త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Janhvi Kapoor | అలా అయితే గుహ‌లో ఉండాల్సి వ‌స్తుంది..! జాన్వీ కపూర్‌ పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు

Janhvi Kapoor | బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ దాఖ‌లు చేసిన ప‌ర్స‌నాలిటీ రైట్స్ ఉల్లంఘనకు సంబంధించిన పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. తన పేరుతో అశ్లీల ఏఐ కంటెంట్‌, ఫేక్ అకౌంట్స్‌, ఫేక్‌ బుకింగ్‌ ఏజెన్సీలు, చాట్‌బాట్లు, అనుమతి లేకుండా వాణిజ్య ప్రయోజనాలకు వినియోగిస్తున్న కంటెంట్‌ను తొలగించాలని కోరుతూ ఆమె కోర్టును ఆశ్రయించారు.

P

Entertainment | Published On Aug 11, 2026, 7.11 pm IST

Janhvi Kapoor | అలా అయితే గుహ‌లో ఉండాల్సి వ‌స్తుంది..! జాన్వీ కపూర్‌ పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు
Advertisement

Janhvi Kapoor | బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ దాఖ‌లు చేసిన ప‌ర్స‌నాలిటీ రైట్స్ ఉల్లంఘనకు సంబంధించిన పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. తన పేరుతో అశ్లీల ఏఐ కంటెంట్‌, ఫేక్ అకౌంట్స్‌, ఫేక్‌ బుకింగ్‌ ఏజెన్సీలు, చాట్‌బాట్లు, అనుమతి లేకుండా వాణిజ్య ప్రయోజనాలకు వినియోగిస్తున్న కంటెంట్‌ను తొలగించాలని కోరుతూ ఆమె కోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలో అశ్లీల, అసభ్యకర కంటెంట్‌ను తొలగించాలని ఆదేశించిన న్యాయస్థానం.. ఇంటర్నెట్‌లోని 5వేలకుపైగా వెబ్‌పేజీలు, సోషల్‌ మీడియా పోస్టులను తొలగించాలన్న జాన్వీ తరఫు వాదనలు మాత్రం ‘అతిగా ఉన్నాయి’ అని వ్యాఖ్యానించింది. జస్టిస్‌ అనూప్‌ జైరామ్‌ భంభానీ విచారణ చేపట్టారు. జాన్వీ తరఫు న్యాయవాదిని ఆమె అభ్యంతరం వ్యక్తం చేస్తున్న వెబ్‌పేజీలపై పట్టిక రూపంలో వివరాలు సమర్పించాలని ఆదేశించారు. స్పష్టంగా అశ్లీల, అసభ్యకర, లైంగిక ప్రేరేపిత కంటెంట్‌తో పాటు జాన్వీ ప‌ర్స‌నాలిటీ రైట్స్ నేరుగా వాణిజ్యపరంగా ఉపయోగించుకుంటున్న వెబ్‌సైట్ల వివరాలను ప్రత్యేకంగా పేర్కొనాలని సూచించారు.

‘ఇంటర్నెట్‌ నుంచి అన్నింటినీ తొలగించలేం’

తనకు సంబంధించిన 5వేలకు పైగా లింకులను తొలగించాలన్న జాన్వీ అభ్యర్థనపై న్యాయస్థానం తీవ్రంగా స్పందించింది. ‘‘మేం దేశానికి నైతిక సంరక్షకులం కాదు. సమస్యకు పరిష్కారం వెతుకుతూ అంతకంటే పెద్ద సమస్యను సృష్టించకూడదు. ఇది భావ ప్రకటనా స్వేచ్ఛకు సంబంధించిన అంశం’’ అని వ్యాఖ్యానించినట్లు ‘బార్‌ అండ్‌ బెంచ్‌’ పేర్కొంది. అభిమానుల పేజీలు తమ అభిమానాన్ని వ్యక్తం చేయొచ్చని, అదే సమయంలో విమర్శలు కూడా చేయొచ్చని కోర్టు తెలిపింది. ‘‘మీకు అభిమానులు వద్దా? ఇది డిజిటల్‌ ప్రపంచం. వ్యాఖ్యలు వద్దు. యూఆర్‌ఎల్‌లు వద్దు అని అన్నింటినీ ఆపేస్తే.. చివరకు మీరు గుహలో నివసించాల్సి వస్తుంది’’ అని వ్యాఖ్యానించింది. ప్రజా జీవితంలో ఉన్న ప్రముఖులపై ఇంటర్నెట్‌లో రకరకాల వ్యాఖ్యలు, కంటెంట్‌ రావడం సాధారణమైందని కోర్టు పేర్కొంది. అందువల్ల ప్రతి ఫ్యాన్‌ పేజీని, ఆన్‌లైన్‌ కంటెంట్‌ను పూర్తిగా మూసివేయాలన్న డిమాండ్‌ను అంగీకరించలేమని స్పష్టం చేసింది. జాన్వీ వ్యక్తిత్వ హక్కులను పరిరక్షిస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చినప్పటికీ.. అన్ని రకాల కంటెంట్‌పై డైనమిక్‌ ఇంజంక్షన్‌ ఇవ్వడానికి కోర్టు నిరాకరించింది.

కాపీరైట్‌.. వ్యక్తిత్వ హక్కుల మధ్య తేడా

జాన్వీ చిత్రాలు, ఆమె రూపాన్ని ఉపయోగించి ఉత్పత్తులు విక్రయించడం ప్రతిసారీ ఆమె వ్యక్తిత్వ హక్కులను వాణిజ్యపరంగా వినియోగించినట్లేనా? అనే అంశంపైనా కోర్టు ప్రశ్నలు సంధించింది. ఒక ఫొటోగ్రాఫర్‌ తీసిన చిత్రానికి కాపీరైట్‌ అతనికే ఉంటుందని, ఆ ఫొటోను విక్రయించే హక్కు కూడా అతనికి ఉండొచ్చని పేర్కొంది. ‘‘ఒక ఫొటో నా వద్ద ఉంది. దాన్ని విక్రయించే హక్కు నాకు ఉంది. దాన్ని విక్రయించడం వల్ల అది మీ వ్యక్తిత్వాన్ని వాణిజ్యపరంగా ఉపయోగించుకున్నట్లేనా? ఒకరు పుస్తకం రాస్తే దాన్ని విక్రయించకూడదా? కాపీరైట్‌ ఉన్న వ్యక్తికి తన సృష్టిని విక్రయించే హక్కు కూడా ఉంటుంది’’ అని కోర్టు వ్యాఖ్యానించింది. అదేవిధంగా ఒక కళాకారుడు జాన్వీ ఫొటోను ముద్రించిన కప్పును తయారు చేసి విక్రయిస్తే.. ఆ ఉత్పత్తిపై హక్కులు, దానికి సంబంధించిన కాపీరైట్‌ అంశాలను కూడా పరిశీలించాల్సి ఉంటుందని పేర్కొంది.

జాన్వీ పిటిషన్‌ను వ్యతిరేకించిన మెటా

జాన్వీ పిటిషన్‌ను మెటా తరఫు న్యాయవాది వరుణ్‌ పాఠక్‌ వ్యతిరేకించారు. పిటిషన్‌లో పేర్కొన్న 5వేలకు పైగా లింకులను ఒక్కొక్కటిగా పరిశీలించడం సాధ్యం కాదని కోర్టుకు తెలిపారు. ఏఐ ద్వారా రూపొందించిన చిత్రాలు ఉండటమే చట్టవిరుద్ధం కాదని, వాటి ద్వారా జీవనోపాధి పొందే వ్యక్తుల హక్కులను కూడా పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు. అయితే, కేసులో మెటా తన పరిధిని దాటకూడదని ఢిల్లీ హైకోర్టు హెచ్చరించింది. ఈ కేసులో తదుపరి విచారణను ఆగస్టు 17కి వాయిదా వేసింది. జాన్వీ తరఫు న్యాయబృందం తాజా ఆదేశాలపై స్పందించాల్సి ఉంది.

Advertisement
Advertisement