త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Nitin Gadkari | E20 వివాదం.. కోర్టును ఆశ్ర‌యించిన నితిన్ గ‌డ్క‌రీ

Nitin Gadkari | ఇథ‌నాల్ కార్య‌క్ర‌మంతో త‌న కుటుంబం ల‌బ్ధి పొందుతోందంటూ సోష‌ల్ మీడియాలో జ‌రుగుతున్న ప్ర‌చారంపై కేంద్ర రోడ్డు ర‌వాణా శాఖ మంత్రి నితిన్ గ‌డ్క‌రీ (Nitin Gadkari) న్యాయ‌పోరాటానికి దిగారు. త‌న కుటుంబ ప‌రువుకు భంగం క‌లిగించేలా పోస్టులు చేస్తున్న వారిపై క‌ఠిన చ‌ర్య‌లకు ఆదేశించాలని కోరుతూ బాంబే హైకోర్టులో(Bombay High Court) పిటిష‌న్ దాఖ‌లు చేశారు.

D

National | Published On Jul 27, 2026, 3.43 pm IST

Nitin Gadkari | E20 వివాదం.. కోర్టును ఆశ్ర‌యించిన నితిన్ గ‌డ్క‌రీ
Advertisement

Nitin Gadkari | ఇథ‌నాల్ కార్య‌క్ర‌మంతో త‌న కుటుంబం ల‌బ్ధి పొందుతోందంటూ సోష‌ల్ మీడియాలో జ‌రుగుతున్న ప్ర‌చారంపై కేంద్ర రోడ్డు ర‌వాణా శాఖ మంత్రి నితిన్ గ‌డ్క‌రీ న్యాయ‌పోరాటానికి దిగారు. సోష‌ల్ మీడియాలో వ‌స్తున్న పోస్టులు త‌న కుటుంబ ప‌రువుకు భంగం క‌లిగించేలా ఉన్నాయ‌ని, పోస్టులు చేసే వారిపై క‌ఠిన చ‌ర్య‌ల‌కు ఆదేశించాల‌ని కోరుతూ గ‌డ్క‌రీ బాంబే హైకోర్టును ఆశ్ర‌యించారు. ఈ మేర‌కు పిటిష‌న్ దాఖ‌లు చేశారు.

E20 పెట్రోల్‌కు వ్య‌క్తిగ‌తంగా త‌న‌ని బాధ్యుడిని చేస్తున్నార‌ని గ‌డ్క‌రీ ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఇథ‌నాల్ మిశ్ర‌మం వ‌ల్ల త‌న కుటుంబం లాభ‌ప‌డుతోంద‌ని నెటిజ‌న్లు డీప్‌ఫేక్ వీడియోలు, పోస్టులు పెడుతూ త‌ప్పుడు కంటెంట్ వ్యాప్తి చేస్తున్నార‌ని మండిప‌డ్డారు. ఇలాంటి కంటెంట్ వ్యాప్తి చేసే వ్య‌క్తులు, స‌హ‌క‌రించిన వారిపై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని విజ్ఞ‌ప్తి చేశారు. ఈ పిటిషన్‌పై విచార‌ణ జ‌రిపిన హైకోర్టు.. ఇలాంటి కంటెంట్ వ్యాప్తికి స‌హ‌క‌రించిన మెటా , గూగుల్‌తో పాటూ ఇతర సోషల్ మీడియా సంస్థలపై పరువు నష్టం దావా వేసుకునేందుకు గ‌డ్క‌రీకి అనుమతిచ్చింది.

నా కుటుంబ వాటా 0.7 శాతం మాత్ర‌మే

కేంద్ర ప్రభుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా అమ‌లు చేస్తున్న‌ ఇథనాల్ బ్లెండింగ్ కార్యక్రమాన్ని గ‌డ్క‌రీ మొద‌ట్నుంచీ స‌మ‌ర్థిస్తూ వ‌స్తున్నారు. అయితే, వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాల కోస‌మే ఇథ‌నాల్ బ్లెండింగ్ కార్య‌క్ర‌మాన్ని గ‌డ్క‌రీ ప్రోత్స‌హిస్తున్నానంటూ సోష‌ల్ మీడియాలో విమ‌ర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ విధానం వల్ల ఆయ‌న‌ కుటుంబానికి వ్యక్తిగతంగా లాభాలు చేకూరుతున్నాయంటూ నెటిజ‌న్లు పోస్టులు పెడుతున్నారు. దీనిపై గ‌డ్క‌రీ ఇప్ప‌టికే స్ప‌ష్ట‌త కూడా ఇచ్చారు. త‌న కుమారుల వ్యాపారంలో ఇథ‌నాల్ వాటా నామ మాత్ర‌మేన‌ని స్ప‌ష్టం చేశారు.

"దేశంలో ఇథ‌నాల్‌ ప్ర‌వేశ‌పెట్ట‌క‌ముందే మా కుటుంబం షుగ‌ర్ వ్యాపారంలో ఉంది. నా కుమారుల వ్యాపారంలో ఇథ‌నాల్ వాటా నామ మాత్ర‌మే. మొత్తం ఉత్ప‌త్తికి వారి స‌హ‌కారం కూడా చాలా త‌క్కువ‌. దేశవ్యాప్తంగా సుమారు 550 యూనిట్లలో ప్రతి ఏడాది దాదాపు 1,500 కోట్ల లీటర్ల ఇథనాల్ ఉత్పత్తి జరుగుతోంది. ఇందులో నా కుటుంబ‌ సంస్థలకు ఉన్న వాటా కేవలం 0.07 శాతం మాత్రమే. అంతేకాదు, నా కుమారుల సంస్థ‌ల‌కు రూ.1,600 కోట్ల అప్పు ఉంది. ఈ వ్యాపారాలు నా కుమారులు న‌డుపుతున్నారు. ఇక ఇథ‌నాల్ కార్య‌క్ర‌మాన్ని పెట్రోలియం మంత్రిత్వ శాఖ నిర్వ‌హిస్తోంది. ధ‌ర‌ల‌ను కేబినెట్ నిర్ణ‌యిస్తుంది. దీంతో నాకు ఎలాంటి సంబంధం లేదు. ఇంత స్వల్ప భాగస్వామ్యం ఉన్న వ్యక్తి దేశవ్యాప్త విధానాన్ని తన వ్యక్తిగత ప్రయోజనాల కోసం ప్రభావితం చేయడం ఎలా సాధ్యమవుతుంది..?" అంటూ గ‌డ్క‌రీ ప్రశ్నించారు. ఇథనాల్ విధానం వెనుక ప్రధాన ఉద్దేశం రైతుల ఆదాయాన్ని పెంచడం, పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించడం, విదేశాల నుంచి ముడి చమురు దిగుమతులపై ఆధార‌ప‌డ‌టాన్ని తగ్గించడమేనని గడ్కరీ వివరించారు.

Also Read..

ఉచిత ప‌థ‌కాలు కాదు.. ప్ర‌జ‌ల భ‌విష్య‌త్‌పై పెట్టుబ‌డులు అవి

ఎగ్జామ్స్ బిల్లుపై రగడ: విపక్షాలపై కంగనా రనౌత్ ఫైర్.. రాహుల్ గాంధీకి స్ట్రాంగ్ కౌంటర్!

మతం మారితే ఎస్సీ హోదా వ‌ర్తించ‌దు.. సుప్రీంకోర్టు స్ప‌ష్టీక‌ర‌ణ‌

Advertisement
Advertisement