త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Zaheerabad Farmers | జ‌హీరాబాద్ రైతుల వినూత్న ప్ర‌య‌త్నం.. 130 ర‌కాల పంట‌లు సాగు..!

Zaheerabad Farmers | పంట‌ల మార్పిడి చేయాల‌ని నోరు పోయేలా మొత్తుకుంటున్న‌ప్ప‌టికీ.. చాలా మంది రైతులు పెడ‌చెవిన పెడుతున్నారు. కానీ జ‌హీరాబాద్ రైతులు మాత్రం స్వ‌యంగా, వినూత్నంగా.. పంట‌ల మార్పిడి చేప‌ట్టి.. అద్భుతాలు సృష్టిస్తున్నారు. ముఖ్యంగా పండ్లు, కూర‌గాయ‌లు, పూలు, సుగంధ ద్ర‌వ్యాల వంటి ఉద్యాన‌వ‌న పంట‌ల‌ను పండిస్తూ.. లాభాదాయ‌క‌మైన ఆదాయాన్ని పొందుతున్నారు.

S

Agriculture | Published On May 26, 2026, 1.46 pm IST

Zaheerabad Farmers | జ‌హీరాబాద్ రైతుల వినూత్న ప్ర‌య‌త్నం.. 130 ర‌కాల పంట‌లు సాగు..!
Advertisement

Zaheerabad Farmers | త్రినేత్ర‌.న్యూస్ : తెలంగాణ‌లో వ్య‌వ‌సాయాన్ని కొత్త పుంత‌లు తొక్కించాల‌ని గ‌త ప్ర‌భుత్వం కానీ, నేటి కాంగ్రెస్ స‌ర్కార్ కానీ చ‌ర్య‌లు ముమ్మ‌రం చేసింది. కానీ స‌ఫ‌లీకృతం కాలేక‌పోయారు.. కాలేక‌పోతున్నారు కూడా. పంట‌ల మార్పిడి చేయాల‌ని నోరు పోయేలా మొత్తుకుంటున్న‌ప్ప‌టికీ.. చాలా మంది రైతులు పెడ‌చెవిన పెడుతున్నారు. కానీ జ‌హీరాబాద్ రైతులు మాత్రం స్వ‌యంగా, వినూత్నంగా.. పంట‌ల మార్పిడి చేప‌ట్టి.. అద్భుతాలు సృష్టిస్తున్నారు. ముఖ్యంగా పండ్లు, కూర‌గాయ‌లు, పూలు, సుగంధ ద్ర‌వ్యాల వంటి ఉద్యాన‌వ‌న పంట‌ల‌ను పండిస్తూ.. లాభాదాయ‌క‌మైన ఆదాయాన్ని పొందుతున్నారు.

జ‌హీరాబాద్ రైతులు.. ర‌క‌ర‌కాల చిరు ధాన్యాలు, నూనె గింజ‌ల‌తో ఇత‌ర పంట‌ల‌ను సాగు చేస్తున్నారు. ఈ డివిజ‌న్‌లోని రైతులు 130కి పైగా ర‌కాల పంట‌ల‌ను సాగు చేస్తూ ఇత‌ర అన్న‌దాత‌ల‌కు ఆద‌ర్శంగా నిలుస్తున్నారు. వీరి వ్య‌వ‌సాయ ప‌ద్ధ‌తులు ఇత‌ర రైతుల‌ను ఆక‌ర్షిస్తున్నాయి.

చియా నుంచి ఆపిల్.. ఖ‌ర్జూర నుంచి అవ‌కాడో వ‌ర‌కు

చియా నుంచి ఆపిల్, స్వీట్ కార్న్ నుంచి చెరుకు, కుసుమ నుంచి సోయాబీన్ వ‌ర‌కు, ఖ‌ర్జూర నుంచి అవ‌కాడో వ‌ర‌కు, జీడిప‌ప్పు నుంచి కొబ్బ‌రి వ‌ర‌కు, అల్లం నుంచి వాము వ‌ర‌కు, బీన్స్ నుంచి క్యారెట్ వ‌ర‌కు.. ఇలా జ‌హీరాబాద్ రైతులు ప్ర‌త్యామ్నాయ పంట‌ల‌ను సాగు చేయ‌డంలో ప్ర‌సిద్ధిగాంచారు.

40 ర‌కాల కూర‌గాయ‌లు, 26 ర‌కాల పండ్లు..

2025-26 ఏడాదిలో ఆకుకూర‌ల‌తో స‌హా 40 ర‌కాల కూర‌గాయ‌లు, 26 ర‌కాల పండ్ల‌ను పండించారు. 8 ర‌కాల నూనె గింజ‌లు, 6 ర‌కాల ప‌ప్పుధాన్యాలు, 5 ర‌కాల ముత‌క ధాన్యాలు, 5 ర‌కాల వాణిజ్య పంట‌లు, 6 ర‌కాల పూలు, ఎనిమిది ర‌కాల ఆగ్రో ఫారెస్ట్రీ మొక్క‌ల‌తో పాటు ప‌లు వెరైటీల‌ను సాగు చేశారు.

సార‌వంత‌మైన నేల కాబ‌ట్టే అధిక దిగుబ‌డి..

రంజోలు గ్రామానికి చెందిన యువ రైతు బ‌స‌వంత్‌పూర్ ర‌మేశ్ రెడ్డి మాట్లాడుతూ.. స్థానిక రైతులు వైవిధ్య‌మైన పంట‌ల‌ను పండించేందుకు ఆస‌క్తి చూపుతున్నారు. ఇక్క‌డి సార‌వంత‌మైన నేల అధిక దిగుబ‌డిని ఇస్తుంద‌న్నారు. కాబ‌ట్టి రైతులు ప్ర‌త్యామ్నాయ పంట‌ల‌ను పండిస్తూ లాభాల‌ను గ‌డిస్తున్నార‌ని చెప్పారు.

స‌జ్జాపూర్ చామ‌గ‌డ్డకు జీఐ ట్యాగ్

కోహీరు మండ‌లంలో సాగు చేస్తున్న స‌జ్జాపూర్ చామ‌గ‌డ్డ జీఐ ట్యాగ్ పొందేందుకు సిద్ధంగా ఉంద‌న్నారు. స్థానికంగా పండించే కోహీరు జామ‌కాయ కూడా హైద‌రాబాద్ న‌గ‌రంతో పాటు క‌ర్ణాట‌క‌, మ‌హారాష్ట్ర‌లో కూడా ప్ర‌సిద్ధిగాంచింది. దీని రుచి కూడా వేరు అని తెలిపారు. మొగుడంప‌ల్లి మండ‌ల ప‌రిధిలోని రైతులు జెరానీయం ఆయిల్‌ను ఉత్ప‌త్తి చేసి ముంబైకి ఎగుమ‌తి చేశార‌ని ర‌మేశ్ రెడ్డి తెలిపారు.

ఇత‌ర రైతులు ఆద‌ర్శ‌వంతంగా తీసుకోవాలి..

ఈ సంద‌ర్భంగా జిల్లా వ్య‌వ‌సాయ అధికారి కే శివ‌ప్ర‌సాద్ మాట్లాడుతూ.. రాష్ట్ర అవ‌స‌రాల‌ను తీర్చే విధంగా వైవిధ్య‌భ‌రిత‌మైన పంట‌ల‌ను సాగు చేయాల‌ని, ఇందుకు జ‌హీరాబాద్ రైతుల‌ను రాష్ట్రంలోని ఇత‌ర రైతులు ఆద‌ర్శ‌వంతంగా తీసుకోవాల‌ని ఆయ‌న పిలుపునిచ్చారు.

బంగాళాదుంప సాగు మెళ‌కువ‌లు నేర్చుకున్న కేసీఆర్

బంగాళాదుంప సాగుకు సంబంధించి మాజీ సీఎం కేసీఆర్ కూడా జ‌హీరాబాద్ రైతుల నుంచి మెళ‌కువ‌లు నేర్చుకున్నారు. ఆ స‌మ‌యంలో ఈ ప్రాంతానికి చెందిన రైతుల‌ను కేసీఆర్ లంచ్‌కు కూడా ఆహ్వానించారు.

ఉద్యాన‌వ‌న విద్యార్థుల క్షేత్ర ప‌ర్య‌ట‌న‌

ఇక స్థానికంగా ఉన్న ఉద్యాన‌వ‌న క‌ళాశాల విద్యార్థుల‌ను జహీరాబాద్, కోహీర్, ఝ‌రాసంగం, మొగుడంప‌ల్లి, న్యాల్క‌ల్ వంటి ప్రాంతాల‌కు క్షేత్ర ప‌ర్య‌ట‌న‌కు తీసుకెళ్తున్న‌ట్లు ఏఈవో ప్ర‌దీప్ కుమార్ తెలిపారు. రైతులు పండిస్తున్న వైవిధ్య‌మైన పంట‌ల‌పై విద్యార్థుల‌కు అవ‌గాహ‌న క‌ల్పిస్తున్నామ‌ని చెప్పారు.

రాష్ట్ర ప్ర‌భుత్వం నుంచి ఎలాంటి మ‌ద్ద‌తు లేదు

విత్త‌నాల కొనుగోలు, పండించిన పంట మార్కెటింగ్, నిల్వ విష‌యంలో రాష్ట్ర ప్ర‌భుత్వం నుంచి త‌మ‌కు ఎలాంటి మ‌ద్ద‌తు లేద‌ని జ‌హీరాబాద్ రైతులు ఆవేద‌న వ్య‌క్తం చేశారు. తాము ప్ర‌త్యామ్నాయ పంట‌ల వైపు మొగ్గు చూపుతున్నందున ప్ర‌భుత్వం కూడా త‌మ‌కు అండ‌గా ఉండాల‌న్నారు.

Advertisement
Advertisement