త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Jeevan Reddy | రేవంత్.. ఇప్ప‌టికైనా క‌న్నెప‌ల్లి పంప్‌హౌజ్ మోటార్లు ఆన్ చెయ్‌.. రోజూ 5 టీఎంసీల నీళ్లు దిగువకు పోతున్నయ్‌

Jeevan Reddy | సీఎం రేవంత్‌రెడ్డి భేష‌జాల‌కు పోకుండా క‌న్నెప‌ల్లి పంప్‌హౌజ్ మోటార్ల‌ను వెంట‌నే ఆన్ చేయాల‌ని బీఆర్ఎస్ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, మాజీ మంత్రి జీవ‌న్‌రెడ్డి సూచించారు. అన్నారం, సుందిళ్ల బ్యారేజ్‌లు బాగున్నాయ‌ని కేంద్ర జ‌ల‌, విద్యుత్ ప‌రిశోధ‌నా సంస్థ రిపోర్టు ఇచ్చి నాలుగు రోజులైనా ప్ర‌భుత్వంలో చ‌ల‌నం లేద‌ని మండిప‌డ్డారు.

S

Telangana | Published On Aug 24, 2026, 1.34 pm IST

Jeevan Reddy | రేవంత్.. ఇప్ప‌టికైనా క‌న్నెప‌ల్లి పంప్‌హౌజ్ మోటార్లు ఆన్ చెయ్‌.. రోజూ 5 టీఎంసీల నీళ్లు దిగువకు పోతున్నయ్‌
Advertisement
  • ప్రాజెక్టుల్లో నీళ్లు నింపు.. లేదంటే పంట‌లు చేతికి రావ్
  • భేష‌జాల‌కు పోకు.. తెలంగాణ గొంతును ఎండ‌బెట్ట‌కు
  • అన్నారం, సుందిళ్ల బ్యారేజ్‌లు బాగున్నాయని కేంద్ర జల, విద్యుత్ పరిశోధనా సంస్థ రిపోర్టు ఇచ్చింది
  • రిపోర్టు వచ్చి నాలుగు రోజులైనా ప్రభుత్వంలో చ‌ల‌నం లేదు
  • రేవంత్ ఏమోగాని ఉత్త‌మ్ చ‌దువుకున్నడ‌ని తెలుసు.. కానీ ఆయ‌న నోరు ప‌డిపోయిన‌ట్టుంది
  • సీఎం రేవంత్‌, ఉత్త‌మ్‌పై బీఆర్ఎస్ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, మాజీ మంత్రి జీవ‌న్‌రెడ్డి ఫైర్‌

Jeevan Reddy | త్రినేత్ర‌.న్యూస్‌: సీఎం రేవంత్‌రెడ్డి భేష‌జాల‌కు పోకుండా క‌న్నెప‌ల్లి పంప్‌హౌజ్ మోటార్ల‌ను వెంట‌నే ఆన్ చేయాల‌ని బీఆర్ఎస్ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, మాజీ మంత్రి జీవ‌న్‌రెడ్డి సూచించారు. అక్క‌డ రోజూ 5 టీఎంసీల నీళ్లు దిగువ‌కు పోతున్నాయ‌ని వాపోయారు. అన్నారం, సుందిళ్ల బ్యారేజ్‌లు బాగున్నాయ‌ని కేంద్ర జ‌ల‌, విద్యుత్ ప‌రిశోధ‌నా సంస్థ రిపోర్టు ఇచ్చి నాలుగు రోజులైనా ప్ర‌భుత్వంలో చ‌ల‌నం లేద‌ని మండిప‌డ్డారు. రేవంత్‌రెడ్డి తెలంగాణ గొంతును ఎండ‌బెడుతున్నార‌ని ధ్వ‌జ‌మెత్తారు. రేవంత్ ఏమోగాని ఉత్త‌మ్ చ‌దువుకున్నాడ‌ని తెలుస‌ని.. కానీ ఆయ‌న నోరు ప‌డిపోయింద‌ని ఎద్దేవా చేశారు. కేసీఆర్‌ను మ‌రిపించ‌డం రేవంత్ త‌రం కాద‌న్నారు. ఈమేర‌కు ఆయ‌న సోమ‌వారం తెలంగాణ భ‌వ‌న్‌లో మీడియా స‌మావేశంలో మాట్లాడుతూ.. రేవంత్‌, ఉత్త‌మ్ తీరుపై తీవ్ర స్థాయిలో విరుచుకుప‌డ్డారు.

రేవంత్ రెడ్డి గురుదక్షిణ కోసం పోలవరంకు నీళ్లు వదులుతున్నారు. ఎల్‌నినోను తట్టుకునే శక్తి కాళేశ్వరం ప్రాజెక్టుకు ఉంది. అల్పపీడనాల పుణ్యమా అని కొంత సాగు అయ్యింది. ప్రాజెక్టుల్లో నీళ్లు నింపుకోకపోతే ఉన్న పంటలు కూడా చేతికి రాని పరిస్థితి ఉంది. రేవంత్ రెడ్డి భేషజాలకు పోకుండా కన్నెపల్లి పంప్ హౌజ్ మోటార్లను ఇప్పటికైనా ఆన్ చేయాలి.

మూడు చోట్ల కాంగ్రెస్ ఉన్నా తుమ్మిడిహెట్టిని పూర్తి చేయలే..

తుమ్మిడి హెట్టి విషయంలో కేసీఆర్ చొరవ చూపారు. మహారాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకోకపోవడంతో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేశారు. మూడు చోట్ల కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్నా అపుడు తుమ్మిడి హెట్టిపై ఒప్పందం కుదుర్చుకోలేక పోయారు. 33 నెలల రేవంత్ పాలనలో మాటలు చెప్పడమే తప్ప తుమ్మిడి హట్టి పూర్తి చేయలేదు. ఉన్న కాళేశ్వరాన్ని పూర్తిగా వాడుకోవడం లేదు. రేవంత్ రెడ్డి కుట్రతో కాళేశ్వరం కూలేశ్వరం అయిందని అంటున్నారు. అన్నారం, సుందిళ్ల బ్యారేజ్‌ల‌పై కేంద్ర జల, విద్యుత్ పరిశోధనా సంస్థ ఇచ్చిన రిపోర్ట్ రేవంత్ రెడ్డికి చెంప పెట్టు లాంటిది. ఉత్తమ్ కుమార్ రెడ్డి నోరు పడిపోయిందా?

ఇప్పుడు కూడా రోజూ కన్నెపల్లి దగ్గర 5 టీఎంసీల నీళ్లు వృథా అయితున్న‌య్‌..

మేడిగడ్డ బ్యారేజ్‌లో ఒక పిల్లర్ కుంగితే ఇప్పటి వరకు రిపేర్లు చేయడం లేదు. రేవంత్ రెడ్డి మూర్ఖంగా వ్యవహరిస్తున్నారు. ఎన్.డి.ఎస్.ఏ ను సాకుగా చూపించి 33 నెలలు టైం పాస్ చేశారు. ఇప్పుడు కూడా రోజూ కన్నెపల్లి దగ్గర 5 టీఎంసీల నీళ్లు దిగువకు పోతున్నాయి. రెండు నెలల క్రితమే కన్నెపల్లి దగ్గరకు కేటీఆర్ నాయకత్వంలో వెళ్లి మోటార్లు ఆన్ చేయాలని డిమాండ్ చేశాం. అప్పుడే ఆన్ చేసి ఉంటే ఎగువన వంద టీఎంసీల నీళ్లను రిజర్వాయర్లలో నింపుకునే వాళ్ళం.

కాంగ్రెస్‌లో ఏం న‌డుస్తుందో దేవుడికెరుక‌..

కాళేశ్వరం మొత్తం ఖర్చులో 0.2 శాతం మాత్రమే నష్టం జరిగింది. రేవంత్ రెడ్డికి లెక్కలు వస్తాయో లేదో నాకు తెలియదు. రేవంత్ రెడ్డి.. కుట్రలు, కుతంత్రాలు చాలు.. భేషజాలకు పోకు. కాంగ్రెస్ పార్టీలో ఏం నడుస్తుందో ఏమో దేవుడికి ఎరుక. కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న పరిణామాలు అంతర్గత వ్యవహారం. ప్రథమ ప్రాధాన్యంగా ముందు పరిపాలనపై రేవంత్ రెడ్డి దృష్టి పెట్టాలి.

నీ శాఖలో స్వతంత్రంగా వ్యవహరించు

రేవంత్ రెడ్డి ఏం చదువుకున్నాడో తెలియదు. ఉత్తమ్ కుమార్ రెడ్డి చదువుకున్నాడని తెలుసు. ఉత్తమ్.. నీ శాఖలో స్వతంత్రంగా వ్యవహరించు. రేవంత్ రెడ్డి తమ మనుమడి ఆనందం కోసం మెస్సితో ఫుట్ బాల్ ఆడి 100 కోట్లు ఖర్చు చేశారు. అందాల పోటీలకు 100 కోట్లు ఖర్చు పెట్టారు. 200 కోట్లు ఖర్చు పెడితే మేడిగడ్డ పిల్ల‌ర్ రిపేర్ అవుతుంది. కాఫర్ డ్యామ్ కట్టినా నీళ్లు నిక్షేపంగా లిఫ్ట్ చేసుకోవచ్చు. ఎల్ అండ్ టీ సంస్థ ఉచితంగా రిపేర్ చేస్తామన్నా రేవంత్ రెడ్డి అందుకు సుముఖంగా లేరు. ఇదంతా కేసీఆర్‌కు పేరు వస్తుందనే కోణంలోనే రేవంత్ రెడ్డి నీళ్లను లిఫ్ట్ చేయడం లేదు. కేసీఆర్‌ను మరిపించడం రేవంత్ రెడ్డి తరం కాదు.

రేవంత్ రెడ్డి గురుదక్షిణ కోసం పోలవరంకు నీళ్లు వదులుతున్నారు. తెలంగాణ గొంతు ఎండబెడుతున్నారు. రేవంత్ రెడ్డి మూర్ఖపు పాలనను ప్రజలు అసహ్యించుకుంటున్నారు. కేసీఆర్ మళ్ళీ రావాలని ప్రజలు కోరుకుంటున్నారు అని జీవ‌న్‌రెడ్డి పేర్కొన్నారు.

ఈ మీడియా స‌మావేశంలో మాజీ ఎంపీ బి .వినోద్ కుమార్, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్, బీఆర్ఎస్వీ నేతలు గెల్లు శ్రీనివాస్ యాదవ్, స్వామి యాదవ్, రఘురామ్, వీరబాబు పాల్గొన్నారు.

Advertisement
Advertisement