త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Dasoju Sravan | మెట్రో రైల్ రేవంత్ తాత జాగీరా? తొందరలోనే బీజేపీలోకి పోతడు

హైదరాబాద్ మెట్రో రైల్ వ్యవహారంలో సీఎం రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిల తీరుపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.

J

Telangana | Published On Jun 24, 2026, 7.04 pm IST

Dasoju Sravan | మెట్రో రైల్ రేవంత్ తాత జాగీరా? తొందరలోనే బీజేపీలోకి పోతడు
Advertisement
  • దాసోజు శ్రవణ్ సంచలన వ్యాఖ్యలు
  • హైదరాబాద్ మెట్రో రైల్ వ్యవహారంపై సీఎం రేవంత్ రెడ్డి, కిషన్ రెడ్డిలకు దాసోజు శ్రవణ్ 25 ప్రశ్నలు
  • మెట్రో నిర్మాణంలో రూపాయి కూడా ఖర్చు చేయని రేవంత్, ఐ.ఆర్.ఎఫ్.సి. (IRFC) తో ఒప్పందం ఎలా చేశారని ప్రశ్న
  • రూ. 1300 కోట్ల మెట్రో రుణాన్ని రాష్ట్ర ప్రభుత్వం టేకోవర్ చేసిందని, దీనిపై పబ్లిక్ డాక్యుమెంట్ రిలీజ్ చేయాలని డిమాండ్
  • రేవంత్ రెడ్డి భవిష్యత్తులో అస్సాం సీఎం హేమంత బిశ్వ శర్మలా మారి బీజేపీలో చేరడం ఖాయమని జోస్యం 

Dasoju Sravan | త్రినేత్ర.న్యూస్ : హైదరాబాద్ (Hyderabad Metro Rail) మెట్రో రైల్ ప్రాజెక్టుపై సీఎం రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిల తీరును తప్పుబడుతూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ (BRS MLC) డాక్టర్ దాసోజు శ్రవణ్ తీవ్ర విమర్శలు గుప్పించారు. తెలంగాణ భవన్‌లో జరిగిన ప్రెస్ మీట్‌లో ఆయన మెట్రో వ్యవహారం, కాంగ్రెస్ ద్వంద్వ వైఖరిపై ఏకంగా 25 సూటి ప్రశ్నలు సంధించారు. మెట్రో రైల్ ప్రాజెక్టు ఏమైనా రేవంత్ రెడ్డి తాత జాగీరా అంటూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

మెట్రోపై మూర్ఖపు నిర్ణయాలు

మెట్రో రైల్ ప్రాజెక్టు నిర్మాణానికి రేవంత్ రెడ్డి రూపాయి కూడా ఖర్చు చేయలేదని, అసలు ఆయన మెట్రో కట్టినోడే కాదని శ్రవణ్ విమర్శించారు. అలాంటప్పుడు ఐ.ఆర్.ఎఫ్.సి. (IRFC) తో సీఎం ఎలా సంతకం చేశారని ప్రశ్నించారు. ఇప్పుడు ఆ ఒప్పందం రద్దయిందని, మధ్యలో జపాన్ (Japan) సంస్థ మాయమైందని ఆరోపించారు. రేవంత్ మూర్ఖపు నిర్ణయాల వల్ల మెట్రో కుక్కలు చించిన విస్తరిలా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు.

రాష్ట్ర ప్రభుత్వం ఏకంగా రూ. 1300 కోట్ల మెట్రో లోన్‌ను టేకోవర్ (Takeover) చేసిందని, దానికి రోజువారీ వడ్డీనే రూ. 2.5 కోట్లు అవుతోందని ఆయన తెలిపారు. ఐ.ఆర్.ఎఫ్.సి కి రేవంత్ రెడ్డి రూ. 84 కోట్లు చెల్లించారని, అసలు ఆ జపాన్ కంపెనీ ఏంటో సీఎం స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంపై తక్షణమే పబ్లిక్ డాక్యుమెంట్ (Public document) రిలీజ్ చేయాలన్నారు.

కిషన్ రెడ్డితో చీకటి ఒప్పందాలు

నిన్నటి వరకు మెట్రో అనుమతులను కిషన్ రెడ్డి, కేటీఆర్ కలిసి అడ్డుకుంటున్నారని ఆరోపించిన సీఎం.. ఇప్పుడు అదే కిషన్ రెడ్డి కాళ్లు పట్టుకుని కేంద్ర మంత్రిని ఎలా కలిశారని దాసోజు సూటిగా ప్రశ్నించారు. ఈ ఇద్దరి నేతల వ్యవహారం ప్రైవేట్ అఫైర్ (Private affair) కాదని, ఇది ప్రజల ఆస్తులకు సంబంధించిన విషయమని గుర్తుచేశారు. రేవంత్ తలాతోక లేని నిర్ణయాల వల్ల మెట్రో భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందని, దీనిపై తాము కోర్టును ఆశ్రయిస్తామని ఆయన హెచ్చరించారు.

కాంగ్రెస్ లైన్‌కు వ్యతిరేకంగా రేవంత్.. బీజేపీలోకి జంప్

బీఆర్ఎస్ నేతలపై ప్రభుత్వ విప్ యెన్నం శ్రీనివాస్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు శ్రవణ్ కౌంటర్ ఇచ్చారు. రాహుల్ గాంధీ (Rahul Gandhi) సీటుకు రేవంత్ ఎసరు పెట్టకుండా యెన్నం చూసుకోవాలని హితవు పలికారు. రేవంత్ రెడ్డి పూర్తిగా ఏఐసీసీ (AICC) లైన్‌కు వ్యతిరేకంగా పనిచేస్తున్నారని విమర్శించారు.

ఢిల్లీలో కాంగ్రెస్ సీనియర్ నేతలు ట్రంప్-మోదీల బంధాన్ని విమర్శిస్తుంటే, ఇక్కడ రేవంత్ మాత్రం హైదరాబాద్‌లోని ఒక రోడ్డుకు ఏకంగా ట్రంప్ (Trump) పేరు పెడుతున్నారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీకి ఢిల్లీలో ఒక విధానం, హైదరాబాద్‌లో మరో విధానం ఉంటుందా? అని ప్రశ్నించారు. సీఎం తీరు చూస్తుంటే అస్సాం సీఎం హేమంత బిశ్వ శర్మలా (Himanta Biswa Sarma) మారడం ఖాయమని, ఆయన ఎప్పటికైనా బీజేపీలో (BJP) చేరడం పక్కా అని దాసోజు శ్రవణ్ జోస్యం చెప్పారు.

Advertisement
Advertisement