త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

VB-G RAM G | వీబీ జీరామ్‌జీ ప‌థ‌కం.. తొలి నెల‌లోనే స‌గానికి ప‌డిపోయిన ఉపాధి ప‌నిదినాలు

VB-G RAM G | విక్‌సిత్ భారత్ గ్యారెంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ అజీవిక మిషన్ గ్రామీన్ (VB-G RAM G) పథకం తొలి నెలలోనే గ్రామీణ ఉపాధి కల్పనలో దాదాపు 50% (49.94%) భారీ తగ్గుదలను నమోదు చేసింది. గతేడాది జులైలో పాత ప‌థ‌కం కింద 15.33 కోట్ల ప‌నిదినాలు ల‌భించ‌గా.. ఈ ఏడాది జులైలో కొత్త ప‌థ‌కం కింద అవి 7.67 కోట్ల‌కు ప‌డిపోవ‌డం గ‌మ‌నార్హం.

D

National | Published On Aug 10, 2026, 1.28 pm IST

VB-G RAM G | వీబీ జీరామ్‌జీ ప‌థ‌కం.. తొలి నెల‌లోనే స‌గానికి ప‌డిపోయిన ఉపాధి ప‌నిదినాలు
Advertisement

VB-G RAM G | మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయిమెంట్ గ్యారెంటీ యాక్ట్ (Mahatma Gandhi National Rural Employment Guarantee Act-MGNREGA) స్థానంలో కేంద్రం తీసుకొచ్చిన‌ విక్‌సిత్ భారత్ గ్యారెంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ అజీవిక మిషన్ గ్రామీన్ (VB-G RAM G) పథకం తొలి నెలలోనే గ్రామీణ ఉపాధి కల్పనలో దాదాపు 50% (49.94%) భారీ తగ్గుదలను నమోదు చేసింది. 2026 జూలై 1 నుంచి దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చిన ఈ నూతన విధానం వల్ల మొదటి నెలలోనే ఉపాధి పనిదినాలు సగానికి పడిపోయాయి.

అధికారిక గణాంకాల ప్రకారం, గతేడాది జులైలో పాత ప‌థ‌కం కింద 15.33 కోట్ల ప‌నిదినాలు ల‌భించ‌గా.. ఈ ఏడాది జులైలో కొత్త ప‌థ‌కం కింద అవి 7.67 కోట్ల‌కు ప‌డిపోవ‌డం గ‌మ‌నార్హం. ఈ ప‌థ‌కం ద్వారా ఉపాధి పొందిన‌ కుటుంబాల సంఖ్య 51.45 శాతం త‌గ్గింది. గ‌తేడాది 1.42 కోట్ల కుటుంబాలు ఈ ప‌థ‌కం ద్వారా ల‌బ్ధి పొంద‌గా.. ఈ జులైలో ఆ సంఖ్య 68.94 లక్షలకు పరిమితమైంది. గత నాలుగేళ్ల సగటుతో (1.72 కోట్ల కుటుంబాలు, 21.56 కోట్ల పనిదినాలు) పోలిస్తే ప్రస్తుత గణాంకాలు అత్యంత కనిష్ట స్థాయికి చేరాయి. అదేవిధంగా ఈ ఏడాది జులై నాటి పర్సన్-డేలు కూడా గత నాలుగేళ్ల సగటు 21.56 కోట్ల ప‌నిదినాల‌తో పోలిస్తే 35% మాత్రమే.

 

కేంద్ర ప్రభుత్వం దాదాపు రెండు దశాబ్దాలుగా అమలులో ఉన్న మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (MGNREGS) స్థానంలో జూలై 1 నుంచి VB-G RAM G పథకాన్ని తీసుకొచ్చింది. కొత్త పథకంలో గ్రామీణ కుటుంబాలకు ఏడాదికి కల్పించే ఉపాధి హామీని 100 రోజుల నుంచి 125 రోజులకు పెంచడంతో పాటు వేతనాలను కూడా పెంచారు. దేశవ్యాప్తంగా కనీస దినసరి వేతనాన్ని రూ. 300 గా నిర్ణయించారు. పని కోసం దరఖాస్తు చేసుకున్న 15 రోజుల్లోగా ఉపాధి కల్పించకపోతే నిరుద్యోగ భృతి చెల్లించాల్సి ఉంటుంది. చట్టప్రకారం కనీసం మూడో వంతు మహిళలు ఉండాలి. కాగా, ప్రస్తుతం జులై నెలలో 63% పనిదినాలు మహిళలకే దక్క‌డం విశేషం.

కొత్త చట్టం ప్రకారం వ్యవసాయ విత్తనాలు నాటే, కోతల సమయాల్లో (Peak Sowing and Harvesting Season) పథకం పనులను గరిష్టంగా 60 రోజుల పాటు నిలిపివేసే (Pause) నిబంధన ఉంది. ఈ నేప‌థ్యంలో ఖ‌రీఫ్ విత్త‌నాలు నాటే కాలంలో ఈ ప‌థ‌కాన్ని నిలిపివేయ‌డంతో ఉపాధి క‌ల్ప‌న త‌గ్గ‌డానికి ఒక కార‌ణ‌మ‌ని ప్ర‌భుత్వ వ‌ర్గాలు స్ప‌ష్టం చేస్తున్నాయి. అయితే, ఈ తగ్గుదల కేవలం MGNREGS నుంచి కొత్త పథకానికి మారుతున్న సమయంలో ఏర్పడిన పరివర్తన ప్రభావమా లేక మ‌రేదైనా కార‌ణ‌మా అన్నిది రానున్న రోజుల్లో స్ప‌ష్టంగా తెలిసే అవ‌కాశం ఉంది.

ఏపీలో రూ.312, తెలంగాణ‌లో రూ.308..

ఈ చ‌ట్టం కింద నైపుణ్యం లేని శ్రామికులకు చెల్లించే వేత‌నాల రేట్ల‌ను (wage rates) కూడా కేంద్ర ప్ర‌భుత్వం ఇటీవ‌లే నోటిఫై చేసిన విష‌యం తెలిసిందే. ఆ వివ‌రాల ప్ర‌కారం.. వివిధ రాష్ట్రాల్లో రోజువారీ వేత‌నాలు రూ.300 నుంచి రూ.409 మ‌ధ్య నిర్ణ‌యించారు. సిక్కింలోని కొన్ని నిర్దిష్ట గ్రామ పంచాయ‌తీల్లో మాత్రం ప్ర‌త్యేకంగా రూ.450గా నిర్ణ‌యించారు. కొత్త ప‌థ‌కం కింద‌ అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, బీహార్, జార్ఖండ్, అస్సాం, త్రిపుర, సిక్కిం, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో వేతనాలు 15% కంటే ఎక్కువ పెరిగాయి. అయితే, ద‌క్షిణాది రాష్ట్రాలైన క‌ర్ణాట‌క‌, త‌మిళ‌నాడు, తెలంగాణ‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రాల్లో 3 శాతం కంటే త‌క్కువే పెంచ‌డం గ‌మ‌నార్హం.

గుజరాత్, మణిపూర్, మిజోరాం, రాజస్థాన్, ఒడిశా, జమ్ము కశ్మీర్, లడఖ్, మేఘాలయ, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్, సిక్కిం, అస్సాం, త్రిపుర, బీహార్, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్.. ఈ 21 రాష్ట్రాల్లో వీబీ- జీ రామ్ జీ ప‌థ‌కం కింద‌ రోజువారీ వేతన రేటును రూ. 300గా నిర్ణయించారు.

తెలంగాణలో రూ.308, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో రూ.312, మహారాష్ట్రలో రూ. 317, దాద్రా న‌గ‌ర్ హ‌వేలీ, డామ‌న్ డ‌య్యులో రూ.340 చొప్పున, త‌మిళ‌నాడులో రూ.345, పుదుచ్చేరిలో రూ. 347, అండమాన్ నికోబార్ (Andaman District), లక్షద్వీప్‌లో రూ.348 చొప్పున, పంజాబ్‌లో రూ.360, అండమాన్ నికోబార్ (Nicobar District) రూ.367, క‌ర్ణాట‌క‌లో రూ.382, కేర‌ళ‌లో రూ.401, గోవాలో రూ.406గా కూలీల‌కు రోజువారీ వేత‌నం చెల్లించ‌నున్నారు. సిక్కింలోని మూడు గ్రామ పంచాయతీలు జ్ఞాతంగ్ (Gnathang), లాచుంగ్ (Lachung), లాచెన్ (Lachen)ల్లో వేతన రేటును రూ.450గా నిర్ణ‌యించారు.

Also Read..

పార్ల‌మెంట్ స‌మావేశాలు ఇంకా నాలుగు రోజులే ఉన్న‌య్‌.. అమిత్ షా హౌస్‌లోకి వస్త‌లేరు

బిల్డింగ్ పర్మిషన్ ఇస్తే పన్ను లెక్క తేలాల్సిందే.. రేవంత్ రెడ్డి ఆర్థిక, రాజకీయ మాస్టర్ స్ట్రోక్!

పోర్ట్రోనిక్స్ కొత్త డ‌బుల్ అండ్ ట్రిపుల్ ఎ సైజ్ బ్యాటరీలు.. యూఎస్‌బీ టైప్ సి తోనే ఛార్జింగ్..

Advertisement

తాజావార్తలు

Advertisement