త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Maternity leave | ప్రసూతి సెలవు కారణంగా మహిళ హోదా త‌గ్గించ‌కూడ‌దు.. ఢిల్లీ హైకోర్టు చారిత్రాత్మకమైన తీర్పు

Maternity leave | ప్ర‌సూతి సెల‌వు కార‌ణంగా మ‌హిళ హోదా త‌గ్గించ‌కూడ‌ద‌ని ఢిల్లీ హైకోర్టు (Delhi High Court) స్ప‌ష్టం చేసింది. మెటర్నిటీ లీవ్ తర్వాత కేవలం జీతం, సీనియారిటీ (Designation) మాత్రమే కొనసాగిస్తే సరిపోదని వ్యాఖ్యానించింది. ఆమె సెల‌వుకు వెళ్ల‌క‌ముందు ఏ హోదాలో ఉన్నారో అదే పోస్టును కేటాయించాల‌ని తెలిపింది.

D

National | Published On Sep 2, 2026, 4.49 pm IST

Maternity leave | ప్రసూతి సెలవు కారణంగా మహిళ హోదా త‌గ్గించ‌కూడ‌దు.. ఢిల్లీ హైకోర్టు చారిత్రాత్మకమైన తీర్పు
Advertisement

Maternity leave | త్రినేత్ర‌.న్యూస్ : ప్రసూతి సెలవులపై (Maternity leave) వెళ్లి తిరిగి విధుల్లోకి చేరే మహిళా ఉద్యోగుల హక్కుల రక్షణపై ఢిల్లీ హైకోర్టు (Delhi High Court) చారిత్రాత్మకమైన తీర్పును వెలువరించింది. మహిళలు ప్రసూతి సెలవులకు వెళ్లకముందు ఎలాంటి హోదాను, బాధ్యతలను (Status and Responsibilities) నిర్వహించారో... తిరిగి విధుల్లోకి చేరిన తర్వాత కూడా వారికి అదే హోదా, బాధ్యతలను యథావిధిగా అప్పగించాలని న్యాయస్థానం తేల్చిచెప్పింది. అప్పుడే మ‌హిళ‌కు నిజమైన ప్రసూతి రక్షణ లభిస్తుందని తెలిపింది. ఓ కేసు విచార‌ణ సంద‌ర్భంగా జస్టిస్ సచిన్ దత్తా నేతృత్వంలోని ధర్మాసనం ఈ తీర్పు వెలువరించింది. మెటర్నిటీ బెనిఫిట్ యాక్ట్ (Maternity Benefit Act) అనేది మహిళలకు కేవ‌లం ఉద్యోగ భ‌ద్ర‌త‌కు మాత్ర‌మే కాకుండా.. వృత్తిపరమైన పురోగతికి కూడా రక్షణ కల్పిస్తుంద‌ని స్ప‌ష్టం చేసింది. మాతృత్వం వల్ల వాళ్లు కెరీర్‌లో వెనుకబడిపోకూడ‌ద‌ని పేర్కొంది.

ఇదీ కేసు నేప‌థ్యం..

రాఖీ బిష్త్ అనే మ‌హిళ‌కు చార్ట‌ర్డ్ అకౌంటెంట్‌గా 14 ఏళ్ల అనుభ‌వం ఉంది. 2022లో ఆమె నెల‌కు రూ.2.6 ల‌క్ష‌ల జీతంతో ఓ సంస్థ‌లో మేనేజ‌ర్‌గా చేరారు. అయితే, ప్రెగ్నెంట్ కావ‌డంతో 2023 డిసెంబ‌ర్‌లో మెటర్నిటీ లీవ్‌పై వెళ్లారు. 2024 జులైలో తిరిగి విధుల్లోకి చేరారు. అయితే ఆమె సెల‌వు నుంచి వ‌చ్చేస‌రికి సంస్థ ఆమె స్థానంలో వేరే వారిని నియ‌మించుకుంది. దీంతో అసలు పోస్టు ఖాళీగా లేదని చెప్పి స్టాఫ్ అకౌంటెంట్ ప‌నుల‌ను అప్ప‌గించింది.

జీతం, సీనియారిటీ స‌రిపోదు..

కంపెనీ తీరుతో రాఖీ బిష్త్ తీవ్ర అస‌హ‌నానికి గురైంది. ఈ మేర‌కు న్యాయ‌పోరాటానికి దిగింది. ఢిల్లీ హైకోర్టును ఆశ్ర‌యించింది. ఆమె పిటిష‌న్‌పై జస్టిస్ సచిన్ దత్తా నేతృత్వంలోని ధర్మాసనం విచార‌ణ జ‌రిపింది. ఈ సంద‌ర్భంగా తాను గ‌తంలో చేసిన ప‌నికి.. ప్ర‌స్తుతం చేస్తున్న ప‌నికి ఏమాత్రం స‌రిపోల‌ద‌ని మ‌హిళ వాపోయింది. అయితే, జీతం, సీనియారిటీని మార్చలేద‌ని స‌ద‌రు సంస్థ కోర్టులో వాదించింది. కంపెనీ వాద‌న‌ల‌ను ధ‌ర్మాస‌నం తోసిపుచ్చింది. మెటర్నిటీ లీవ్ తర్వాత కేవలం జీతం, సీనియారిటీ (Designation) మాత్రమే కొనసాగిస్తే సరిపోదని వ్యాఖ్యానించింది. ఆమె సెల‌వుకు వెళ్ల‌క‌ముందు ఏ హోదాలో ఉన్నారో అదే పోస్టును కేటాయించాల‌ని తెలిపింది.

స‌మాన‌మైన హోదా క‌ల్పించాల్సిందే..

ఒక‌వేళ అది సాధ్యం కానిప‌క్షంలో.. అదే స్థాయి జీతం, సీనియారిటీ, బాధ్య‌త‌లు, నిర్ణ‌యాధికారాలు, ప్ర‌మోష‌న్ అవ‌కాశాలు ఉన్న స‌మాన‌మైన హోదా క‌ల్పించాల‌ని స్ప‌ష్టం చేసింది. గ‌ర్భిణి, ప్ర‌సూతి సెల‌వులు అన్న కార‌ణంగా బాధ్య‌త‌ల్లో కోత విధిస్తే.. దానిని వివ‌క్ష‌గా ప‌రిగ‌ణిస్తామ‌ని కోర్టు హెచ్చ‌రించింది. అదే స‌మ‌యంలో కేంద్ర ప్ర‌భుత్వానికి కీల‌క ఆదేశాలు జారీ చేసింది. ప్రసూతి రక్షణలను సమర్థవంతంగా అమలు చేయడానికి సోషల్ సెక్యూరిటీ కోడ్-2020 కింద సరైన నిబంధనలు, మార్గదర్శకాలు రూపొందించాలని ఆదేశించింది.

Also Read..

పీఆర్​ ద్వారా జీడీపీ గణాంకాలను అందంగా మార్చగ‌ల‌రేమో.. ఆర్థిక వ్యవస్థను కాదు : కాంగ్రెస్‌

ఆంథ్రోపిక్‌ నుంచి క్లాడ్‌ ఫేబుల్‌ 5.1, మిథోస్‌ 5.1.. ప్రత్యేకతలివే..

‘దేవరాయ’గా సుదీప్‌.. రాజసం ఉట్టిపడేలా లుక్‌

Advertisement
Advertisement