త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Sudeep | ‘దేవరాయ’గా సుదీప్‌.. రాజసం ఉట్టిపడేలా లుక్‌

Sudeep | కన్నడ చిత్రసీమలో తనదైన మాస్‌ ఇమేజ్‌తో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న కిచ్చా సుదీప్‌ ఇప్పుడు చారిత్రక పాత్రలో కనిపించనున్నాడు. ఆయన హీరోగా తెరకెక్కుతున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ‘దేవరాయ’లో విజయనగర సామ్రాజ్య చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయలుగా సుదీప్‌ నటిస్తున్నట్లు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది.

P

Entertainment | Published On Sep 2, 2026, 4.05 pm IST

Sudeep | ‘దేవరాయ’గా సుదీప్‌.. రాజసం ఉట్టిపడేలా లుక్‌
Advertisement

Sudeep | కన్నడ చిత్రసీమలో తనదైన మాస్‌ ఇమేజ్‌తో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న కిచ్చా సుదీప్‌ ఇప్పుడు చారిత్రక పాత్రలో కనిపించనున్నాడు. ఆయన హీరోగా తెరకెక్కుతున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ‘దేవరాయ’లో విజయనగర సామ్రాజ్య చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయలుగా సుదీప్‌ నటిస్తున్నట్లు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. సుదీప్‌ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన గ్లింప్స్‌ను మేక‌ర్స్ విడుద‌ల చేశారు. దీంతో సినిమాపై ఆసక్తి ఒక్కసారిగా పెరిగింది. ‘దేవరాయ’ గ్లింప్స్‌లో సుదీప్‌ను గంభీరమైన రాజసంతో కూడిన రూపంలో ఆవిష్కరించారు. మహారాజు పాత్రకు తగ్గట్టుగా ఆయన లుక్‌ను ప్రత్యేకంగా రూపొందించారు. ‘‘చరిత్రను మార్చిన సామ్రాజ్యం.. ఒక శకాన్ని నిర్వచించిన రాజు.. కాలాన్ని దాటి నిలిచే ఓ దిగ్గజం’’ అంటూ చిత్రబృందం ఈ ప్రాజెక్ట్‌ ప్రత్యేకతను చాటిచెప్పింది.

విజయనగర సామ్రాజ్య చరిత్రలో కీలకమైన శ్రీకృష్ణదేవరాయల పాత్రను సుదీప్‌ పోషిస్తుండటంతో ‘దేవరాయ’పై అంచనాలు భారీగా నెలకొన్నాయి. చారిత్రక నేపథ్యంతో భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ, సుప్రియాన్వి పిక్చర్‌ స్టూడియోస్‌ పతాకాలపై టీజీ విశ్వప్రసాద్‌, కృతి ప్రసాద్‌ నిర్మిస్తున్నారు. గౌర హరి సంగీతం అందిస్తున్నారు. పాన్‌ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ‘దేవరాయ’ను 2027 డిసెంబరులో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. సుదీప్‌ కెరీర్‌లోనే భిన్నమైన కథాంశంతో రూపొందుతున్న ఈ చిత్రం ఆయన అభిమానులతో పాటు చారిత్రక చిత్రాలను ఇష్టపడే ప్రేక్షకుల్లోనూ ఆసక్తి రేకెత్తిస్తోంది.

శ్రీకృష్ణదేవరాయల గురించి..

విజయనగర సామ్రాజ్యాన్ని అత్యున్నత స్థాయికి తీసుకెళ్లిన గొప్ప చక్రవర్తుల్లో శ్రీకృష్ణదేవరాయలు ప్రముఖులు. తుళువ వంశానికి చెందిన ఆయన 1509లో విజయనగర సింహాసనాన్ని అధిష్ఠించి 1529 వరకు పాలించారు. ఆయన కాలంలో సామ్రాజ్యం రాజకీయంగా, సైనికంగా బలపడటంతో పాటు కళలు, సాహిత్యం విశేషంగా అభివృద్ధి చెందాయి. తెలుగు సాహిత్యాన్ని ప్రోత్సహించిన కృష్ణదేవరాయలను ‘ఆంధ్ర భోజుడు’, ‘సాహితీ సమరాంగణ సార్వభౌముడు’ వంటి బిరుదులతో కీర్తించారు. స్వయంగా కవి అయిన ఆయన తెలుగులో ‘ఆముక్తమాల్యద’ రచించారు. ఆయన ఆస్థానంలోని అల్లసాని పెద్దన, నంది తిమ్మన, ధూర్జటి, తెనాలి రామకృష్ణ తదితరులు అష్టదిగ్గజాలుగా ప్రసిద్ధి చెందారు. మతసహనాన్ని పాటిస్తూ వివిధ ఆలయాలకు దానధర్మాలు చేసిన రాజుగానూ ఆయనకు చరిత్రలో ప్రత్యేక స్థానం ఉంది.

Advertisement
Advertisement