త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Nigeria | ఇరాన్ యుద్ధం ఎఫెక్ట్.. నైజీరియాలో పిల్లలపై తీవ్ర ప్రభావం..

Nigeria | ఇరాన్ యుద్ధం ప్రభావం మధ్యప్రాచ్యానికే పరిమితం కాకుండా వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న నైజీరియాలోని పేద కుటుంబాల జీవితాలను తీవ్రంగా దెబ్బతీస్తోంది. ముఖ్యంగా ఉత్తర నైజీరియాలో పోషకాహార లోపంతో బాధపడుతున్న చిన్నారుల సంఖ్య ఆందోళనకరంగా పెరుగుతోంది.

S

Lifestyle | Published On Jul 21, 2026, 10.47 am IST

Nigeria | ఇరాన్ యుద్ధం ఎఫెక్ట్.. నైజీరియాలో పిల్లలపై తీవ్ర ప్రభావం..
Advertisement

Nigeria | ఇరాన్ యుద్ధం ప్రభావం మధ్యప్రాచ్యానికే పరిమితం కాకుండా వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న నైజీరియాలోని పేద కుటుంబాల జీవితాలను తీవ్రంగా దెబ్బతీస్తోంది. ముఖ్యంగా ఉత్తర నైజీరియాలో పోషకాహార లోపంతో బాధపడుతున్న చిన్నారుల సంఖ్య ఆందోళనకరంగా పెరుగుతోంది. ఒకసారి ఆ లోపం నుంచి కోలుకున్న పిల్లలు ఆహారం అంద‌క‌పోవ‌డంతో మళ్లీ పోషకాహార లోపానికి గురవుతున్న ఘటనలు పెరుగుతున్నాయని వైద్య సిబ్బంది, సహాయక సంస్థలు చెబుతున్నాయి. ముఖ్యంగా వాయువ్య నైజీరియాలోని సోకోటో రాష్ట్రంలో ఈ సంఖ్య ఎక్కువ‌గా ఉంది. అక్క‌డ చిన్నారుల్లో చాలా మందికి పోష‌కాహార లోపం స‌మ‌స్య మ‌ళ్లీ మ‌ళ్లీ వ‌స్తోంది. చాలా వ‌ర‌కు కుటుంబాల ఆర్థిక ప‌రిస్థితి దెబ్బ తిన‌డంతో పిల్ల‌ల‌కు క్ర‌మం త‌ప్ప‌కుండా ఆహారం కూడా పెట్టలేక‌పోతున్నామ‌ని స్థానికులు ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు.

పోష‌కాహార లోపంతో ప‌దే ప‌దే హాస్పిట‌ళ్ల‌లో చేరిక‌..

ఫిబ్రవరిలో ఇరాన్ యుద్ధం కారణంగా పెట్రోల్ ధరలు ఒక్కసారిగా పెరగడంతో స్థానికంగా చాలా కుటుంబాల ఆదాయం గ‌ణ‌నీయంగా త‌గ్గింది. ఇప్ప‌టికీ అక్క‌డ చాలా మందికి ఎల్‌పీజీ గ్యాస్ స‌దుపాయం లేదు. బొగ్గు పొయ్యి మీద వండ‌డ‌మే దిక్కు. దీనికి తోడు ఆదాయం లేక‌పోవ‌డంతో పిల్ల‌లు పోష‌కాహార లోపానికి గుర‌వ‌డ‌మే కాకుండా ఊపిరితిత్తుల స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్నారు. స్థానిక ఆరోగ్య కార్యకర్తలు తెలిపిన ప్రకారం ఒకసారి చికిత్స పొందిన పిల్లలు మళ్లీ పోషకాహార లోపంతో ఆస్పత్రులకు రావడం ఇప్పుడు సోకోటో రాష్ట్రంతోపాటు ఉత్తర నైజీరియాలో సాధారణంగా మారుతోంద‌ని తెలిపారు. దీనికి ఇరాన్ యుద్ధం కారణంగా ఏర్పడిన ఆర్థిక ప్రభావాలే ప్రధాన కారణమని వారు చెబుతున్నారు. ప్రపంచంలోని అత్యంత పేద ప్రాంతాల్లో ఒకటైన ఉత్తర నైజీరియా ఇప్పటికే ఉగ్రవాద దాడులు, భద్రతా సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఇప్పుడు మధ్యప్రాచ్య యుద్ధం కారణంగా పేద ప్రజల ఆహార భద్రత మరింత దెబ్బతింది. ముఖ్యంగా చిన్నారులపై దీని ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది.

భారీగా పెరుగుతున్న పేద‌రికం..

కాగా నైజీరియా అధ్యక్షుడు బోలా టినుబు చేపట్టిన భారీ ఆర్థిక సంస్కరణలు కూడా ప్రజలకు భారంగా మారాయి. మూడు సంవత్సరాల క్రితం ఇంధన సబ్సిడీలు తొలగించడం, దేశ కరెన్సీ విలువను తగ్గించడం వల్ల ద్రవ్యోల్బణం భారీగా పెరిగింది. ఈ వారం విడుదలైన వరల్డ్ బ్యాంక్ సాంకేతిక నివేదిక ప్రకారం ప్రస్తుతం నైజీరియాలో 13.9 కోట్ల మంది పేదరికంలో ఉన్నార‌ని, చాలా మందికి పేదరికంలోకి వెళ్లేందుకు అత్యంత ద‌గ్గ‌ర‌గా ఉన్నార‌ని తేలింది. ఇరాన్ యుద్ధం కొనసాగితే ఈ ఏడాది చివరి నాటికి ప్రపంచవ్యాప్తంగా మరో 2.34 కోట్ల మంది చిన్నారులు ఆదాయపరమైన పేదరికంలోకి వెళ్లే ప్రమాదం ఉందని ఐక్యరాజ్యసమితి బాలల సంస్థ యూనిసెఫ్ హెచ్చరించింది. వీరిలో కనీసం 80 శాతం మంది ఆఫ్రికా, ఆసియా దేశాల్లోనే ఉంటారని ఆ సంస్థ పేర్కొంది. యూనిసెఫ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ క్యాథరిన్ రస్సెల్ మాట్లాడుతూ మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న ఘర్షణల‌కు అక్కడి పిల్లలే కాకుండా ప్రపంచంలోని ఇతర ప్రాంతాల పిల్లలు కూడా మూల్యం చెల్లిస్తున్నార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఈ యుద్ధం ఎంతకాలం కొనసాగితే, దాని ప్రభావం అంత తీవ్రంగా ఉంటుంద‌ని హెచ్చరించారు.

భారీగా పెరిగిన ధ‌ర‌లు..

ఇరాన్ యుద్ధం నేపథ్యంలో ప్రపంచ చమురు, గ్యాస్ సరఫరాలో కీలకమైన హోర్ముజ్ జలసంధిని మూసివేయడంతో అంతర్జాతీయ ఇంధన మార్కెట్ తీవ్రంగా ప్రభావితమైంది. ప్రపంచవ్యాప్తంగా ఇంధన ధరలు పెరగడంతో గ్యాస్, కిరాణా సరుకులు, ఎరువులు, విమాన టికెట్లు సహా దాదాపు అన్ని వస్తువుల ధరలు పెరిగాయి. నైజీరియాలో ఫిబ్రవరిలో లీటరు పెట్రోల్ ధర 800 నైరా ఉండగా, ఏప్రిల్ నాటికి అది 1,400 నైరాలకు పెరిగింది. దీని ప్రభావంతో ఆహార పదార్థాలు, నిత్యావసర వస్తువుల ధరలు కూడా భారీగా పెరిగాయి. ఇరాన్ మళ్లీ హోర్ముజ్ జలసంధిని పూర్తిగా తెరవాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నెలలుగా ఒత్తిడి తెస్తున్నారు. ఇందుకోసం వైమానిక దాడులు, నౌకాదళ దిగ్బంధనలు, చర్చలు, హెచ్చరికలు వంటి అన్ని మార్గాలను ఉపయోగిస్తున్నట్లు నివేదిక పేర్కొంది. సోకోటో రాష్ట్రంలో ధరల పెరుగుదలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి పోషకాహార లోపానికి చికిత్స పొందిన దాదాపు 40 మంది చిన్నారులు మళ్లీ అదే సమస్యతో హాస్పిట‌ల్స్‌లో చేరారు. అధికారిక రికార్డుల్లో నమోదు కాని కేసులు కూడా ఉన్నాయని స్థానిక ఆరోగ్య కార్య‌క‌ర్త‌లు చెబుతున్నారు.

ఆహార ఖ‌ర్చు రెట్టింపు..

ఆరోగ్య కార్యకర్త హలీమా మహమ్మద్ మాట్లాడుతూ మళ్లీ మళ్లీ పోషకాహార లోపంతో వస్తున్న చిన్నారుల సంఖ్య పెరుగుతుండడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంద‌ని అన్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితులతోపాటు పెరుగుతున్న ధరలు, ఆర్థిక ఇబ్బందుల కారణంగా పేద కుటుంబాల్లోని పిల్లలు దీర్ఘకాలంలో ఎదుగుదల సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉందన్నారు. వారి శారీరక, మానసిక అభివృద్ధి దెబ్బతింటుందని, తల్లిదండ్రుల ఆర్థిక ఒత్తిడి కారణంగా వారు చదువును కూడా మధ్యలోనే మానేయాల్సిన పరిస్థితి ఏర్ప‌డే అవ‌కాశాలు ఉన్నాయ‌ని తెలిపారు. యుద్ధం కారణంగా ఎరువుల సరఫరా, ధరలపై కూడా తీవ్ర ప్రభావం పడింది. దీంతో సాగు సీజన్ ప్రమాదంలో పడింది. ఇప్పటికే సాయుధ ముఠాల దాడుల కారణంగా తమ పొలాలకు వెళ్లలేకపోతున్న ఉత్తర నైజీరియాలోని రైతు కుటుంబాలు మరింత సంక్షోభంలో చిక్కుకున్నాయి. గ‌తంలో, యుద్ధానికి ముందు చాలా వ‌ర‌కు కుటుంబాల స‌గ‌టు నెల‌వారి ఆహార ఖ‌ర్చు సుమారు 2వేల నైరాల వ‌ర‌కు అవ‌గా, ప్ర‌స్తుతం 5వేల నైరాల‌కు పైగా ఖ‌ర్చు చేస్తున్నార‌ని గ‌ణాంకాలు చెబుతున్నాయి. దీంతో పిల్ల‌ల‌కు ఆహారం అందించ‌లేకపోతున్నామ‌ని ప్ర‌జ‌లు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు.

స్థానికుల ఆవేద‌న‌..

వాయువ్య నైజీరియాలో ప్రజలు ఒకవైపు కిడ్నాప్‌లకు పాల్పడే బందిపోటు ముఠాలు, మరోవైపు తమ ప్రభావాన్ని విస్తరిస్తున్న మిలిటెంట్ల దాడులతో ఇప్పటికే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పుడు ఇరాన్ యుద్ధం ఈ సంక్షోభాన్ని మరింత తీవ్రమయ్యేలా చేసిందని విశ్లేషకులు అంటున్నారు. లాగోస్‌కు చెందిన జియోపాలిటికల్ రిస్క్ సంస్థ ఎస్‌బీఎం ఇంటెలిజెన్స్ భాగస్వామి ఇకెమెసిట్ ఎఫియోంగ్ మాట్లాడుతూ ఇంత దూరంలో జరుగుతున్న ఈ యుద్ధం ఉత్తర నైజీరియాలోని అత్యంత బలహీన వర్గాలకు ఎలాంటి ఉపశమనం ఇవ్వడం లేద‌న్నారు. పైగా వారి కష్టాలను మరింత పెంచుతోంద‌ని అన్నారు. కాగా యుద్ధం కార‌ణంగా చాలా మందికి ఉపాధి, ఉద్యోగం పోవ‌డం కూడా కుటుంబాల ప‌రిస్థితిపై తీవ్ర ప్ర‌భావం చూపిస్తుంద‌న్నారు. ఇంధన ధరలు పెరగడం వల్ల ఆహార ధరలు తగ్గడం లేదని, దీని వ‌ల్ల స‌రైన ఆహారం లేక పిల్ల‌లు పూర్తిగా కోలుకోవ‌డం లేద‌ని స్థానికులు ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. యుద్ధం పూర్తిగా ముగియాల‌ని తాము కోరుకుంటున్నామ‌ని తెలిపారు.

Advertisement
Advertisement