త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Sada Bainama Telangana | పాస్ పుస్తకాలెక్కడ? రైతుల భూములతో చెలగాటమా?

సాదా బైనామా క్రమబద్ధీకరణ పేరుతో రైతుల నుంచి ఫీజులు వసూలు చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం.. పాస్ పుస్తకాలు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతోందని హరీశ్ రావు మండిపడ్డారు.

J

Telangana | Published On Sep 2, 2026, 3.58 pm IST

Sada Bainama Telangana | పాస్ పుస్తకాలెక్కడ? రైతుల భూములతో చెలగాటమా?
Advertisement
  • సాదా బైనామా కింద ఎకరానికి రూ.23 వేల నుంచి రూ.26 వేలు వసూలు చేసి పాస్ పుస్తకాలు ఇవ్వని సర్కార్
  • భూభారతి పోర్టల్‌లో టెక్నికల్ ఇష్యూస్ పేరుతో 62 వేల మంది రైతుల భూముల వివరాలు ఆన్‌లైన్ చేయని వైనం
  • పాస్ పుస్తకాలు లేక రైతుబంధు, రైతుబీమా కోల్పోతున్న మక్తల్ రైతులు
  • తక్షణమే సమస్యను పరిష్కరించి రైతులకు న్యాయం చేయాలని సీఎం రేవంత్ రెడ్డిని డిమాండ్ చేసిన హరీశ్ రావు

Sada Bainama Telangana | త్రినేత్ర.న్యూస్ : సాదా బైనామా (Sada Bainama) క్రమబద్ధీకరణ పేరుతో రైతుల నుంచి భారీగా ఫీజులు వసూలు చేసిన రాష్ట్ర ప్రభుత్వం.. వారికి పాస్ పుస్తకాలు ఇవ్వకుండా రోడ్డున పడేస్తోందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మక్తల్ నియోజకవర్గానికి చెందిన పలువురు రైతులు ఆయనను కలిసి తమ గోడు వెళ్లబోసుకోవడంతో ఎక్స్ వేదికగా కాంగ్రెస్ ప్రభుత్వ తీరును ఆయన ఎండగట్టారు.

ఫీజులు కట్టించుకుని.. ఆఫీసుల చుట్టూ తిప్పుకుంటారా?

ధరణి స్థానంలో 'భూభారతి' (Bhubharati) తెస్తామని గొప్పలు చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం.. ఇప్పుడు రికార్డుల విషయంలో రైతులను గందరగోళంలోకి నెట్టేస్తోందని ఆయన విమర్శించారు. ఎకరానికి రూ.23 వేల నుంచి రూ.26 వేల వరకు ఫీజులు కట్టించుకుని నెలలు గడుస్తున్నా.. రైతుల భూముల వివరాలు ఆన్‌లైన్‌లో నమోదు కావడం లేదు. చేతిలో 13-B సర్టిఫికెట్లు పెట్టి.. పోర్టల్‌లో టెక్నికల్ ఇష్యూ (Technical Issue) ఉందని చెబుతూ MRO, RDO ఆఫీసుల చుట్టూ రైతులను తిప్పించుకోవడం దారుణమన్నారు.

అందని రైతుబంధు.. అమ్ముకోలేని పంట

రికార్డులు క్లియర్ చేయకపోవడంతో పాస్ పుస్తకాలు రాక, ఆన్‌లైన్‌లో పేర్లు లేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీనివల్ల రైతుబంధు, రైతుబీమా వర్తించకపోవడమే కాకుండా, ఎరువులు పొందడంలోనూ అడ్డంకులు ఎదురవుతున్నాయి. కనీసం పండించిన పంటను అమ్ముకునే పరిస్థితి కూడా లేకుండా పోయిందని హరీశ్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. సుమారు 62 వేల మంది రైతుల నుంచి ముక్కుపిండి ఫీజులు వసూలు చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం.. వారి భూమి హక్కులను ఎందుకు గుర్తించడం లేదని సీఎం రేవంత్ రెడ్డిని (Revanth Reddy) సూటిగా ప్రశ్నించారు.

Harish Rao Slams Congress Govt Over Sada Bainama Passbooks Delay

నెలల తరబడి సమస్యను పరిష్కరించకపోవడం, అధికారుల చుట్టూ తిప్పుకోవడమే మీ 'ప్రజాపాలన'లో రైతులకు దక్కుతున్న గౌరవమా అని ఆయన నిలదీశారు. వెంటనే భూభారతి పోర్టల్‌లోని సాంకేతిక సమస్యలను పరిష్కరించి, పెండింగ్ దరఖాస్తులను యుద్ధప్రాతిపదికన క్లియర్ చేయాలని డిమాండ్ చేశారు. ఫీజులు చెల్లించిన ప్రతి రైతుకు పాస్ పుస్తకాలు జారీ చేయాలని, నష్టపోయిన వారికి ప్రభుత్వ ప్రయోజనాలు అందించాలని కోరారు. రైతుల భూములకు, హక్కులకు భద్రత కల్పించే వరకు బీఆర్ఎస్ పార్టీ వారి పక్షాన పోరాటం కొనసాగిస్తుందని హరీశ్ రావు స్పష్టం చేశారు.

Advertisement
Advertisement