త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Bhatti Vikramarka | ​ఉచితాలు కావు… ప్రజా పెట్టుబడులు

Bhatti Vikramarka | రాష్ట్ర ప్ర‌భుత్వం అమ‌లు చేస్తున్న ఉచిత ప‌థ‌కాలు ఏవి కూడా ఉచితాలు కావు అని.. ప్ర‌జ‌ల భ‌విష్య‌త్‌పై ప్ర‌భుత్వం పెట్టే పెట్టుబ‌డులు అని డిప్యూటీ సీఎం భ‌ట్టి విక్ర‌మార్క పేర్కొన్నారు.

S

Telangana | Published On Jul 27, 2026, 3.32 pm IST

Bhatti Vikramarka | ​ఉచితాలు కావు… ప్రజా పెట్టుబడులు
Advertisement

విద్యార్థుల భవిష్యత్తే రాష్ట్ర భవిష్యత్తు
​అర్ధాకలితో ఏ బిడ్డ బడికి వెళ్లొద్దు
​సానబెట్టిన వజ్రాల్లా మానవ వనరులు
​పాలన అంటే పెత్తనం కాదు.. సమాజ హితం
'పీపుల్స్ మార్చ్' నుంచే ప్రజాహిత ఇందిరమ్మ పథకాలు
ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క

Bhatti Vikramarka | త్రినేత్ర‌.న్యూస్ : ఉచిత పథకాలు అనేవి ఈ రాష్ట్ర ప్రజలపై ప్రభుత్వం పెట్టే పెట్టుబడి అని డిప్యూటీ సీఎం భ‌ట్టి విక్రమార్క ప్రకటించారు. మిడిమిడి జ్ఞానంతో తెలిసీ తెలియక చాలామంది ఉచిత పథకాలపైన విమర్శ చేస్తున్నారని ఆయన తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. పరిశ్రమలు ప్రాజెక్టులు ఇతర అనేక అంశాలపై ప్రభుత్వం పెట్టుబడి పెట్టినట్లుగానే పేదలు, దళితులు, వెనుకబడిన వర్గాలు సహా రాష్ట్రవ్యాప్తంగా ప్రజలందరి పైన ప్రభుత్వం పెట్టుబడి పెడుతుందని ఆయన అన్నారు. ఈ పెట్టుబడి ఫలితాలు ప్రజలు అభివృద్ధి చెంది ఆర్థికంగా, సామాజికంగా ముందుకు వెళ్లేందుకు దోహదం చేసేవిగా ఉంటాయని ఆయన అన్నారు. మధిర నియోజకవర్గ కేంద్రంలో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్న విద్యార్థులకు పోషకాహార అల్పాహారాన్ని అందించే సెంట్రలైజ్డ్ కమ్యూనిటీ కిచెన్ సెంటర్‌ను భ‌ట్టి ప్రారంభించారు.

అనంతరం ఏర్పాటుచేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో పుట్టిన ఏ బిడ్డ కూడా అర్ధాకలితో పాఠశాలకు వెళ్లకూడదన్నదే కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ ప్రధాన ఆశయమని అన్నారు. విద్యార్థుల భవిష్యత్తే రాష్ట్ర భవిష్యత్తు అని, ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ పిల్లల శారీరక, మానసిక వికాసం కోసం ఉదయమే రుచికరమైన, శుచి-శుభ్రతతో కూడిన పౌష్టికాహారాన్ని అందించేందుకు ప్రజాప్రభుత్వం శ్రీకారం చుట్టిందని తెలిపారు. బడ్జెట్‌లో ప్రకటించిన విధంగానే రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఉచిత అల్పాహార పథకాన్ని మధిర నియోజకవర్గంలో ప్రారంభించినట్లు చెప్పారు.

ఏ బిడ్డ కూడా అర్ధాకలితో పాఠశాలకు వెళ్లకూడదు..

ప్రజా ప్రభుత్వంలో ఇందిరమ్మ రాజ్యంలో ఏ బిడ్డ కూడా అర్ధాకలితో పాఠశాలకు వెళ్లకూడదు.. ఇక్కడ పుట్టిన ప్రతి బిడ్డ.. రాష్ట్ర భవిష్యత్తు ఆని ఆయన చెప్పారు వారి భవిష్యత్తే మన భవిష్యత్తు. అటువంటి బిడ్డల భవిష్యత్తు కోసం ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ సంతృప్తికరంగా ఉదయం పూట బ్రేక్ ఫాస్ట్ చేసి చదువుకోవాలని అన్నారు. రుచికరమైన, శుచి శుభ్రతతో కూడిన న్యూట్రిషియస్ ఫుడ్‌ని మనం అందించాలని చెప్పి ఈ కేబినెట్ చేసిన నిర్ణయం మేరకు బడ్జెట్లో ఈ పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగిందని ఆయన చెప్పారు.

చదువు మీద దృష్టి పెట్టలేని పరిస్థితి

అర్ధాక‌లితో పాఠశాలకు వచ్చి అధ్యాపకులు చెప్పే పాఠాలను సరిగ్గా వినలేక, ఆకలితో సతమతమవుతూ చదువు మీద దృష్టి పెట్టలేని పరిస్థితి ఏ విద్యార్థికి రాకూడదనే ఆలోచనతో ఇందిరమ్మ ప్రజా ప్రభుత్వం ఈ ఈ నిర్ణయం తీసుకుందని ఆయన చెప్పారు. మానవ వనరులు మన రాష్ట్ర సంపద. ఏ రాష్ట్ర అభివృద్ధికైనా సహజ వనరులు ఎంత అవసరమో.. సమర్థవంతమైన మానవ వనరులు కూడా అంతే అవసరమని భట్టి విక్రమార్క నొక్కి చెప్పారు. అత్యంత ప్రతిభావంతులుగా తయారైనటువంటి మానవ వనరులు ఉన్నటువంటి రాష్ట్రం గాని, దేశం గాని ప్రపంచంలో అత్యంత శక్తివంతంగా మారుతుందని ఆయన అన్నారు.

వ‌జ్రాల్ని త‌యారు చేసేందుకే మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్

రాష్ట్రానికే కాదు దేశానికి, ప్రపంచానికి కూడా దశా దిశా నిర్దేశం చేయగలిగినటువంటి మానవ వనరుల్ని సానబెట్టిన వజ్రాల్లాగా ప్రపంచం మీదికి మనం వదిలిపెట్టగలగాలి. అటువంటి వజ్రాల్ని తయారు చేసుకోవాల్సిన తరుణంలో మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్ పథకాన్ని రాష్ట్రవ్యాప్తంగా మొదలుపెట్టే కార్యక్రమానికి నాంది పలికామని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా 27 లక్షల మంది విద్యార్థులకి ఒకటే సమయానికి వేడిగా అల్పాహారం అందించడం అంటే ఇది ఒక చారిత్రాత్మకమైన నిర్ణయం. ఈ దేశ చరిత్రలోనే సువర్ణాక్షరాలతో లెక్కించాల్సిన అంశమని అన్నారు.

27 లక్షల మందికి ఒకే సమయానికి వేడివేడిగా అల్పాహారం

సాధారణంగా ఒక కుటుంబంలో ఇద్దరు పిల్లలకు సమయానికి టిఫిన్ కట్టడమే తల్లిదండ్రులకు కష్టంగా మారిన రోజులివి. అలాంటిది ప్రభుత్వ పాఠశాలల్లో చదివే 20 లక్షల మంది, రెసిడెన్షియల్ స్కూళ్లలోని 7 లక్షల మంది పిల్లలతో కలిపి మొత్తం 27 లక్షల మందికి ఒకే సమయానికి వేడివేడిగా అల్పాహారం అందించడం దేశ చరిత్రలోనే సువర్ణాక్షరాలతో లిఖించదగిన అంశ‌మని ఉప ముఖ్యమంత్రి అన్నారు. ప్రపంచంలో ఏ దేశంలోనూ, ఏ రాష్ట్రంలోనూ ఇంత పెద్ద ఎత్తున అల్పాహారం అందించే వ్యవస్థ లేదని భట్టి పేర్కొన్నారు. సంకల్పం మంచిదైతే భగవంతుని ఆశీస్సులు ఉంటాయని, అందుకే సాధ్యం కాదనుకున్న ఈ కార్యక్రమాన్ని ప్రజాప్రభుత్వం సాధ్యం చేసి చూపిందని డిప్యూటీ సీఎం హర్షం వ్యక్తం చేశారు.

రాబోయే 3 నెలల్లో రాష్ట్రవ్యాప్తంగా శాశ్వత కిచెన్‌లు

హరే కృష్ణ మిషన్ భాగస్వామ్యంతో పకడ్బందీగా, అత్యంత శుభ్రమైన వాతావరణంలో మెకనైజ్డ్ కిచెన్లను ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. ప్రస్తుతం మధిరలోని తాత్కాలిక సెంట్రలైజ్డ్ కిచెన్ ద్వారా 16 మండలాల స్కూళ్లకు వాహనాల్లో అల్పాహారం అందిస్తున్నామని అన్నారు. రాబోయే 3 నెలల్లో రాష్ట్రవ్యాప్తంగా శాశ్వత కిచెన్ నిర్మాణాలను పూర్తి చేసి విద్యార్థులకు ఉదయం పూట అల్పాహారాన్ని అందించనున్నట్లు భట్టి విక్రమార్క చెప్పారు. పిల్లలకు అందించే అల్పాహారంతో పాటు పౌష్టికాహారం కోసం వారానికి 3 రోజులు పాలు, మరో 3 రోజులు రాగి జావను ప్రత్యేకంగా అందిస్తున్నట్లు ఆయన వెల్లడించారు.

అధికారం అంటే పెత్తనం చలాయించడం కాదు..

బడి పిల్లలతో కలిసి భోజనం చేయడం తన రాజకీయ జీవితంలో ఎన్నడూ లేనంత తృప్తిని ఇచ్చిందని ఆనందం వ్యక్తం చేశారు. పాలన అంటే ఒక హోదా కాదు. అధికారం అంటే పెత్తనం చలాయించడం కాదు. అధికారమన్నా, పాలనన్నా ఉన్న వనరుల్ని పోగేసి సమాజ హితం కోసం ప్రణాళికలు తయారు చేయడం.. వారి అభివృద్ధి కోసం పునాదులు వేయాలని ఆలోచనతో ముందుకు సాగాలని అన్నారు. అందులో భాగంగానే ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా ఇల్లు లేని వాఫైకోసం రూ. 5 లక్షలతో ఒక్కొక్క ఇందిరమ్మ ఇల్లు నిర్మాణం జరుగుతుందన్నారు. గృహ ప్రవేశానికి మనం వెళ్లినప్పుడు ఆ పేదవాళ్ల కళ్లల్లో ఆనందం చూస్తే.. ఇది కదా పాలన అనే అనుభూతి కలుగుతుంద‌న్నారు.

ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు చేసిన 'పీపుల్స్ మార్చ్' పాదయాత్రలో ప్రజలు పడుతున్న కష్టాలను కళ్జారా చూశానని భట్టి విక్రమార్క చెప్పారు. ఈ సమయంలో బడుల దుస్థితి, నిరుద్యోగుల ఆవేదన, ఇల్లు లేని పేదల బాధలను విన్నానని చెప్పారు. ఆనాడే నా మనసులో రూపుదిద్దుకున్న ఆలోచనలే నేడు ఒక్కొక్కటిగా పథకాలుగా మారుతున్నాయని భావోద్వేగానికి లోనవుతూ ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చెప్పారు.

ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో పాటుగా హరే కృష్ణ మూవ్‌మెంట్ చారిటబుల్ ఫౌండేషన్ అధ్యక్షులు సత్య గౌర చంద్ర దాస ప్రభుజీ, హరే కృష్ణ మూవ్‌మెంట్ చారిటబుల్ ఫౌండేషన్ సీఈఓ, కౌంతేయ స్వామీజీ, వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్, జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్, కార్పొరేషన్ చైర్మన్లు పువ్వాళ్ల దుర్గాప్రసాద్, రాయల నాగేశ్వర రావు తదితరులు పాల్గొన్నారు.

 

Advertisement
Advertisement