త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

CPP Meeting | పార్ల‌మెంట్ వేదికగా ప్రజల గళం వినిపించనున్న కాంగ్రెస్

CPP Meeting | ఈ నెల 20 నుంచి పార్ల‌మెంట్ వ‌ర్షాకాల స‌మావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ క్ర‌మంలో స‌మావేశాల్లో అనుస‌రించాల్సిన వ్యూహంపై కాంగ్రెస్ అధిష్టానం కీల‌క స‌మావేశం నిర్వ‌హించింది. కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీ (సీపీపీ) చైర్‌పర్సన్‌ సోనియా గాంధీ నివాసం జ‌న్‌ప‌థ్‌లో జ‌రిగిన స‌మావేశంలో ఆ పార్టీ జాతీయ అధ్య‌క్షుడు మ‌ల్లికార్జున్ ఖ‌ర్గే, లోక్‌స‌భ‌లో ప్ర‌తిప‌క్ష నేత రాహుల్ గాంధీతో పాటు ప‌లువురు సీనియ‌ర్ నేత‌లు స‌మావేశానికి హాజ‌ర‌య్యారు.

P

National | Published On Jul 16, 2026, 4.17 pm IST

CPP Meeting | పార్ల‌మెంట్ వేదికగా ప్రజల గళం వినిపించనున్న కాంగ్రెస్
Advertisement
  • సోనియా నివాసంలో కీల‌క నేత‌ల భేటీ
  • పార్ల‌మెంట్‌లో లేవ‌నెత్తే అంశాల‌పై చ‌ర్చ‌
  • నీట్ నుంచి రామాల‌యం విరాళాల వ‌ర‌కు నిల‌దీసేందుకు వ్యూహం
  • ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై గ‌ళం వినిపిస్తామ‌న్న కేసీ వేణుగోపాల్‌

CPP Meeting | ఈ నెల 20 నుంచి పార్ల‌మెంట్ వ‌ర్షాకాల స‌మావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ క్ర‌మంలో స‌మావేశాల్లో అనుస‌రించాల్సిన వ్యూహంపై కాంగ్రెస్ అధిష్టానం కీల‌క స‌మావేశం నిర్వ‌హించింది. కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీ (సీపీపీ) చైర్‌పర్సన్‌ సోనియా గాంధీ నివాసం జ‌న్‌ప‌థ్‌లో జ‌రిగిన స‌మావేశంలో ఆ పార్టీ జాతీయ అధ్య‌క్షుడు మ‌ల్లికార్జున్ ఖ‌ర్గే, లోక్‌స‌భ‌లో ప్ర‌తిప‌క్ష నేత రాహుల్ గాంధీతో పాటు ప‌లువురు సీనియ‌ర్ నేత‌లు స‌మావేశానికి హాజ‌ర‌య్యారు. భేటీలో పార్లమెంట్‌లో ప్రస్తావించాల్సిన కీలక అంశాలు, కేంద్ర ప్రభుత్వాన్ని ఏయే విషయాలపై నిలదీయాలనే దానిపై సమగ్రంగా చర్చించినట్లు కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ సోష‌ల్ మీడియా ద్వారా వెల్లడించారు. దేశ ప్రజలను ప్రభావితం చేస్తున్న సమస్యలపై కాంగ్రెస్‌ గళం వినిపిస్తుందని, ప్రజల్లో వ్యక్తమవుతున్న అసంతృప్తికి పార్లమెంట్‌లో తామే ప్రతినిధులుగా నిలుస్తామని ఆయన స్పష్టం చేశారు.

రామాలయ నిర్మాణానికి సంబంధించిన విరాళాల దుర్వినియోగం ఆరోపణలు, నీట్‌, సీబీఎస్‌ఈ పరీక్షల నిర్వహణలో చోటుచేసుకున్న లోపాలు, దేశవ్యాప్తంగా వాహనదారులను ఇబ్బంది పెడుతున్న ఈ-20 పెట్రోల్ వ్య‌వ‌హారం, ఇంధ‌న ధ‌ర‌లు, భారత్‌–అమెరికా వాణిజ్య ఒప్పందం వంటి అంశాలను వర్షాకాల సమావేశాల్లో ప్రధానంగా లేవనెత్తనున్నట్లు తెలిపారు. ప్రజల జీవితాలపై ప్రభావం చూపుతున్న ఇతర కీలక సమస్యలను సభ దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. సమావేశంలో కాంగ్రెస్‌ ప్రధాన విప్‌ (రాజ్యసభ) జైరాం రమేశ్‌, పీ చిదంబరం, కే సురేశ్‌, నసీర్‌ హుస్సేన్‌, మాణికం ఠాగూర్‌, కుమారి సెల్జా, తారిఖ్‌ అన్వర్‌, శశి థరూర్‌, మనీశ్ తివారీతో పాటు పలువురు సీనియర్ నేత‌లు పాల్గొన్నారు.

ఇదిలా ఉండగా, పార్లమెంట్‌ సమావేశాలు ప్రారంభమయ్యే రోజైన జూలై 20న ప్రతిపక్ష ఇండియా కూటమి సైతం సమావేశమై ఉమ్మడి వ్యూహాన్ని ఖరారు చేయనుంది. అంతకుముందు జూలై 19న కేంద్ర ప్రభుత్వం అన్ని రాజకీయ పార్టీల నాయకులతో సమావేశమై వర్షాకాల సమావేశాల్లో చర్చించాల్సిన అంశాలపై సంప్రదింపులు జరపనుంది. వ‌ర్షాకాల స‌మావేశాలు జూలై 20 నుంచి ఆగస్టు 13 వరకు జ‌రుగ‌నున్నాయి. ఈ సమావేశాల్లో లోక్‌సభ స్థానాల పెంపు, నియోజకవర్గాల పునర్విభజన (డిలిమిటేషన్‌)కు సంబంధించిన రాజ్యాంగ సవరణ బిల్లుతో పాటు, జైలుకు వెళ్లిన ప్రధానమంత్రి, ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రుల పదవులు ఆటోమేటిక్‌గా ప‌ద‌వులు కోల్పోవ‌డం త‌దిత‌ర కీలక బిల్లులను కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే అవకాశముందని రాజ‌కీయ విశ్లేష‌కులు భావిస్తున్నారు.

Advertisement
Advertisement