త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Raghav Chadha | పంజాబ్ ఓటరు జాబితా నుంచి రాఘ‌వ్ చ‌ద్ధా పేరు మాయం.. ఆప్ ప్ర‌భుత్వంపై ఆరోప‌ణ‌లు

Raghav Chadha | పంజాబ్ ఓటర్ల ముసాయిదా జాబితా (Draft Electoral Rolls) నుంచి బీజేపీ ఎంపీ రాఘ‌వ్ చ‌ద్ధా (Raghav Chadha) పేరు తొల‌గించ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మ‌వుతోంది. ఉద్దేశ‌పూర్వ‌కంగానే త‌న పేరును తొల‌గించార‌ని చ‌ద్ధా ఆరోపిస్తున్నారు.

D

National | Published On Sep 3, 2026, 10.45 am IST

Raghav Chadha | పంజాబ్ ఓటరు జాబితా నుంచి రాఘ‌వ్ చ‌ద్ధా పేరు మాయం.. ఆప్ ప్ర‌భుత్వంపై ఆరోప‌ణ‌లు
Advertisement

Raghav Chadha | త్రినేత్ర‌.న్యూస్ : భారత ఎన్నికల సంఘం (ECI) దేశవ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 'స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్' (SIR) ప్రక్రియ తీవ్ర దుమారానికి దారితీస్తోంది. ఓటర్ల జాబితాను వంద‌ శాతం తప్పులు లేకుండా ప్రక్షాళన చేయడమే దీని లక్ష్యమని ఈసీ చెప్తున్నప్పటికీ.. డ్రాఫ్ట్ జాబితాల విడుదల తర్వాత కోట్లాది మంది ఓటర్ల పేర్లు తొలగింపునకు గురికావడం ఆందోళ‌న క‌లిగిస్తున్న విష‌యం. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల ముసాయిదా ఓటర్ల జాబితాల నుంచి ఇప్పటికే ల‌క్ష‌లాది మంది పేర్లు మాయ‌మ‌య్యాయి. పేర్లు తొల‌గించిన వారిలో ప‌లువురు ప్ర‌ముఖ‌లు కూడా ఉండ‌టం షాక్‌కు గురి చేస్తోంది.

ఇటీవ‌లే విడుద‌లైన‌ పంజాబ్ ఓటర్ల ముసాయిదా జాబితా (Draft Electoral Rolls) నుంచి బీజేపీ ఎంపీ రాఘ‌వ్ చ‌ద్ధా (Raghav Chadha) పేరు తొల‌గించ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మ‌వుతోంది. ఉద్దేశ‌పూర్వ‌కంగానే త‌న పేరును తొల‌గించార‌ని చ‌ద్ధా ఆరోపిస్తున్నారు. తాను పంజాబ్‌కు చెందిన సిట్టింగ్ ఎంపీనని, మొహాలీ పరిధిలో తన ఓటు నమోదై ఉందని స్పష్టం చేశారు. లిస్ట్‌లో త‌న పేరును షిఫ్ట్ అయిన‌ట్లుగా మార్క్ చేయ‌డం చూసి షాక్‌కు గురైన‌ట్లు తెలిపారు. ఇది పొర‌పాటున జ‌రిగింది కాద‌ని.. రాజ‌కీయ క‌క్ష సాధింపులో భాగ‌మ‌ని ఆయ‌న ఆరోపించారు. తాను గతంలో ఆమ్ ఆద్మీ పార్టీ (AAP)ని వీడి బీజేపీలో చేరినందుకే భగవంత్ మాన్ నేతృత్వంలోని ప్రభుత్వం రాజ‌కీయ క‌క్ష సాధింపు కోసం ఎన్నిక‌ల అధికారుల‌ను వాడుకుంటోంద‌ని నిందించారు.

వారంతా ప్ర‌భుత్వ అధికారులే..

తన పేరును షిఫ్ట్ అయిన‌ట్లుగా ఎలా గుర్తించారని ఆయన ప్రశ్నించారు. ఎన్నికల ప్రక్రియలో వివిధ స్థాయిల్లో ప‌నిచేసే అధికారులంతా పంజాబ్ ప్రభుత్వ ఉద్యోగులేనని చ‌ద్ధా ఆరోపించారు. బూత్ లెవెల్ ఆఫీసర్లు (BLO) మొదలుకొని అసిస్టెంట్ ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్లు, ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్లు, డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్ల వరకు అందరూ రాష్ట్ర ప్రభుత్వ అధికారులే ఈ ప్రక్రియలో భాగస్వాములుగా ఉంటారని పేర్కొన్నారు. ఈ అధికారుల బ‌దిలీలు, పోస్టింగ్‌లు అన్నీ రాష్ట్ర ప్ర‌భుత్వ నియంత్ర‌ణ‌లోనే ఉంటాయి కాబ‌ట్టి వాళ్లు రాజ‌కీయ ఒత్తిళ్ల‌కు త‌లొగ్గే అవ‌కాశం ఉంద‌ని ఆరోపించారు.

కావాల‌నే రూల్స్‌ను బ్రేక్ చేశారు..

అదే స‌మ‌యంలో స‌ర్ మార్గ‌ద‌ర్శ‌కాల్లోని పేరాగ్రాఫ్ 4(డి)ని రాఘవ్ చద్దా ఈ సంద‌ర్భంగా ఉదహరించారు. దీని ప్ర‌కారం ఎంపీలు, ఎమ్మెల్యేలు స‌హా ప్ర‌జాప్ర‌తినిధులంతా ర‌క్షిత జాబితా (Protected list) కింద‌కు వ‌స్తార‌ని తెలిపారు. ప్ర‌జా ప్ర‌తినిధుల పేర్లు ఎన్నికల డేటాబేస్‌లో ఫ్లాగ్ అయిన‌ప్పటికీ.. క్లెయిమ్స్‌, అభ్యంతరాల సమయంలో అవసరమైన పత్రాలు సమర్పించుకునేందుకు వారి పేర్లను డ్రాఫ్ట్‌ ఓటర్ల జాబితాలో చేర్చాలని ఈ నిబంధన స్ప‌ష్టం చేస్తోంద‌ని అన్నారు. "నేను పంజాబ్ నుంచి ప్రాతినిధ్యం వ‌హిస్తున్న సిట్టింగ్ పార్ల‌మెంటు సభ్యుడిని. ఒక‌వేళ నా పేరును ఏమైనా త‌ప్పుగా గుర్తిస్తే పేరాగ్రాఫ్ 4(డి) ప్ర‌కారం ముసాయిదా ఓట‌ర్ల జాబితాలో క‌చ్చితంగా ఉంచాల్సిందే. కానీ నా విష‌యంలో ఈ నిబంధ‌న‌ను ఉద్దేశ‌పూర్వ‌కంగానే ఉల్లంఘించారు" అని చ‌ద్ధా ఆరోపించారు.

చ‌ద్ధా రాజ్య‌స‌భ స‌భ్య‌త్వానికి ముప్పు..?

ప్ర‌జా ప్రాతినిధ్య చ‌ట్టం ప్ర‌కారం.. ఒక వ్య‌క్తి పార్ల‌మెంట్ స‌భ్యుడిగా కొన‌సాగాలంటే దేశంలో ఎక్క‌డో ఒక చోట ఓట‌రుగా న‌మోదై ఉండాలి. ప్ర‌స్తుతం ఈ ముసాయిదా జాబితా ప్ర‌కారం.. చ‌ద్ధా పేరు ఢిల్లీ లేదా పంజాబ్ ఓట‌ర్ల లిస్టులో లేదు. ఇది ముసాయిదా జాబితా మాత్ర‌మే కాబ‌ట్టి.. ఆయ‌న త‌న ఓటును పున‌రుద్ధ‌రించుకోవ‌చ్చు. లేనిప‌క్షంలో ఆయ‌న రాజ్య‌స‌భ స‌భ్య‌త్వం ప్ర‌మాదంలో పడే అవ‌కాశం ఉంది.

ఖండించిన ఆప్ ప్ర‌భుత్వం..

చ‌ద్ధా ఆరోప‌ణ‌ల‌ను పంజాబ్‌లోని ఆప్ ప్ర‌భుత్వం తీవ్రంగా ఖండించింది. ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ అనేది కేంద్ర ఎన్నిక‌ల సంఘం ఆధ్వ‌ర్యంలో జరుగుతున్న‌ద‌ని పేర్కొంది. ఇందులో రాష్ట్ర ప్ర‌భుత్వ ప్ర‌మేయం ఏమీ లేద‌ని పంజాబ్ ఆప్ అధికారులు స్ప‌ష్టం చేశారు. అంతేకాదు, చ‌ద్ధా త‌న ఓట‌రు న‌మోదును ఢిల్లీకి మార్చుకునే ప్ర‌య‌త్నం చేశార‌ని ఆరోపించారు.

ఇది కేవ‌లం డ్రాఫ్ట్ జాబితా మాత్ర‌మే

చ‌ద్ధా ఆరోప‌ణ‌ల‌పై పంజాబ్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ (CEO) అనిందితా మిత్ర స్పందించారు. ఆయ‌న పేరు తొల‌గింపున‌కు సంబంధించిన స‌మాచారం త‌న వ‌ద్ద లేద‌ని చెప్పారు. అస‌లు పేరు తొల‌గింపు నిజంగా జ‌రిగిందా..? ఒక‌వేళ జ‌రిగితే దానికి గ‌ల కార‌ణాలు ఏమిటి..? అని తెసుసుకోవ‌డానికి జిల్లా ఎన్నిక‌ల అధికారుల నుంచి స‌మ‌గ్ర నివేదిక కోర‌తామ‌ని వెల్ల‌డించారు. అంతేకాదు, ఇది ప్రస్తుతం డ్రాఫ్ట్‌ ఓటర్ల జాబితా మాత్రమేనని స్ప‌ష్టం చేశారు. పేరు తొల‌గింపుపై అభ్యంత‌రాలు, క్లెయిమ్స్ దాఖ‌లు చేసుకునే అవ‌కాశం చ‌ద్ధాతో పాటూ ఇత‌ర ఓట‌ర్ల‌కు కూడా ఉంద‌ని చెప్పుకొచ్చారు. సెప్టెంబ‌ర్‌లో ఈ ప్రక్రియ పూర్త యిన అనంత‌రం అక్టోబ‌రులో తుది ఓట‌ర్ల జాబితా వెలువ‌డుతుంద‌ని క్లారిటీ ఇచ్చారు. ఓట‌రు జాబితాలో మార్పులు, వ్య‌త్యాసాలు ఏవైనా ఉంటే అప్పీల్ చేసుకునేందుకు సెప్టెంబ‌ర్ 13 తుది గ‌డువు అని తెలిపారు. ప్రస్తుతం క్లెయిమ్‌లు, అభ్యంతరాల ప్రక్రియ కొనసాగుతోందని మిత్ర స్ప‌ష్టం చేశారు.

20.66 లక్షల పేర్లు తొలగింపు

ఎన్నికల సంఘం (ECI) చేపట్టిన ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ప్రక్రియలో భాగంగా పంజాబ్‌లో డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా నుంచి మొత్తం 20.66 లక్షల మంది పేర్లను తొలగించారు. దీంతో స‌ర్ కసరత్తు తర్వాత ఓటర్ల సంఖ్య సుమారు 2.14 కోట్ల నుంచి 1.93 కోట్లకు పడిపోయింది. వీళ్లలో శాశ్వతంగా ఇతర ప్రాంతాలకు తరలిపోయినవాళ్లు, మరణించినవారు, డూప్లికేట్‌ నమోదులు ఉన్నవారు ఉన్నారు. తుది జాబితా అక్టోబ‌ర్ 12న విడుద‌ల కానుంది.

Also Read..

శరత్ సిటీ మాల్‌లోని PUMA షూ కంపెనీకి దిమ్మ తిరిగిపోయే షాక్

లాభాల్లో ప్రారంభ‌మైన స్టాక్ మార్కెట్లు.. అయినా టెన్ష‌నే..

క‌ర్రెగుట్ట‌ల్లో పేలిన మందుపాత‌ర‌.. ఆవులు మేపేందుకు వెళ్లి వ్య‌క్తి మృతి

Advertisement
Advertisement