త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Mamata Banerjee Football Sculpture | సాల్ట్ లేక్ స్టేడియం వద్ద మమతా బెనర్జీ ‘వింత’ విగ్రహం కూల్చివేత.. యాక్షన్‌లోకి దిగిన బీజేపీ ప్రభుత్వం

కోల్‌కతాలోని ప్రసిద్ధ సాల్ట్ లేక్ స్టేడియం వద్ద మమతా బెనర్జీ డిజైన్ చేసిన వివాదాస్పద ఫుట్‌బాల్ విగ్రహాన్ని బీజేపీ ప్రభుత్వం కూల్చివేసింది. అసలేం జరిగిందంటే?

J

National | Published On May 23, 2026, 3.52 pm IST

Mamata Banerjee Football Sculpture | సాల్ట్ లేక్ స్టేడియం వద్ద మమతా బెనర్జీ ‘వింత’ విగ్రహం కూల్చివేత.. యాక్షన్‌లోకి దిగిన బీజేపీ ప్రభుత్వం
Advertisement
  • కోల్‌కతాలోని సాల్ట్ లేక్ స్టేడియం వీవీఐపీ గేట్ వద్ద ఉన్న వివాదాస్పద ఫుట్‌బాల్ విగ్రహాన్ని శనివారం ఉదయం బీజేపీ ప్రభుత్వం తొలగించింది.
  • 2017లో ఫిఫా అండర్-17 వరల్డ్ కప్ సమయంలో అప్పటి సీఎం మమతా బెనర్జీ ఈ విగ్రహాన్ని స్వయంగా డిజైన్ చేసి ఏర్పాటు చేయించారు.
  • ఆకారం లేని ఈ వికృత విగ్రహం పెట్టిన తర్వాతే గత టీఎంసీ ప్రభుత్వానికి చెడ్డ రోజులు మొదలయ్యాయని క్రీడా మంత్రి నిసిత్ ప్రామాణిక్ వ్యాఖ్యానించారు.
  • గత ఏడాది మెస్సీ టూర్ (GOAT India Tour) సందర్భంగా జరిగిన అల్లర్లకు ఈ సెంటిమెంట్‌ను మంత్రి ముడిపెట్టారు.

Mamata Banerjee Football Sculpture | త్రినేత్ర.న్యూస్ : పశ్చిమ బెంగాల్‌లో కొత్తగా కొలువుదీరిన బీజేపీ ప్రభుత్వం యాక్షన్‌లోకి దిగింది. కోల్‌కతాలోని ప్రతిష్టాత్మక సాల్ట్ లేక్ స్టేడియం (Salt Lake Stadium) వద్ద ఎన్నో ఏళ్లుగా ఉన్న ఒక వివాదాస్పద ఫుట్‌బాల్ విగ్రహాన్ని శనివారం ఉదయం అధికారులు పూర్తిగా కూల్చివేశారు. మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్వయంగా డిజైన్ చేసిన ఈ నిర్మాణం మొదటి నుంచీ విమర్శల పాలవుతూనే ఉంది.

ఆ విగ్రహం ప్రత్యేకత ఏంటి.. ఎందుకు వివాదం?

పై నుంచి సగం వరకు కత్తిరించిన రెండు కాళ్లు, దానిపై ఒక ఫుట్‌బాల్ ఉన్నట్లుగా ఈ విగ్రహాన్ని డిజైన్ చేశారు. 2017లో జరిగిన ఫిఫా అండర్-17 వరల్డ్ కప్ (FIFA U-17 World Cup) సమయంలో అప్పటి సీఎం మమతా బెనర్జీ ఆలోచనల మేరకు దీన్ని వీవీఐపీ గేట్ ముందు ప్రతిష్టించారు. దీనిపై గత టీఎంసీ ప్రభుత్వ అధికారిక చిహ్నమైన 'బిస్వా బంగ్లా' లోగో కూడా ఉండేది.

అయితే, ఈ విగ్రహం చూసేందుకు చాలా వింతగా (grotesque) ఉంటుందని, ఇది క్రీడాభిమానుల కళ్లకు ఏమాత్రం ఇంపుగా లేదని అప్పట్లోనే చాలా మంది విమర్శించారు. ఈస్ట్ బెంగాల్, మోహన్ బగాన్ లాంటి దిగ్గజ జట్ల మధ్య ఎన్నో చారిత్రక మ్యాచ్‌లకు వేదికైన ఈ స్టేడియంలో ఇలాంటి విగ్రహం ఉండటంపై ఫుట్‌బాల్ ఫ్యాన్స్ పెదవి విరిచేవారు.

సీఎం సువేందు అధికారి నిర్ణయం

బెంగాల్‌లో బీజేపీ తొలి సీఎంగా సువేందు అధికారి ప్రమాణ స్వీకారం చేసిన మరుసటి రోజే.. ఈ వివాదాస్పద నిర్మాణంపై కీలక ప్రకటన చేశారు. ఈ విగ్రహాన్ని తొలగిస్తామని ఆయన అప్పట్లోనే స్పష్టం చేశారు. ఆ హామీ మేరకే శనివారం ఉదయం ఈ నిర్మాణాన్ని అధికారులు పూర్తిగా తొలగించారు.

"సాల్ట్ లేక్ స్టేడియం ముందున్న ఈ వింత ఆకారాన్ని ఎట్టకేలకు తొలగించాం. మేం ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం" అని బీజేపీ నాయకురాలు కేయా ఘోష్ ఎక్స్‌లో పోస్ట్ చేశారు.

విగ్రహంతోనే టీఎంసీకి చెడ్డరోజులు మొదలయ్యాయి: క్రీడా మంత్రి

మే 17న బెంగాల్ క్రీడా శాఖ మంత్రి నిసిత్ ప్రామాణిక్ మీడియాతో మాట్లాడుతూ ఈ విగ్రహంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. "అంత గొప్ప స్టేడియం ముందు ఇలాంటి అర్థం పర్థం లేని, వికారమైన విగ్రహం ఉండటం ఏమాత్రం కరెక్ట్ కాదు. అందుకే దాన్ని తొలగిస్తున్నాం. స్టేడియంలో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం అనేక ప్రణాళికలు సిద్ధం చేసింది" అని ఆయన తెలిపారు.

ఈ విగ్రహం వల్లే టీఎంసీ (TMC) పతనం మొదలైందని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. "ఈ విగ్రహం పెట్టిన తర్వాతే గత ప్రభుత్వానికి చెడ్డ రోజులు వచ్చాయని నేను భావిస్తున్నాను. ఆ తర్వాత మెస్సీ కాంట్రవర్సీ జరగడం, వారు అధికారం కోల్పోవడం జరిగిపోయాయి" అని ప్రామాణిక్ అన్నారు.

గత డిసెంబర్‌లో ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ 'GOAT India Tour' లో భాగంగా సాల్ట్ లేక్ స్టేడియానికి వచ్చినప్పుడు.. నిర్వహణ లోపం వల్ల తీవ్ర గందరగోళం ఏర్పడింది. ఆ అల్లర్లకు అప్పటి టీఎంసీ ప్రభుత్వమే కారణమంటూ ఫ్యాన్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.

Advertisement
Advertisement