త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Delhi Hotel Fire | ఢిల్లీ అగ్నిప్రమాదంలో షాకింగ్ ట్విస్ట్: అనుమతి 6 గదులకే.. కానీ..!

ఢిల్లీలో 21 మందిని బలితీసుకున్న అగ్నిప్రమాదంలో షాకింగ్ నిజాలు వెలుగులోకి వచ్చాయి. నిబంధనలను తుంగలో తొక్కి ఆ హోటల్ చేసిన నిర్వాకమే ఈ ఘోరానికి కారణమైంది.

J

Crime | Published On Jun 3, 2026, 2.58 pm IST

Delhi Hotel Fire | ఢిల్లీ అగ్నిప్రమాదంలో షాకింగ్ ట్విస్ట్: అనుమతి 6 గదులకే.. కానీ..!
Advertisement

Delhi Hotel Fire | త్రినేత్ర.న్యూస్ : ఢిల్లీ (Delhi) అగ్నిప్రమాదం మరోసారి అధికారుల నిర్లక్ష్యానికి, వ్యాపారుల అత్యాశకు అద్దం పడుతోంది. దక్షిణ ఢిల్లీలోని హౌజ్ రాణి ప్రాంతంలో బుధవారం ఉదయం జరిగిన అగ్నిప్రమాదంలో 21 మంది సజీవ దహనమైన విషయం తెలిసిందే. అయితే ఈ 'ఫ్లోరిష్ స్టే' (Flourish Stay B&B) హోటల్ ఒక మృత్యుకూపమని, నిబంధనలను గాలికి వదిలేసి అక్రమంగా నడిపిన వ్యవహారం తాజాగా వెలుగులోకి వచ్చింది.

6 గదుల పర్మిషన్.. 25 గదుల వ్యాపారం

ఢిల్లీ ప్రభుత్వ 'బెడ్ అండ్ బ్రేక్‌ఫాస్ట్ (B&B)' స్కీమ్ కింద ఈ హోటల్‌కు లైసెన్స్ మంజూరైనట్లు జాతీయ మీడియా తెలిపింది. నిబంధనల ప్రకారం ఈ అనుమతితో కేవలం 6 గదులు మాత్రమే నిర్వహించాలి. కానీ, బేస్‌మెంట్‌తో కలుపుకుని ఏకంగా 25 రూమ్స్ నడుపుతున్నట్లు దర్యాప్తులో తేలింది. ఎలాంటి అధికారిక పర్యవేక్షణ లేకపోవడం, నిబంధనల ఉల్లంఘనే ఈ ఘోర విషాదానికి ప్రధాన కారణమైంది.

ఒకే ఒక్క దారి.. మృత్యువుకు దారి

పోలీసుల ప్రాథమిక విచారణలో మరో దిగ్భ్రాంతికరమైన విషయం బయటపడింది. ఇరుకు సందుల్లో ఉన్న ఈ ఐదంతస్తుల భవనానికి కేవలం ఒకే ఒక్క ఎంట్రీ, ఎగ్జిట్ (Entry and Exit) పాయింట్ ఉంది. 25 గదుల్లో పదుల సంఖ్యలో గెస్టులు ఉన్నప్పుడు కనీసం ఫైర్ సేఫ్టీ ఎగ్జిట్ కూడా లేకపోవడం వల్లే లోపల ఉన్నవారు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పిట్టల్లా రాలిపోయారు. ఈ హోటల్‌కు ఫైర్ సేఫ్టీ (Fire safety) అధికారుల క్లియరెన్స్ ఎలా వచ్చిందన్న దానిపై ఇప్పుడు పోలీసులు తీవ్రంగా దర్యాప్తు చేస్తున్నారు.

బలైపోయింది విదేశీయులే..

ప్రమాదం జరిగిన సమయంలో హోటల్‌లో సుమారు 40 మంది గెస్టులు ఉన్నారు. హౌజ్ రాణి ప్రాంతం ఢిల్లీలోని అతిపెద్ద ప్రైవేట్ ఆసుపత్రులకు దగ్గరగా ఉండటంతో.. మెడికల్ ట్రీట్‌మెంట్ కోసం వచ్చిన విదేశీయులు ఇక్కడే బస చేశారు. తెల్లవారుజామున మంటలు చెలరేగినప్పుడు వారంతా గాఢ నిద్రలో ఉన్నారు. మరణించిన 21 మందిలో ఎక్కువ మంది ఈ విదేశీయులే కావడం గమనార్హం.

ప్రాణభయంతో పైనుంచి..

మంటలు ఎగసిపడుతున్న సమయంలో ప్రాణభయంతో కొందరు మహిళలు పై అంతస్తుల నుంచి కిందకు దూకేసిన వీడియోలు కంటతడి పెట్టిస్తున్నాయి. అయితే, స్థానికులు సమయస్ఫూర్తితో రోడ్డుపై పరుపులు (Mattresses) వేసి కొందరి ప్రాణాలను కాపాడగలిగారు. అధికారుల కనుసన్నల్లోనే ఇంత పెద్ద అక్రమం ఎలా జరిగిందన్న దానిపై ఇప్పుడు దేశవ్యాప్తంగా తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

Advertisement
Advertisement