త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Stock Markets | లాభాల్లో ప్రారంభ‌మైన స్టాక్ మార్కెట్లు.. అయినా టెన్ష‌నే..

Stock Markets | దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం పాజిటివ్ సెంటిమెంట్‌తో ప్రారంభం అయ్యాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 250 పాయింట్ల‌కు పైగా పెరిగి 76,800 వ‌ద్ద కొన‌సాగుతుండ‌గా, ఎన్ఎస్ఈ నిఫ్టీ50 సూచీ 80 పాయింట్ల వ‌ర‌కు పెరిగి 24,000 మార్క్‌కు దిగువ‌న కొన‌సాగుతోంది.

S

Business | Published On Sep 3, 2026, 9.52 am IST

Stock Markets | లాభాల్లో ప్రారంభ‌మైన స్టాక్ మార్కెట్లు.. అయినా టెన్ష‌నే..
Advertisement

Stock Markets | దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం పాజిటివ్ సెంటిమెంట్‌తో ప్రారంభం అయ్యాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 250 పాయింట్ల‌కు పైగా పెరిగి 76,800 వ‌ద్ద కొన‌సాగుతుండ‌గా, ఎన్ఎస్ఈ నిఫ్టీ50 సూచీ 80 పాయింట్ల వ‌ర‌కు పెరిగి 24,000 మార్క్‌కు దిగువ‌న కొన‌సాగుతోంది. అయితే మ‌ధ్య‌ప్రాచ్యంలో యుద్ధ ప‌రిస్థితులు నెల‌కొన్న నేప‌థ్యంలో పెట్టుబ‌డిదారుల్లో అమ్మ‌కాల ఒత్తిడి మాత్రం స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. ప్ర‌పంచ వ్యాప్తంగా టెక్ స్టాక్స్‌లో వ‌స్తున్న అనుకూల సంకేతాలు మార్కెట్ల‌కు మ‌ద్ద‌తుగా నిలుస్తున్నాయి. అయితే భార‌త స్టాక్ మార్కెట్ల‌లో మాత్రం ప‌రిస్థితి భిన్నంగా ఉంది. ఈ సెష‌న్‌లో సూచీల ర్యాలీకి ప్ర‌ధాన కార‌ణాలుగా రియాల్టీ, బ్యాంకుల షేర్లు నిలిచాయి. బ్యాంకులు, ఆర్థిక సంస్థ‌ల వృద్ధి పెరుగుతుండ‌డంతో పెట్టుబ‌డిదారులు ఈ రంగాల‌పై ఆస‌క్తి చూపిస్తున్నారు. ఇక అంత‌ర్జాతీయ మార్కెట్‌లో ముడి చ‌మురు ధ‌ర‌లు ఈ సెష‌న్‌లో స్వ‌ల్పంగా పెరిగాయి. బ్రెంట్ క్రూడ్ ధ‌ర 0.02 శాతం మేర పెరిగి బ్యారెల్‌కు 94 డాల‌ర్ల‌కు చేర‌గా, డ‌బ్ల్యూటీఐ క్రూడ్ ధ‌ర 0.37 శాతం పెరిగి బ్యారెల్‌కు 91 డాలర్ల వ‌ద్ద నిలిచింది. ఫారెక్స్ మార్కెట్‌లో రూపాయి బ‌లాన్ని ప్ర‌ద‌ర్శించింది. అమెరికా డాల‌ర్‌తో పోలిస్తే 94.41 వ‌ద్ద ఉన్న భార‌త రూపాయి ఈ సెష‌న్‌లో 55 పైస‌లు లాభ‌ప‌డింది.

పాజిటివ్‌గా గ్లోబ‌ల్ సెంటిమెంట్‌..

నిఫ్టీ50 సూచీలో అత్య‌ధికంగా లాభ‌ప‌డిన షేర్ల‌లో కోల్ ఇండియా నిలిచింది. ఈ షేర్ ధ‌ర 2.61 శాతం పెరిగి 420కి పైన కొన‌సాగుతుండ‌గా, త‌రువాతి స్థానంలో అదానీ పోర్ట్స్ నిలిచింది. ఈ షేర్ ధ‌ర 1.92 శాతం మేర ఎగ‌బాకి 1704 వ‌ద్ద కొన‌సాగుతోంది. ఆ త‌రువాతి స్థానాల్లో వ‌రుస‌గా ఐసీఐసీఐ బ్యాంక్‌, యాక్సిస్ బ్యాంక్‌, టాటా స్టీల్ నిలిచాయి. ఇక అత్య‌ధికంగా న‌ష్ట‌పోయిన నిఫ్టీ50 షేర్ల‌లో హెచ్‌సీఎల్ టెక్నాల‌జీస్ నిలిచింది. ఈ షేర్ ధ‌ర 1.07 శాతం మేర ప‌త‌న‌మై 1314 వ‌ద్ద ఉండ‌గా, త‌రువాతి స్థానంలో టెక్ మ‌హీంద్రా షేర్ 0.79 శాతం ప‌త‌న‌మై 1599 వ‌ద్ద కొన‌సాగుతూ నిలిచింది. ఆ త‌రువాత స్థానాల్లో ఇన్ఫోసిస్‌, ఐటీసీ, ఇండిగో షేర్లు అత్య‌ధికంగా న‌ష్ట‌పోయి నిలిచాయి. గ్లోబ‌ల్ మార్కెట్ల నుంచి ల‌భించిన పాజిటివ్ సంకేతాలు సైతం దేశీయ స్టాక్ మార్కెట్ల‌ను ప్ర‌భావితం చేశాయి. జ‌పాన్‌కు చెందిన నిక్కీ225 సూచీ 0.16 శాతం మేర స్వ‌ల్పంగా పెర‌గ్గా, ద‌క్షిణ కొరియా కోస్పి సూచీ 1.77 శాతం పెరిగింది. ఆస్ట్రేలియా ఏఎస్ఎక్స్ 200 సూచీ 0.51 శాతం లాభ‌పడింది. అయితే మార్కెట్ల‌లో లాభాల స్వీక‌ర‌ణ కొన‌సాగుతుండడంతో పెట్టుబ‌డిదారుల‌పై అమ్మ‌కాల ఒత్తిడి ఉంద‌ని విశ్లేష‌కులు చెబుతున్నారు.

Advertisement
Advertisement