త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

E20 Janta Party | ప్ర‌ధాన్ ఔట్‌.. గ‌డ్క‌రీ లోడింగ్‌.. సీజేపీ త‌ర‌హాలో మ‌రో ఉద్య‌మం త‌ప్ప‌దా..? SMలో E20 జనతా పార్టీ సంచ‌ల‌నం

E20 Janta Party | సోష‌ల్ మీడియాలో మ‌రో వ్యంగ్య పార్టీ పుట్టుకొచ్చింది. అదే 'E20 జనతా పార్టీ' (E20 Janta Party). కేంద్ర రోడ్డు, ర‌వాణా శాఖ మంత్రి నితిన్ గ‌డ్క‌రీ రాజీనామా చేయాల‌ని ఈ పార్టీ డిమాండ్ చేస్తోంది. దీంతో సీజేపీ త‌ర‌హాలోనే దేశంలో మ‌రో ఉద్య‌మం త‌ప్ప‌దా..? అన్న ప్ర‌శ్న‌లు త‌లెత్తుతున్నాయి.

D

National | Published On Jul 27, 2026, 12.59 pm IST

E20 Janta Party | ప్ర‌ధాన్ ఔట్‌.. గ‌డ్క‌రీ లోడింగ్‌.. సీజేపీ త‌ర‌హాలో మ‌రో ఉద్య‌మం త‌ప్ప‌దా..? SMలో E20 జనతా పార్టీ సంచ‌ల‌నం
Advertisement

E20 Janta Party | పేప‌ర్ లీక్ ఘ‌ట‌న‌ల‌పై కాక్రోచ్ జ‌న‌తాపార్టీ (Cockroach Janta Party) చేప‌ట్టిన ఉద్య‌మం విజ‌య‌వంత‌మైన ద‌రిమ‌లా.. ఇప్పుడు సోష‌ల్ మీడియాలో మ‌రో కొత్త పార్టీ పుట్టుకొచ్చింది. అదే 'E20 జనతా పార్టీ' (E20 Janta Party). ప్ర‌స్తుతం ఇది సోష‌ల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉంది. ప్ర‌స్తుతం ఇథ‌నాల్ బ్లెండింగ్ (E20 fuel) కార్య‌క్ర‌మంపై వాహ‌న‌దారుల్లో తీవ్ర ఆందోళ‌న వ్య‌క్త‌మ‌వుతున్న వేళ‌.. ఈ పార్టీ సోష‌ల్ మీడియాలో సంచ‌ల‌నంగా మారింది. సీజేపీ త‌ర‌హాలోనే ఈ పార్టీ ఇప్పుడు కేంద్ర రోడ్డు, ర‌వాణా శాఖ మంత్రి నితిన్ గ‌డ్క‌రీపై యుద్ధానికి సిద్ధమైంది.

నితిన్ గ‌డ్క‌రీ లోడింగ్‌..

వినియోగదారులకు 100 శాతం స్వచ్ఛమైన పెట్రోల్ ఆప్ష‌న్‌ కల్పించాలని డిమాండ్ చేస్తూ, గడ్కరీ రాజీనామా కోరుతూ ఈ కొత్త సంస్థ నిరసనలకు శ్రీకారం చుట్టింది. స్వ‌చ్ఛ‌మైన పెట్రోల్ మా హ‌క్కు అంటూ ఇథ‌నాల్ కార్య‌క్ర‌మానికి ప్రాతినిథ్యం వ‌హిస్తున్న గ‌డ్క‌రీని ప్ర‌శ్నిస్తూ.. ఈ పార్టీ పెడుతున్న పోస్టులు యువ‌త‌ను, వాహ‌న‌దారుల‌ను విప‌రీతంగా ఆక‌ట్టుకుంటున్నాయి. ముఖ్యంగా నితిన్ గ‌డ్క‌రీ ( Nitin Gadkari) రాజీనామా చేయాలంటూ ఈ20 పార్టీ డిమాండ్ చేస్తోంది. దీంతో ఇప్పుడు దేశంలో మ‌రో ఉద్య‌మం త‌ప్ప‌దా..? అన్న ప్ర‌శ్న‌లు త‌లెత్తుతున్నాయి.

E20 డిమాండ్లు ఇవే..

కాక్రోచ్ పార్టీ త‌ర‌హాలోనే ఈ20 జనతా పార్టీ కూడా ఎక్స్‌లో కొన్ని గంటల్లోనే వేలాది మంది ఫాలోవ‌ర్ల‌ను సంపాదించుకుంది. ఆదివారం కొన్ని గంట‌ల వ్య‌వ‌ధిలోనే 25,000 మందికి పైగా కొత్త‌ ఫాలోవర్లు చేర‌గా.. సోమవారం ఉదయానికి ఈ సంఖ్య 48,000 దాటింది. తాము ఎలాంటి సబ్సిడీలు, ఉచిత ఇంధనం లేదా ఎథనాల్ కలిపిన పెట్రోల్ రద్దును కోరుకోవడం లేదని స్ప‌ష్టం చేస్తోంది. ఇతర ఉత్పత్తుల విషయంలో ప్రజలకు ఎంపికలు ఉన్నట్లే వినియోగదారులకు నచ్చిన ఇంధనాన్ని ఎంచుకునే స్వేచ్ఛ ఉండాల‌ని స్పష్టం చేస్తోంది. ఇంధ‌న విధానంలో పార‌ద‌ర్శ‌క‌త‌, క‌చ్చిత‌మైన స‌మాచారం, వినియోగ‌దారుల ఎంపిక‌కు గౌర‌వం ఉండాల‌ని డిమాండ్ చేస్తోంది.

అన్ని రకాల ఇంధనాలపై స్పష్టమైన లేబులింగ్ ఉండాలని, వివిధ ఇంధన మిశ్రమాల లాభనష్టాలకు సంబంధించిన సమాచారాన్ని బహిర్గతం చేయాలని డిమాండ్ చేసింది. ఈ20 పెట్రోల్ వల్ల వాహనాల ఇంజిన్‌లు, మైలేజ్, కాలుష్యం, నిర్వహణ ఖర్చులపై ప్రభావం గురించి స్వతంత్ర పరిశోధన జరిపించి ఆ నివేదికలను బహిరంగపర్చాలని కోరుతోంది. ప్ర‌స్తుతం ఈ పార్టీ మ‌లేషియా కేంద్రంగా పనిచేస్తోంది. ఇప్ప‌టికే కాక్రోచ్ జ‌న‌తాపార్టీ నిర‌స‌న‌ల‌తో వివాదంలో చిక్కుకున్న కేంద్ర స‌ర్కార్‌కు భ‌విష్య‌త్తులో ఈ ఈ20 పార్టీ త‌ల‌నొప్పిగా మారే అవ‌కాశం లేక‌పోలేద‌న్న అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

ఆగ‌స్టు 4న పార్ల‌మెంట్ ముట్ట‌డికి పిలుపు

ఇదిలా ఉండ‌గా.. ఈ20 పెట్రోల్ వాడ‌డం వ‌ల్ల వాహ‌న‌ మైలేజ్ తగ్గడం, ఇంజిన్ సమస్యలు, నిర్వహణ వ్యయం పెరుగుతుంద‌ని వాహ‌న‌దారులు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు. ఈ నేప‌థ్యంలో ఈ20 విధానానికి వ్య‌తిరేకంగా ఆగ‌స్టు 4న పార్ల‌మెంట్ ముట్ట‌డికి ఢిల్లీ ట్యాక్సీ అండ్ టూరిస్ట్ ట్రాన్స్‌పోర్టర్స్ అండ్ టూర్ ఆపరేటర్స్ అసోసియేషన్ పిలుపునిచ్చింది. వేలాది మంది డ్రైవర్లు, వాహన యజమానులు పార్లమెంట్ ముట్టడికి సిద్ధమవుతున్నారు

సీజేపీ ఉద్య‌మం విజ‌య‌వంతం..

మే నెలలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ఒక విచారణ సందర్భంగా నిరుద్యోగ యువతను, సోషల్ మీడియా యాక్టివిస్టులను కాక్రోచ్‌లు, పరాన్నజీవులుతో పోలుస్తూ చేసిన వ్యాఖ్య‌లు తీవ్ర దుమారం రేపిన విష‌యం తెలిసిందే. ఆ వ్యాఖ్య‌ల నుంచి పుట్టుకొచ్చిందే ఈ కాక్రోచ్ జ‌న‌తా పార్టీ. అభిజీత్ దిప్కే మే 15న 'కాక్రోచ్ జనతా పార్టీ' (CJP)ని ప్రారంభించారు. కొద్ది రోజుల్లోనే ఈ పేజీకి లక్షలాది మంది యువ‌త‌ మద్దతు ల‌భించింది. దేశ విద్యావ్య‌వ‌స్థ‌లో అక్ర‌మాలు, పేప‌ర్ లీకేజీల‌పై ఈ పార్టీ చేప‌ట్టిన ఉద్య‌మం ఉద్రిక్త‌త‌కు దారి తీసింది. ధ‌ర్మేంద్ర ప్ర‌ధాన్ రాజీనామా చేయాల‌ని డిమాండ్ చేస్తూ ఈ పార్టీ చేప‌ట్టిన ఆందోళ‌న‌ల‌ను దేశ‌వ్యాప్తంగా పాకాయి.

జూలై 20న పార్లమెంట్ వర్షాకాల సమావేశాల తొలిరోజే వేలాది మంది జంతర్ మంతర్‌ను చుట్టుముట్టారు. లాఠీఛార్జ్‌ల‌ను సైతం లెక్క‌చేయ‌కుండా ఆరు రోజుల పాటు సాగిన కాక్రోచ్‌ల‌ నిరసనలకు మోదీ స‌ర్కార్ త‌లొగ్గ‌క త‌ప్ప‌లేదు. నీట్ పేప‌ర్ లీక్‌కు బాధ్య‌త వ‌హిస్తూ జూలై 25 శనివారం కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేశారు. ఇప్పుడు ఇథ‌నాల్ కార్య‌క్ర‌మానికి ప్రాతినిథ్యం వ‌హిస్తున్న గ‌ర్క‌రీపై ఈ20 పార్టీ గురి పెట్టింది. దీంతో దేశంలో మ‌రో ఉద్య‌మం త‌ప్ప‌దా..? అన్న ప్ర‌శ్న‌లు త‌లెత్తుతున్నాయి.

Also Read..

ఆందోళన చేస్తున్నంత‌మాత్రాన లాఠీఛార్జ్ చేయకూడ‌దు : సుప్రీంకోర్టు

ప్ర‌ధాని మోదీపై అభ్యంత‌ర‌క‌ర‌మైన పోస్ట‌ర్‌.. బెంగాలీ న‌టిపై కేసు

డ్రగ్స్‌ మత్తులో పోలీసులపైకి కారు ఎక్కించాడు..

Advertisement
Advertisement