త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Delhi Hotel Fire | ఢిల్లీ అగ్నిప్రమాదం: ప్రాణాలు కాపాడేందుకు పరుపులనే ‘సేఫ్టీ నెట్’గా మార్చి.. 2 లక్షలు నష్టపోయిన వ్యాపారి

ఢిల్లీ హోటల్ అగ్నిప్రమాదంలో 21 మంది చనిపోయారు. అయితే మంటల్లో చిక్కుకున్న వారిని కాపాడేందుకు ఓ పరుపుల వ్యాపారి చేసిన త్యాగం అందరి హృదయాలను గెలుచుకుంటోంది.

J

National | Published On Jun 4, 2026, 6.32 pm IST

Delhi Hotel Fire | ఢిల్లీ అగ్నిప్రమాదం: ప్రాణాలు కాపాడేందుకు పరుపులనే ‘సేఫ్టీ నెట్’గా మార్చి.. 2 లక్షలు నష్టపోయిన వ్యాపారి
Advertisement
  • ఢిల్లీలోని మాల్వియా నగర్‌లో 'ఫ్లోరిష్ స్టేస్' (Flourish Stays) హోటల్‌లో జరిగిన భారీ అగ్నిప్రమాదంలో 21 మంది ప్రాణాలు కోల్పోయారు.
  • మంటల్లో చిక్కుకున్న వారిని కాపాడేందుకు రియాజుద్దీన్, అర్మాన్ అనే తండ్రీకొడుకులు తమ సొంత పరుపులను రోడ్డుపై పరిచారు.
  • పై అంతస్తుల నుంచి దూకిన వారి ప్రాణాలు కాపాడేందుకు సుమారు రూ.2 లక్షల విలువైన కొత్త పరుపులను వారు త్యాగం చేశారు.
  • మానవత్వాన్ని చాటుకున్న ఈ రియల్ హీరోలకు నెటిజన్లు సెల్యూట్ చేస్తూ, ప్రభుత్వం వారికి పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.

Delhi Hotel Fire | త్రినేత్ర.న్యూస్ : జూన్ 3న ఢిల్లీలోని మాల్వియా నగర్ (Malviya Nagar) ప్రాంతంలో జరిగిన ఘోర అగ్నిప్రమాదం దేశవ్యాప్తంగా విషాదం నింపింది. హౌజ్ రాణీ ప్రాంతంలోని 'ఫ్లోరిష్ స్టేస్' (Flourish Stays) అనే బేడ్-అండ్-బ్రేక్‌ఫాస్ట్ హోటల్‌లో బుధవారం వేకువజామున జరిగిన ఈ ప్రమాదంలో 9 మంది భారతీయులు, 12 మంది విదేశీయులు సహా మొత్తం 21 మంది సజీవ దహనమయ్యారు. అయితే, ఈ భయంకరమైన మంటల మధ్య ఓ తండ్రీకొడుకులు చేసిన సాహసం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తమ వ్యాపారం నష్టపోయినా పర్వాలేదనుకుని, ప్రాణాపాయంలో ఉన్న ఎంతో మందిని వారు సేఫ్టీ నెట్‌లా మారి కాపాడారు.

రియల్ హీరోలు

హోటల్‌కు ఎదురుగా రియాజుద్దీన్ మన్సూరి, అతని కుమారుడు అర్మాన్ గత నాలుగు దశాబ్దాలుగా పరుపుల వ్యాపారం (Mattress shop) చేస్తున్నారు. బుధవారం ఉదయం 8:30 గంటల ప్రాంతంలో హోటల్ గ్రౌండ్ ఫ్లోర్‌లో మంటలు చెలరేగాయి. పొగ దట్టంగా కమ్ముకోవడంతో ఎవరూ లోపలికి వెళ్లలేని, బయటకు రాలేని పరిస్థితి ఏర్పడింది. పై అంతస్తుల్లో ఉన్న గెస్ట్‌లు ప్రాణభయంతో కిటికీల నుంచి దూకేస్తామని అరుస్తున్నారు.

ఇది చూసిన వెంటనే అర్మాన్, తన తండ్రి రియాజుద్దీన్‌తో కలిసి తమ షాపులోని 20 నుంచి 25 కొత్త పరుపులను, రగ్గులను (Quilts) బయటకు లాక్కొచ్చారు. హోటల్ కింద రోడ్డుపై వాటిని దళసరిగా పరిచారు. దాన్ని ఒక సేఫ్టీ నెట్‌లా (Safety net) ఏర్పాటు చేసి, పైనుంచి దూకేవారికి ఎలాంటి గాయాలు కాకుండా ప్రాణాలు కాపాడారు.

మానవత్వం ముందు మతం లేదు

"ఈ ఘటనలో నాకు సుమారు రూ. 2 లక్షల నష్టం వచ్చింది. కేవలం పరుపులే కాకుండా, చనిపోయిన వారి బాడీలను, గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించడానికి మా షాపులోని బెడ్‌షీట్లు, కవర్లు అన్నీ ఇచ్చేశాం. మా చేతికి ఏది దొరికితే అది ఇచ్చి సాయం చేశాం. మానవత్వం ముందు హిందూ, ముస్లిం అనే తేడా లేదు. మేమంతా హిందుస్థానీలం. ఆపదలో ఉన్న మన తోటివాళ్లను కాపాడుకోవడం నా బాధ్యత" అని రియాజుద్దీన్ ఎమోషనల్ అయ్యారు.

ప్రభుత్వం పరిహారం ఇవ్వాలి: నెటిజన్ల డిమాండ్

ఈ తండ్రీకొడుకుల నిస్వార్థ సేవపై సోషల్ మీడియాలో (Social media) ప్రశంసల జల్లు కురుస్తోంది. ఎవరో తెలియని వ్యక్తుల కోసం రూ.2 లక్షలు నష్టపోయిన ఈ రియల్ హీరోలకు ప్రభుత్వం తగిన పరిహారం (Compensation) ఇవ్వాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.

"లంచాలు తీసుకుని ఇలాంటి కనీస సేఫ్టీ రూల్స్ లేని హోటల్స్‌కు పర్మిషన్ ఇచ్చిన అధికారులను జైలులో పెట్టాలి.. కానీ ఈ షాపు ఓనర్‌కు మాత్రం కచ్చితంగా రివార్డు ఇవ్వాలి" అని ఒక యూజర్ కామెంట్ చేయగా.. "వీరి కోసం ఎవరైనా ఆన్‌లైన్‌లో ఫండ్ రైజర్ (Fundraiser) పెడితే నా వంతుగా కొంత సాయం చేస్తాను" అని మరో యూజర్ స్పందించారు. నెటిజన్లు ఈ తండ్రీకొడుకుల గొప్ప మనసుకు సెల్యూట్ చేస్తున్నారు.

Advertisement
Advertisement