం మొదలయిందే నీళ్లు, నిధులు, నియామకాలు ప్రాతిపదికన. కృష్ణా, గోదావరి జలాల్లో తెలంగాణ ప్రయోజనాలకు ఏ మాత్రం భంగం వాటిల్లినా ప్రజా ఉద్యమం లేవదీస్తాం. కాంగ్రెస్, బీజేపీ రెండూ కలిసి తెలంగాణ ప్రయోజనాలను ఆంధ్రాకు తాకట్టుపెడుతున్నాయి. తెలంగాణ కాంగ్రెస్, బీజేపీ ఎంపీలు తెలంగాణ ప్రయోజనాల కోసం పోరాడకుండా పార్టీ అధిష్టానాల చేతుల్లో తోలుబొమ్మలుగా మారారు అని మాజీ మంత్రి నిరంజ‌న్‌రెడ్డి ఆరోపించారు.

Advertisement
Advertisement