త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Nitin Gadkari | E20 వివాదం.. నా కుటుంబ వాటా 0.7 శాతం మాత్ర‌మే : నితిన్ గ‌డ్క‌రీ

Nitin Gadkari | కేంద్ర ప్రభుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా అమ‌లు చేస్తున్న‌ ఇథనాల్ బ్లెండింగ్ కార్యక్రమాన్ని రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ (Nitin Gadkari) సమర్థించారు. ఇథ‌నాల్ క‌లిపిన పెట్రోల్‌ను ఉప‌యోగించ‌కూడ‌ద‌నుకునే వాహ‌న‌దారులు 100% స్వచ్ఛమైన పెట్రోల్‌ను ఎంచుకోవచ్చని తెలిపారు. అయితే, దానికి వారు ఎక్కువ ధ‌ర చెల్లించాల్సి ఉంటుంద‌ని స్ప‌ష్టం చేశారు.

D

Business | Published On Jul 15, 2026, 12.44 pm IST

Nitin Gadkari | E20 వివాదం.. నా కుటుంబ వాటా 0.7 శాతం మాత్ర‌మే : నితిన్ గ‌డ్క‌రీ
Advertisement

Nitin Gadkari | త్రినేత్ర‌.న్యూస్ : కేంద్ర ప్రభుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా అమ‌లు చేస్తున్న‌ ఇథనాల్ బ్లెండింగ్ కార్యక్రమాన్ని రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ (Nitin Gadkari) సమర్థించారు. E20 ఇంధనం వల్ల వాహనాల ఇంజన్లు పాడవుతున్నాయనే ఆందోళనలను ఆయ‌న తోసిపుచ్చారు. ఇదంతా ప్ర‌తిప‌క్షాలు చేస్తున్న త‌ప్పుడు ప్ర‌చార‌మేన‌ని వ్యాఖ్యానించారు. వాహ‌నాలు పాడ‌వుతున్నాయ‌ని ప్ర‌భుత్వానికి ఎలాంటి ఫిర్యాదులూ రాలేద‌ని స్ప‌ష్టం చేశారు. అదే స‌మ‌యంలో ఇథ‌నాల్ క‌లిపిన పెట్రోల్‌ను ఉప‌యోగించ‌కూడ‌ద‌నుకునే వాహ‌న‌దారులు 100% స్వచ్ఛమైన పెట్రోల్‌ను ఎంచుకోవచ్చని తెలిపారు. అయితే, దానికి వారు ఎక్కువ ధ‌ర చెల్లించాల్సి ఉంటుంద‌ని స్ప‌ష్టం చేశారు.

100% పెట్రోల్ కావాలంటే.. ఎక్కువ ధ‌ర చెల్లించాలి..

ఓ మీడియా ఛానెల్‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో గ‌డ్క‌రీ మాట్లాడారు. ఇంధన స్టేషన్లలో E20తో పాటు E10 పెట్రోల్‌ను కూడా అందుబాటులో ఉంచుతారా..? అన్న ప్ర‌శ్న‌కు గ‌డ్క‌రీ స్పందిస్తూ.. మ‌న దేశం ఇప్పటికే 20 శాతం ఇథనాల్ బ్లెండింగ్ లక్ష్యాన్ని సాధించిందని చెప్పారు. "మనం ఇప్పటికే 20% ఇథనాల్ బ్లెండింగ్‌ను సాధించాం. దేశంలోని ప్రతి ఇంధన స్టేషన్‌లో E20 ఇంధనం అందుబాటులో ఉంది. అలాంట‌ప్పుడు ఇది ఎలా సాధ్యమవుతుంది..? ఒక‌వేళ ఇథనాల్ కలిపిన ఇంధనం వద్దు అనుకునే వారు 100% పెట్రోల్‌ను తీసుకోవచ్చు. కానీ వారు ఎక్కువ ధ‌ర‌ చెల్లించాల్సి ఉంటుంది" అని గ‌డ్క‌రీ స్ప‌ష్టం చేశారు.

కొద్దిపాటి మైలేజ్ త‌గ్గుతుంది..

20 శాతం ఇథనాల్ మిశ్రమంతో కూడిన ఈ20 పెట్రోల్ వాడితే వాహనాల మైలేజీ తగ్గిపోతుందని, ఇంజిన్లు పాడవుతాయని జరుగుతున్న ప్రచారాన్ని గడ్కరీ పూర్తిగా ఖండించారు. అలాంటి వాదనలకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని స్పష్టం చేశారు. అమెరికా, బ్రెజిల్, జర్మనీ, స్వీడన్ వంటి దేశాల్లో దశాబ్దాలుగా ఇథనాల్ మిశ్రమ ఇంధనాన్ని విజయవంతంగా వినియోగిస్తున్నారని గుర్తు చేశారు. పెట్రోల్‌తో పోలిస్తే ఇథనాల్‌కు కెలోరిఫిక్ విలువ (calorific value) తక్కువగా ఉండటం వల్ల కొద్దిపాటి మైలేజ్ తగ్గుతుందని తాను మొద‌ట్నుంచీ చెబుతూనే ఉన్నాన‌ని గ‌డ్క‌రీ ఈ సంద‌ర్భంగా చెప్పుకొచ్చారు.

అదంతా త‌ప్పుడు ప్ర‌చారం..

ఇక వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాల కోస‌మే ఇథ‌నాల్ బ్లెండింగ్ కార్య‌క్ర‌మాన్ని తాను ప్రోత్స‌హిస్తున్నానంటూ వ‌స్తున్న విమ‌ర్శ‌ల‌ను కూడా గ‌డ్క‌రీ ఈ సంద‌ర్భంగా ఖండించారు. ఈ విధానం వల్ల తన కుటుంబానికి వ్యక్తిగతంగా లాభాలు చేకూరుతున్నాయంటూ ప్రతిపక్షాలు చేస్తున్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేశారు. ఇవన్నీ పూర్తిగా రాజకీయ ఉద్దేశాలతో చేస్తున్న ఆరోపణలేనని, తన ప్రతిష్టతో పాటు దేశ ప్రగతిని దెబ్బతీయాలనే కుట్రలో భాగమని పేర్కొన్నారు. వాహన కాలుష్యాన్ని, భారతదేశ దిగుమతుల బిల్లును తగ్గించడానికి తాను ఎల్లప్పుడూ ప్రత్యామ్నాయ ఇంధనాలకు మద్దతు ఇస్తున్నట్లు చెప్పారు.

"దేశంలో ఇథ‌నాల్‌ ప్ర‌వేశ‌పెట్ట‌క‌ముందే మా కుటుంబం షుగ‌ర్ వ్యాపారంలో ఉంది. నా కుమారుల వ్యాపారంలో ఇథ‌నాల్ వాటా నామ మాత్ర‌మే. మొత్తం ఉత్ప‌త్తికి వారి స‌హ‌కారం కూడా చాలా త‌క్కువ‌. దేశవ్యాప్తంగా సుమారు 550 యూనిట్లలో ప్రతి ఏడాది దాదాపు 1,500 కోట్ల లీటర్ల ఇథనాల్ ఉత్పత్తి జరుగుతోంది. ఇందులో నా కుటుంబ‌ సంస్థలకు ఉన్న వాటా కేవలం 0.07 శాతం మాత్రమే. అంతేకాదు, నా కుమారుల సంస్థ‌ల‌కు రూ.1,600 కోట్ల అప్పు ఉంది. ఈ వ్యాపారాలు నా కుమారులు న‌డుపుతున్నారు. ఇక ఇథ‌నాల్ కార్య‌క్ర‌మాన్ని పెట్రోలియం మంత్రిత్వ శాఖ నిర్వ‌హిస్తోంది. ధ‌ర‌ల‌ను కేబినెట్ నిర్ణ‌యిస్తుంది. దీంతో నాకు ఎలాంటి సంబంధం లేదు. ఇంత స్వల్ప భాగస్వామ్యం ఉన్న వ్యక్తి దేశవ్యాప్త విధానాన్ని తన వ్యక్తిగత ప్రయోజనాల కోసం ప్రభావితం చేయడం ఎలా సాధ్యమవుతుంది..?" అంటూ గ‌డ్క‌రీ ప్రశ్నించారు.

యూపీఏ ప్ర‌భుత్వం కూడా మ‌ద్ద‌తిచ్చింది..

ఇథనాల్ బ్లెండింగ్ కార్యక్రమం ఇప్ప‌టిది కాద‌ని కేంద్ర మంత్రి స్ప‌ష్టం చేశారు. వాజ్‌పేయి ప్రభుత్వ హయాంలోనే ప్రారంభమైందని గుర్తు చేశారు. యూపీఏ ప్రభుత్వం కూడా దీనికి మద్దతు ఇచ్చిందని తెలిపారు. అప్పటి చమురు శాఖ మంత్రి మణిశంకర్ అయ్యర్ పార్లమెంటులో దీనికి మద్దతు తెలిపారని మంత్రి నొక్కి చెప్పారు.

దేశ ఇంధన అవసరాలకు ఇవి కీలకం..

ఇథనాల్ విధానం వెనుక ప్రధాన ఉద్దేశం రైతుల ఆదాయాన్ని పెంచడం, పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించడం, విదేశాల నుంచి ముడి చమురు దిగుమతులపై ఆధార‌ప‌డ‌టాన్ని తగ్గించడమేనని గడ్కరీ వివరించారు. తాను కేవలం చెరకు నుండే కాకుండా.. మొక్కజొన్న, వరి గడ్డి, వెదురు నుంచి ఇథ‌నాల్ ఉత్ప‌త్తికి మద్దతు ఇచ్చానని ఈ సంద‌ర్భంగా గ‌డ్క‌రీ స్పష్టం చేశారు. అంతేకాకుండా, మెథనాల్, హైడ్రోజన్, ఎలక్ట్రిక్ వాహనాలతో సహా అన్ని ఇతర రకాల ప్రత్యామ్నాయ ఇంధనాలను కూడా తాను ప్రోత్స‌హించిన‌ట్లు గ‌డ్క‌రీ వివ‌రించారు. భవిష్యత్తులో దేశ ఇంధన అవసరాలకు ఇవి కీలకంగా మారుతాయని అభిప్రాయపడ్డారు.

నన్ను టార్గెట్ చేస్తున్నారు..

అదే స‌మ‌యంలో నాసిర‌కం రోడ్ల ప్ర‌చారం విష‌యంపై కూడా గ‌డ్క‌రీ స్పందించారు. ఈ విష‌యంలో త‌న‌ని టార్గెట్ చేశార‌ని మండిప‌డ్డారు. తాను వ్యక్తిగతంగా 950 రహదారి ప్రాజెక్టులను సమీక్షించానని చెప్పారు. నిర్మాణంలో నాణ్య‌త లోపాల‌ను అస్స‌లు స‌హించ‌బోమ‌ని స్ప‌ష్టం చేశారు. లోపాలు ఉన్న‌చోట క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని అధికారుల‌ను ఆదేశించిన‌ట్లు చెప్పారు. రహదారుల నాణ్యతపై వ‌స్తున్న‌ విమర్శలు కూడా ఒక పథకం ప్రకారం ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరుగుతున్న ప్రచారంలో భాగమేనని ఆయన ఆరోపించారు.

Also Read..

జైల్లో పెట్టినా కాంగ్రెస్ స‌ర్కార్‌పై నా పోరాటం ఆగ‌దు: వేముల ప్ర‌శాంత్ రెడ్డి

ఐటీఆర్ ఫైలింగ్‌లో తప్పనిసరిగా ప్రకటించాల్సిన ఆదాయాలు ఇవే

ఆర్​ఎస్​ ప్రవీణ్‌కుమార్‌పై క్రిమినల్ చర్యలు తీసుకోండి.. సీఎంకు రేవంత్‌కు గువ్వల బాలరాజు లేఖ

Advertisement
Advertisement