HyPrevent | దాగి ఉన్న హైబీపీని గుర్తించడమే కాదు, ఏఐ ఇక గుండె జబ్బులనూ ముందే చెప్పేస్తుంది.. ఆక్స్ఫర్డ్ పరిశోధకుల సంచలనం..
HyPrevent | ప్రపంచవ్యాప్తంగా 1.3 బిలియన్లకుపైగా మందిని ప్రభావితం చేస్తున్న హై బ్లడ్ ప్రెషర్ (హైపర్టెన్షన్) గుండె జబ్బులు, స్ట్రోక్, కిడ్నీ వైఫల్యం, అకాల మరణాలకు ప్రధాన కారణాల్లో ఒకటిగా కొనసాగుతోంది. అయితే ఈ వ్యాధిని తరచూ సైలెంట్ కిల్లర్ గా పిలుస్తారు. ఎందుకంటే లక్షణాలు కనిపించేలోపే శరీరంలోని ముఖ్య అవయవాలకు సంవత్సరాల పాటు నష్టం జరుగుతూనే ఉంటుంది.
HyPrevent | ప్రపంచవ్యాప్తంగా 1.3 బిలియన్లకుపైగా మందిని ప్రభావితం చేస్తున్న హై బ్లడ్ ప్రెషర్ (హైపర్టెన్షన్) గుండె జబ్బులు, స్ట్రోక్, కిడ్నీ వైఫల్యం, అకాల మరణాలకు ప్రధాన కారణాల్లో ఒకటిగా కొనసాగుతోంది. అయితే ఈ వ్యాధిని తరచూ సైలెంట్ కిల్లర్ గా పిలుస్తారు. ఎందుకంటే లక్షణాలు కనిపించేలోపే శరీరంలోని ముఖ్య అవయవాలకు సంవత్సరాల పాటు నష్టం జరుగుతూనే ఉంటుంది. సాధారణంగా బ్లడ్ ప్రెషర్ పరీక్షల ద్వారా హైపర్టెన్షన్ను గుర్తించినప్పటికీ, ఇప్పటికే శరీరంలో ఎంత మేరకు అవయవ నష్టం జరిగిందో అవి వెల్లడించలేవు. ఇలాంటి పరిస్థితుల్లో యునివర్సిటీ ఆఫ్ ఆక్స్ఫర్డ్ పరిశోధకులు హైప్రివెంట్ (HyPrevent) అనే కృత్రిమ మేధస్సు (ఏఐ) ఆధారిత సాంకేతికతను అభివృద్ధి చేశారు. ఈ ప్లాట్ఫామ్ మెషిన్ లెర్నింగ్ సాంకేతికతలను ఉపయోగించి పలు అవయవాలకు సంబంధించిన క్లినికల్, ఇమేజింగ్ డేటాను విశ్లేషిస్తుంది. దీని ద్వారా వ్యాధి తీవ్రతకు సంబంధించిన దాగి ఉన్న నమూనాలను గుర్తించడంతోపాటు, ఇప్పటివరకు గుర్తించని హైపర్టెన్షన్ రోగుల ఉపవర్గాలను కూడా నిర్దారిస్తుంది. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ఇన్నోవేషన్ తెలిపిన ప్రకారం, హైపర్టెన్షన్ వల్ల కలిగే అవయవ నష్టాన్ని అంచనా వేయడానికి, వ్యక్తిగత అవసరాలకు అనుగుణంగా చికిత్సా వ్యూహాలను రూపొందించడానికి ఈ టూల్ను ప్రత్యేకంగా అభివృద్ధి చేశారు.
అనేక విధాలుగా విశ్లేషణ..
గుండె సంబంధిత వైద్యరంగంలో కృత్రిమ మేధస్సు ప్రాధాన్యం వేగంగా పెరుగుతున్న సమయంలో ఈ అభివృద్ధి చోటుచేసుకుంది. సాంప్రదాయ పరీక్షల ద్వారా కనిపించని వ్యాధి సంకేతాలను గుర్తించేందుకు పరిశోధకులు ఏఐ ని విస్తృతంగా ఉపయోగిస్తున్నారు. ఈ తరహా సాంకేతికతలు ఒకే విధమైన చికిత్సా విధానాల నుంచి వ్యక్తిగత బయోలాజికల్ రిస్క్ ప్రొఫైల్ ఆధారంగా కచ్చితమైన వైద్యం అందించే దిశగా ఆరోగ్యరంగాన్ని తీసుకెళ్తాయి. హైప్రివెంట్ ప్లాట్ఫామ్ ఏఐ, కాంట్రాస్టివ్ లెర్నింగ్, బహుళ అవయవాల క్లినికల్, ఇమేజింగ్ డేటాను సమన్వయం చేసే ప్రత్యేక కంప్యూటేషనల్ ఫ్రేమ్వర్క్ను ఉపయోగిస్తుంది. కేవలం బ్లడ్ ప్రెషర్ రీడింగ్స్పైనే ఆధారపడకుండా, వ్యాధి తీవ్రతకు సంబంధించిన అర్థమయ్యే నమూనాలను నేర్చుకుని రోగులలో వేర్వేరు వ్యాధి పురోగతి మార్గాలను గుర్తిస్తుంది. ఈ టెక్నాలజీని హైపర్టెన్షన్ ఉన్నవారు, సాధారణ బ్లడ్ ప్రెషర్ కలిగిన వ్యక్తుల డేటాసెట్లతో శిక్షణ ఇచ్చి అభివృద్ధి చేశారు. పలు అవయవ వ్యవస్థల నుంచి సేకరించిన సమాచారాన్ని విశ్లేషించడం ద్వారా ఏఐ వ్యక్తిగత స్థాయిలో వ్యాధి తీవ్రతను అంచనా వేస్తుంది. అలాగే చికిత్సకు భిన్నంగా స్పందించే దాగి ఉన్న వ్యాధి ఉపరకాలను కూడా గుర్తించే అవకాశం ఉంటుంది.

హైబీపీ ఉందని తెలియడం లేదు..
ఇది సాంప్రదాయ హైపర్టెన్షన్ నిర్వహణ విధానాల నుంచి పూర్తిగా భిన్నమైన దృక్పథం కాగా, ఇప్పటివరకు చికిత్స ఎక్కువగా లక్ష్య బ్లడ్ ప్రెషర్ స్థాయిలను సాధించడంపైనే కేంద్రీకృతమై ఉండేది. అయితే ఒకే బ్లడ్ ప్రెషర్ రీడింగ్ ఉన్న ఇద్దరు రోగులలో అవయవ నష్టం, భవిష్యత్తు గుండె సంబంధిత ప్రమాదం పూర్తిగా భిన్నంగా ఉంటాయని పరిశోధకులు చెబుతున్నారు. దీర్ఘకాలిక హైపర్టెన్షన్ రక్తనాళాలు, శరీరంలోని ముఖ్య అవయవాలను క్రమంగా దెబ్బతీస్తుంది. ఇది గుండెపోటు, స్ట్రోక్, హార్ట్ ఫెయిల్యూర్, క్రానిక్ కిడ్నీ వ్యాధి, వాస్క్యులర్ డిమెన్షియా, కంటి చూపు కోల్పోవడం వంటి తీవ్రమైన సమస్యలకు దారితీస్తుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) అంచనా ప్రకారం ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా సుమారు 10.8 మిలియన్ మరణాలకు హైపర్టెన్షన్ కారణమవుతోంది. అయినప్పటికీ హైపర్టెన్షన్ ఉన్న పెద్దలలో దాదాపు సగం మంది తమకు ఈ సమస్య ఉన్న విషయమే తెలియకుండా జీవిస్తున్నారు. మరోవైపు చికిత్స పొందుతున్న వారిలో కూడా చాలామందికి బ్లడ్ ప్రెషర్ నియంత్రణలో ఉండడం లేదు.
ప్రారంభ దశలోనే గుర్తిస్తే..
వైద్య నిపుణులు ప్రస్తుతం హైపర్టెన్షన్-మధ్యవర్తిత్వ అవయవ నష్టం (HMOD)ను గుర్తించడం అత్యంత ముఖ్యమని భావిస్తున్నారు. ఇందులో గుండె కండరాల మందం పెరగడం, కిడ్నీ పనితీరు దెబ్బతినడం, ధమనుల గట్టిపడటం, రక్తనాళాల నష్టం, మెదడులో సూక్ష్మ రక్తనాళాలు దెబ్బతినడం, రెటీనా అసాధారణతలు తదితర సమస్యలు ఉంటాయి. జర్నల్ ఆఫ్ హ్యూమన్ హైపర్టెన్షన్లో ప్రచురితమైన పరిశోధనల ప్రకారం అవయవ నష్టం ఉండటం భవిష్యత్తులో గుండె సంబంధిత ఘటనలు, మరణాల ప్రమాదాన్ని అంచనా వేసే అత్యంత బలమైన సూచికలలో ఒకటి. ఈ మార్పులను ప్రారంభ దశలోనే గుర్తించడం ద్వారా చికిత్సా నిర్ణయాలు మరింత మెరుగుపడతాయి. అయితే ఈ నష్టం ఎక్కువగా ఎలాంటి లక్షణాలు లేకుండానే అభివృద్ధి చెందుతుంది. సాధారణ వైద్య పరీక్షల్లో ఇది బయటపడదు. ఇక్కడే హైప్రివెంట్ వంటి ఏఐ ఆధారిత వ్యవస్థలు కీలక పాత్ర పోషిస్తాయి.

గణనీయంగా అభివృద్ధి చెందుతున్న ఏఐ..
ఆక్స్ఫర్డ్ చేపట్టిన ఈ ప్రాజెక్ట్ గుండె సంబంధిత వైద్యరంగంలో ఏఐ వినియోగం పెరుగుతున్న విస్తృత ధోరణిలో భాగం కాగా, గత కొన్ని సంవత్సరాల్లో ఆక్స్ఫర్డ్ పరిశోధకులు వైద్య ఇమేజింగ్ డేటా ఆధారంగా దాగి ఉన్న గుండె ప్రమాదాలను గుర్తించే అనేక ఏఐ టూల్స్ను అభివృద్ధి చేశారు. 2024లో యూనివర్సిటీ రాడ్క్లిఫ్ డిపార్ట్మెంట్ ఆఫ్ మెడిసిన్ బృందం 40వేల మందికిపైగా రోగుల కార్డియాక్ సీటీ స్కాన్లను విశ్లేషించి గుండెపోటు, హార్ట్ ఫెయిల్యూర్, గుండె సంబంధిత మరణాలను పదేళ్ల ముందుగానే అంచనా వేసే ఏఐ వ్యవస్థను ప్రదర్శించింది. ఇటీవల మరో ఏఐ ప్లాట్ఫామ్ హార్ట్ ఫెయిల్యూర్ లక్షణాలు కనిపించకముందే కనీసం ఐదేళ్ల ముందుగా ప్రమాదాన్ని అంచనా వేస్తుందని ఆక్స్ఫర్డ్ పరిశోధకులు వెల్లడించారు. 70వేల మందికిపైగా వ్యక్తుల డేటాతో శిక్షణ పొందిన ఈ టెక్నాలజీ భవిష్యత్తులో హార్ట్ ఫెయిల్యూర్ ప్రమాదాన్ని గుర్తించడంలో సుమారు 86 శాతం కచ్చితత్వాన్ని సాధించింది.
రోగులకు అనేక విధాలుగా ఉపయోగం..
భవిష్యత్తు అధ్యయనాల్లో హైప్రివెంట్ ప్రభావవంతమని నిరూపితమైతే రోగులకు అనేక ప్రయోజనాలు అందే అవకాశం ఉంటుందని నిపుణులు భావిస్తున్నారు. లక్షణాలు కనిపించకముందే అవయవ నష్టాన్ని గుర్తించడం, వ్యక్తిగత ప్రమాద స్థాయిల ఆధారంగా చికిత్సను అనుకూలీకరించడం, కొత్త మందుల అభివృద్ధికి దోహదపడటం, వైద్యులకు వ్యాధి పురోగతి, భవిష్యత్తు ప్రమాదాలపై సమగ్ర అవగాహన కల్పించడం వంటి ప్రయోజనాలు ఇందులో ఉన్నాయి. అయితే హైప్రివెంట్ ఇప్పటికీ ప్రారంభ దశలో ఉన్న సాంకేతికతే. ఇతర ఏఐ ఆధారిత వైద్య టూల్స్ మాదిరిగానే దీన్ని కూడా విభిన్న జనాభా వర్గాలపై విస్తృత పరీక్షలు పూర్తి చేయాల్సి ఉంది. రోగుల ఫలితాలను మెరుగుపరుస్తుందా, వివిధ ఆరోగ్య వ్యవస్థల్లో సమర్థంగా పనిచేస్తుందా, వైద్య నిర్ణయాలపై ప్రభావం చూపే పక్షపాతాలు లేవా అనే అంశాలను పరిశోధకులు నిర్ధారించాల్సి ఉంటుంది. అలాగే నియంత్రణ సంస్థల అనుమతులు, ఆరోగ్య వ్యవస్థల్లో సమన్వయం వంటి అంశాలు కూడా కీలకంగా మారనున్నాయి.
అయినప్పటికీ, హై బ్లడ్ ప్రెషర్ వల్ల శరీరంలో నిశ్శబ్దంగా జరిగే అవయవ నష్టాన్ని అర్థం చేసుకునే దిశగా ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ అభివృద్ధి చేసిన హైప్రివెంట్ ఓ కీలక ముందడుగుగా భావిస్తున్నారు. బహుళ అవయవాల డేటాను అధునాతన ఏఐ సాంకేతికతతో విశ్లేషించడం ద్వారా సాధారణ బ్లడ్ ప్రెషర్ కొలతలు గుర్తించలేని ప్రమాదాలను వెలికితీయగలిగే ఈ టెక్నాలజీ, భవిష్యత్తులో హైపర్టెన్షన్ చికిత్స విధానాలను పూర్తిగా మార్చేసే అవకాశముందని అంటున్నారు.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Dasoju Sravan | మెట్రో రైల్ రేవంత్ తాత జాగీరా? తొందరలోనే బీజేపీలోకి పోతడు
- ●TGSRTC Commercial Shops For Rent | వ్యాపారం చేయాలనుకుంటున్నారా? అయితే తెలంగాణ ఆర్టీసీ సంస్థ కల్పిస్తున్న ఈ 'గోల్డెన్ చాన్స్' మీకోసమే!
- ●Mahua Moitra | సువేందు ప్రతీ విషయంలో అండగా నిలిచారు.. బీజేపీ సీఎంపై టీఎంసీ ఎంపీ ప్రశంసలు
- ●PM KUSUM Scam Telangana | కాంగ్రెస్ పాలనలో రోజుకో స్కాం.. 'పీఎం కుసుమ్'లో రూ.1000 కోట్ల కుంభకోణం: జగదీశ్ రెడ్డి
- ●Ayatollah Ali Khamenei funeral | జులై 9న ఖమేనీ అంత్యక్రియలు.. మోదీని ఆహ్వానించిన ఇరాన్..!
- ●Janhvi Kapoor | పెద్ది సక్సెట్ మీట్లో కనిపించని జాన్వీ.. ఇంతకు దూరం పెట్టారా? ఉంటోందా?

Dasoju Sravan | మెట్రో రైల్ రేవంత్ తాత జాగీరా? తొందరలోనే బీజేపీలోకి పోతడు

TGSRTC Commercial Shops For Rent | వ్యాపారం చేయాలనుకుంటున్నారా? అయితే తెలంగాణ ఆర్టీసీ సంస్థ కల్పిస్తున్న ఈ 'గోల్డెన్ చాన్స్' మీకోసమే!

Mahua Moitra | సువేందు ప్రతీ విషయంలో అండగా నిలిచారు.. బీజేపీ సీఎంపై టీఎంసీ ఎంపీ ప్రశంసలు

PM KUSUM Scam Telangana | కాంగ్రెస్ పాలనలో రోజుకో స్కాం.. 'పీఎం కుసుమ్'లో రూ.1000 కోట్ల కుంభకోణం: జగదీశ్ రెడ్డి






