త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Ratna Debnath | నేను బిడ్డ‌ను కోల్పోయా.. మ‌మ‌త కుర్చీని కోల్పోయింది : ఆర్జీకార్ మృతురాలి త‌ల్లి

Ratna Debnath | మాజీ ముఖ్య‌మంత్రి మ‌మ‌తా బెన‌ర్జీ, తాను తీవ్ర దుఃఖంలో ఉన్నామ‌ని ఆర్జీకార్ మృతురాలి త‌ల్లి, బీజేపీ ఎమ్మెల్యే రత్న దేబ్‌నాథ్ (Ratna Debnath) అన్నారు. తాను బిడ్డ‌ను కోల్పోతే.. దీదీ మాత్రం సీఎం కుర్చీని కోల్పోయిందంటూ వ్యాఖ్యానించారు.

D

National | Published On May 26, 2026, 10.57 am IST

Ratna Debnath | నేను బిడ్డ‌ను కోల్పోయా.. మ‌మ‌త కుర్చీని కోల్పోయింది : ఆర్జీకార్ మృతురాలి త‌ల్లి
Advertisement

Ratna Debnath | ప‌శ్చిమ బెంగాల్ మాజీ ముఖ్య‌మంత్రి, తృణ‌మూల్ కాంగ్రెస్ అధినేత్రి మ‌మ‌తా బెన‌ర్జీ (Mamata Banerjee)పై కోల్‌క‌తాలోని ఆర్జీకార్ అత్యాచారం, హత్య కేసులో బాధితురాలి తల్లి, బీజేపీ ఎమ్మెల్యే రత్న దేబ్‌నాథ్ (Ratna Debnath) సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. తాను, దీదీ ఇద్ద‌రం చాలా న‌ష్ట‌పోయామని పేర్కొన్నారు. తాను త‌న బిడ్డ‌ను కోల్పోతే, మ‌మ‌త మాత్రం త‌న సీటును కోల్పోయారంటూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

2024లో కోల్‌కతాలోని ఆర్జీకార్ మెడికల్ కాలేజీలో రాత్రి స‌మ‌యంలో విధుల్లో ఉన్న 31 ఏళ్ల పోస్ట్ గ్రాడ్యుయేట్ రెసిడెంట్ డాక్టర్‌పై అత్యాచారం చేసి, దారుణంగా హత్య చేసిన విషయం తెలిసిందే. ఈ ఘ‌ట‌న అప్ప‌ట్లో దేశ‌వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించింది. ఈ ఘ‌ట‌న‌కు నిర‌స‌న‌గా దేశవ్యాప్తంగా వైద్య విద్యార్థులు, డాక్ట‌ర్లు పెద్ద ఎత్తున నిర‌స‌న చేప‌ట్టారు. ఈ ఘ‌ట‌న నేప‌థ్యంలో అప్ప‌టి దీదీ ప్ర‌భుత్వంపై తీవ్ర విమ‌ర్శ‌లు వ్య‌క్త‌మ‌య్యాయి. ఇక ఈ ఘ‌ట‌న‌లో బాధితురాలి త‌ల్లి రత్న దేబ్‌నాథ్ తాజాగా జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో బీజేపీ త‌ర‌ఫున పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. పాణిహ‌ట్టి నుంచి విజ‌యం సాధించారు. ఈ నేప‌థ్యంలో ఆమె నిన్న సీఎం సువేందు అధికారిని (CM Suvendu Adhikari) మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిశారు.

సీఎంతో భేటీ అనంత‌రం ఆమె ఎక్స్ వేదిక‌గా ఓ పోస్టు పెట్టారు. ఈ సంద‌ర్భంగా మ‌మ‌తా బెన‌ర్జీపై తీవ్ర స్థాయిలో విమ‌ర్శ‌లు గుప్పించారు. నిజాయితీకి ఉన్న శక్తి అపారమైనద‌ని.. అన్యాయానికి వ్యతిరేకంగా మనం ఓపికగా పోరాడాలని పేర్కొన్నారు. ఇవాళ తాను, మ‌మ‌తా బెనర్జీ ఇద్ద‌రం చాలా దుఃఖంలో ఉన్నామ‌ని వ్యాఖ్యానించారు. "నేను నా కూతుర్ని కోల్పోయాను. నా జీవితాన్ని ప్ర‌జ‌ల‌కు అంకితం చేశాను. కానీ మ‌మ‌తా బెన‌ర్జీ 14వ ఫ్లోర్‌లో ఉన్న తన సీఎం కుర్చీని కోల్పోయింది" అని దేబ్‌నాథ్ త‌న పోస్టులో రాసుకొచ్చారు. మాజీ సీఎం, తృణ‌మూల్ నేత‌లు రానున్న రోజుల్లో దారుణమైన పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందంటూ తీవ్రంగా హెచ్చరించారు.

Advertisement
Advertisement