త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Circuit House Issue | సుప్రీంకోర్టును ఆశ్ర‌యించిన మ‌హువా.. అత్య‌వ‌స‌ర విచార‌ణ‌కు నో..!

Circuit House Issue | పశ్చిమ బెంగాల్‌లోని నదియా జిల్లాలో ప్రభుత్వ సర్క్యూట్‌ హౌస్‌ నుంచి జిల్లా యంత్రాంగం అధికారులు తనను బలవంతంగా ఖాళీ చేయించారని ఆరోపిస్తూ తృణమూల్‌ కాంగ్రెస్‌ ఎంపీ మహువా మొయిత్రా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌ను అత్యవసరంగా విచారించేందుకు సర్వోన్నత న్యాయస్థానం నిరాకరించింది.

P

National | Published On Aug 24, 2026, 1.52 pm IST

Circuit House Issue | సుప్రీంకోర్టును ఆశ్ర‌యించిన మ‌హువా.. అత్య‌వ‌స‌ర విచార‌ణ‌కు నో..!
Advertisement

Circuit House Issue | పశ్చిమ బెంగాల్‌లోని నదియా జిల్లాలో ప్రభుత్వ సర్క్యూట్‌ హౌస్‌ నుంచి జిల్లా యంత్రాంగం అధికారులు తనను బలవంతంగా ఖాళీ చేయించారని ఆరోపిస్తూ తృణమూల్‌ కాంగ్రెస్‌ ఎంపీ మహువా మొయిత్రా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌ను అత్యవసరంగా విచారించేందుకు సర్వోన్నత న్యాయస్థానం నిరాకరించింది. ఈ వ్యవహారాన్ని హైకోర్టు కూడా విచారించవచ్చని సీజేఐ జ‌స్టిస్ సూర్యకాంత్‌ స్పష్టం చేశారు. మ‌హువా త‌ర‌ఫున న్యాయ‌వాది ఈ అంశాన్ని సీజేఐ జ‌స్టిస్ సూర్య‌కాంత్‌, జ‌స్టిస్ జాయ్‌మాల్య బాగ్చీ, జ‌స్టిస్ వీ మోహనలతో కూడిన ధర్మాసనం ఎదుట సోమవారం ప్రస్తావించారు. తన పార్లమెంటరీ నియోజకవర్గమైన కృష్ణానగర్‌లో అర్ధరాత్రి సమయంలో ఈ ఘటన చోటుచేసుకుందని, దీనిపై స్వతంత్ర దర్యాప్తు అవసరమని న్యాయవాది వాదించారు. ఈ వ్యవహారంలో హైకోర్టు ఇప్పటికే ప్రొటెక్ష‌న్ ఉత్త‌ర్వులు జారీ చేసిందని మహువా తరఫు న్యాయవాది ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. ఇది కీలకమైన రాజ్యాంగపరమైన అంశాలతో ముడిపడి ఉన్నందున పిటిషన్‌ను స‌త్వ‌రం విచారించాలని కోరారు. సుప్రీంకోర్టు అందుకు అంగీకరించలేదు. హైకోర్టును ఆశ్ర‌యించేందుకు అవ‌కాశం ఉంద‌ని తెలిపింది.

అయితే, ఆగస్టు 14 రాత్రి కృష్ణానగర్‌ సర్క్యూట్‌ హౌస్‌లో తనను ఒత్తిడి చేసి బయటకు పంపించేందుకు ప్రయత్నించారని మహువా మొయిత్రా ఆరోపించారు. ఖాళీ చేయడానికి నిరాకరించడంతో పెద్ద సంఖ్యలో ప్రజలు సర్క్యూట్‌ హౌస్‌ వెలుపల గుమిగూడి ‘జై శ్రీరామ్‌’ అంటూ నినాదాలు చేశారని సోషల్‌ మీడియా పోస్టులో పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై జోక్యం చేసుకోవాలని కోరుతూ లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లాకు కూడా ఆమె లేఖ రాశారు. పార్లమెంట్‌ సమావేశాల అనంతరం రాత్రి బస చేసేందుకు సర్క్యూట్‌ హౌస్‌లో గదిని ముందుగానే బుక్‌ చేసుకున్నానని మహువా తెలిపారు. ఎంపీగా అక్కడ బస చేసేందుకు తాను అర్హురాలినని, గది బుక్‌ చేసే సమయంలో ఎలాంటి ఆంక్షలు, నిషేధం గురించి అధికారులు తనకు సమాచారం ఇవ్వలేదని పేర్కొన్నారు. జిల్లా అధికారులు తనను వేధించేందుకు ప్రయత్నించారని స్పీకర్‌కు రాసిన లేఖలో ఆరోపించారు. సర్క్యూట్‌ హౌస్‌ జిల్లా ఎస్పీ, కలెక్టర్‌ అధికారిక నివాసాలకు ఎదురుగా ఉందని మహువా పేర్కొన్నారు. భద్రత కలిగిన ప్రాంతంగా భావించే అక్కడికి పెద్ద సంఖ్యలో జనం ఎలా చేరుకున్నారంటూ ఆమె ప్రశ్నించారు. ఈ ఘటనపై స్వతంత్ర దర్యాప్తు జరపాల‌ని ఆమె డిమాండ్ చేస్తున్నారు.

Advertisement
Advertisement