త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Rajasthan Schools | సీజేపీ త‌నిఖీల‌తో వెలుగులోకి రాజ‌స్థాన్ ప్ర‌భుత్వ బ‌డుల దుస్థితి.. 611 పాఠ‌శాల‌ల‌కు సొంత భ‌వ‌నాలు లేవ‌ని అంగీక‌రించిన స‌ర్కార్‌

Rajasthan Schools | కాక్రోచ్ జ‌న‌తా పార్టీ చేప‌ట్టిన పాఠ‌శాల‌ల త‌నిఖీ కార్య‌క్ర‌మంతో రాజ‌స్థాన్‌లోని ప్ర‌భుత్వ బ‌డుల ద‌య‌నీయ‌ దుస్థితి వెలుగులోకి వ‌చ్చింది. అనేక ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల్లో మౌలిక వసతుల కొరత తీవ్రంగా ఉందని అసెంబ్లీ వేదిక‌గా అక్క‌డి బీజేపీ స‌ర్కార్‌ అధికారికంగా తెలిపింది. ఏకంగా 611 ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల‌కు సొంత భ‌వ‌నాలు లేవ‌ని అంగీక‌రించింది.

D

National | Published On Aug 22, 2026, 11.59 am IST

Rajasthan Schools | సీజేపీ త‌నిఖీల‌తో వెలుగులోకి రాజ‌స్థాన్ ప్ర‌భుత్వ బ‌డుల దుస్థితి.. 611 పాఠ‌శాల‌ల‌కు సొంత భ‌వ‌నాలు లేవ‌ని అంగీక‌రించిన స‌ర్కార్‌
Advertisement

Rajasthan Schools | త్రినేత్ర‌.న్యూస్ : పాఠశాలల తనిఖీ కార్యక్రమంలో భాగంగా బీజేపీ పాలిత రాజస్థాన్‌లోని ఓ గ్రామంలోకి (Rajasthan Schools) వస్తున్న కాక్రోచ్‌ జనతా పార్టీ (సీజేపీ) కార్యకర్తలను గ్రామస్తులు అడ్డుకోవడమే కాకుండా వారిపై దాడి చేసిన ఘటన క‌ల‌క‌లం రేపిన విష‌యం తెలిసిందే. జైపూర్ స‌మీపంలోని బ‌గ్రులో శుక్ర‌వారం ఉద‌యం ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది. అక్క‌డి ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ను ప‌శువుల పాక‌లో నిర్వ‌హిస్తున్న విష‌యం తెలుసుకున్న సీజేపీ జాతీయ అధికార ప్రతినిధి అశుతోష్‌ రాంకా (Ashutosh Ranka) నేతృత్వంలోని బృందం ఆ గ్రామానికి వెళ్ల‌డంతో స్థానికులు వారిని అడ్డుకోవ‌డం ఉద్రిక్త‌త‌కు దారి తీసింది. ఈ నేప‌థ్యంలో రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల దుస్థితిపై అక్క‌డి ప్ర‌భుత్వం (Rajasthan government) సంచలన విషయాలు వెల్లడించింది.

611 పాఠ‌శాల‌ల‌కు సొంత భ‌వ‌నాలు లేవు..

రాష్ట్రంలోని అనేక ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల్లో మౌలిక వసతుల కొరత తీవ్రంగా ఉందని అసెంబ్లీ వేదిక‌గా అధికారికంగా తెలిపింది. ఏకంగా 611 ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల‌కు సొంత భ‌వ‌నాలు లేవ‌ని అంగీక‌రించింది. ఇందులో 10 బాలికల పాఠశాలలు కూడా ఉన్నాయి. అంతేకాదు ఒక్క రాజ‌ధాని జైపూర్‌లోనే భ‌వ‌నాలు లేకుండా సుమారు 38 పాఠ‌శాల‌లు న‌డుస్తున్న‌ట్లు వెల్ల‌డించింది. ఆ త‌ర్వాత ఝ‌లావార్‌లోని ఆక్లేరా బ్లాక్‌లో 23 పాఠ‌శాల‌ల‌కు సొంత భ‌వ‌నాలు లేవ‌ని తెలిపింది.

సొంత భవనం లేని బాలికల పాఠశాలల విషయానికొస్తే.. జైపూర్, అల్వార్‌లలో రెండేసి పాఠశాలలు, బార్మేర్, చురు, డుంగర్‌పూర్, కరౌలి, కోటా, రాజ్‌సమంద్‌లలో ఒక్కో పాఠశాల ఉన్నాయి. ఆయా పాఠ‌శాల‌లు తాత్కాలిక లేదా అద్దె ప్రాంగణాల్లో నడుస్తున్నట్లు ప్ర‌భుత్వం తెలిపింది.

గిరిజ‌న ప్రాంతాల్లోని పాఠ‌శాల‌ల‌ దుస్థితి ద‌య‌నీయం..

ఇక‌ రాష్ట్రంలోని 64,484 ప్రభుత్వ పాఠశాల‌కు సొంత‌ భవనాలు ఉన్నప్పటికీ వాటిలో 2,047 బడులకు మరుగుదొడ్ల సౌకర్యం లేదు. అలాగే 1,049 పాఠశాలల్లో తాగునీటి సదుపాయం క‌ర‌వైంది. మరుగుదొడ్ల కొరత విషయానికొస్తే.. గిరిజన జనాభా ఎక్కువగా ఉన్న జిల్లాల్లో పరిస్థితి అత్యంత దారుణంగా ఉంది. బాన్స్‌వారా (188), దుంగార్పూర్ (124), ఉదయ్‌పూర్ (98) జిల్లాలు మొదటి మూడు స్థానాల్లో నిలిచాయి. ఆ తర్వాతి స్థానాల్లో బికనీర్ (84), ఝలావార్ (81), జైసల్మేర్ (79) ఉన్నాయి. తాగునీటి సౌకర్యాలు లేని పాఠశాలల విషయానికొస్తే.. అత్యధికంగా దౌసా (96) జిల్లాల్లో ఉండగా, ఆ తర్వాత ఉదయ్‌పూర్ (70), అల్వార్ (65), కరౌలి (60), బాన్స్‌వారా (58) ఉన్నాయి.

మ‌ర‌మ్మతుల‌కు భారీగా ఖ‌ర్చు..

పాఠ‌శాల‌ల మ‌ర‌మ్మ‌తులు, ఆధునీక‌ర‌ణ కోసం రూ.550 కోట్లు ఖర్చు చేయ‌డంతోపాటూ భ‌వ‌నాలు లేని పాఠ‌శాల‌లు, శిథిలావ‌స్థ‌లో ఉన్న భ‌వ‌నాల్లో న‌డుస్తున్న బ‌డుల‌కు రూ.450 కోట్ల వ్య‌యంతో కొత్త భ‌వ‌నాల‌ను నిర్మించేందుకు ఏర్పాట్లు చేసిన‌ట్లు ప్ర‌భుత్వం ఈ సంద‌ర్భంగా వెల్ల‌డించింది.

రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల మౌలిక సదుపాయాలను మెరుగుపరచడానికి భారీ కార్యాచరణ ప్రణాళికను ఈ సంద‌ర్భంగా ప్ర‌భుత్వం వివ‌రించింది. రాష్ట్రంలో శిథిలావస్థలో ఉన్న ప్రాథమిక, ఉన్నత మాధ్యమిక పాఠశాల భవనాల పునర్నిర్మాణం, ప్రధాన మరమ్మతులు, నిర్వహణ కోసం అదనంగా సంవత్సరానికి రూ. 2,500 కోట్లు, ఐదేళ్ల‌లో రూ. 12,500 కోట్ల నిధులు అందుబాటులో ఉంటాయ‌ని ప్ర‌భుత్వం తెలిపింది. ఈ వార్షిక రూ. 2,500 కోట్ల నిధులు డిస్ట్రిక్ట్ మినరల్ ఫౌండేషన్ ట్రస్ట్ (DMFT), సమగ్ర శిక్ష, రాష్ట్ర నిధులు, VB G-RAM-G, ఎంపీ/ఎమ్మెల్యే స్థానిక ప్రాంత అభివృద్ధి నిధులు, SDRF, CSR తదితర వనరుల నుంచి స‌మ‌కూరుస్తున్న‌ట్లు ప్ర‌భుత్వం వెల్ల‌డించింది.

ప్ర‌భుత్వం వ‌ద్ద ఎలాంటి ప్ర‌ణాళికా లేదు..

ఈ సంద‌ర్భంగా ప్ర‌భుత్వంపై ప్ర‌తిప‌క్ష నేత జుల్లీ తీవ్రంగా మండిప‌డ్డారు. ప్ర‌భుత్వం వ‌ద్ద ఎలాంటి ప్ర‌ణాళికా లేద‌ని విమ‌ర్శించారు. రాష్ట్రంలో పూర్తిగా శిథిలావస్థకు చేరి, వినియోగానికి సురక్షితం కాదని ప్రకటించిన ప్రభుత్వ పాఠశాలలు ఏకంగా 3,768 ఉన్నట్లు తెలిపారు. ప్ర‌భుత్వం ఈ పాఠ‌శాల‌ల‌ను మూసివేయ‌డం లేదా వేరే చోటుకి మార్చ‌డం వ‌ల్ల విద్యార్థుల ప్ర‌వేశాల సంఖ్య త‌గ్గిపోయింద‌ని ఆరోపించారు. అంతేకాకుండా, పాఠశాలల్లోని 83,783 గదులు పూర్తిగా శిథిలావస్థలో ఉన్నాయ‌ని వివ‌రించారు. నిధులు సమకూర్చడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. రాష్ట్రంలోని పాఠ‌శాల‌ల దుస్థితిపై హైకోర్టు కూడా ప్ర‌భుత్వ తీరును తీవ్రంగా త‌ప్పుబ‌ట్టింద‌ని ఈ సంద‌ర్భంగా వివ‌రించారు.

సీజేపీ ఉద్య‌మం..

ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల దుస్థితిపై కాక్రోచ్ జ‌న‌తా పార్టీ 'స్కూల్ ఠీక్‌ కరో' (School Thik Karo) పేరుతో ఓ ఉద్య‌మాన్ని ప్రాంభించిన విష‌యం తెలిసిందే. ఈ కార్య‌క్ర‌మంలో భాగంగా సీజేపీ కార్య‌కర్త‌లు దేశ‌వ్యాప్తంగా పాఠ‌శాల‌ల‌ను త‌నిఖీ చేస్తున్నారు. ఇందులో భాగంగానే సీజేపీ జాతీయ అధికార ప్రతినిధి అశుతోష్‌ రాంకా నేతృత్వంలోని బృందం రాజ‌స్థాన్ బ‌గ్రు గ్రామానికి వెళ్లింది. సీజేపీ బృందాన్ని గ్రామ‌స్తులు అడ్డుకున్నారు. వెన‌క్కి వెళ్లిపోవాల‌ని ఆదేశించారు. అయితే, పాఠశాలను తనిఖీ చేయకుండా తాము వెళ్లబోమని భీష్మించిన సీజేపీ నేతలు పాఠశాల బయట నిరసనకు దిగారు. దీంతో వారిపై గ్రామస్తులు దాడి చేశారు. బీజేపీకి చెందిన కొందరు తమపై రాళ్లతో దాడి చేశారని, కారు అద్దాలను పగులగొట్టారని, బట్టలు చింపేశారని, బృందంలోని మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించారని అశుతోష్ రాంకా ఆరోపించారు. సీజేపీ ఆందోళ‌న నేప‌థ్యంలో రాజ‌స్థాన్‌లోని ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల దుస్థితి వెలుగులోకి రావ‌డం గ‌మ‌నార్హం.

Also Read..

వృద్ధులే ల‌క్ష్యంగా రూ.63 కోట్ల‌ భారీ మోసం.. అమెరికాలో భారతీయుడి అరెస్ట్‌

యుద్ధం ఎఫెక్ట్‌.. బులియ‌న్ మార్కెట్ల వైపు పెట్టుబ‌డిదారుల చూపులు..

రూ.53.28 కోట్లతో మధుర్ నిట్ క్రాఫ్ట్స్ ఐపీఓ.. వివ‌రాలు ఇవే..

Advertisement
Advertisement