త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

PM KUSUM Scam Telangana | కాంగ్రెస్ పాలనలో రోజుకో స్కాం.. ‘పీఎం కుసుమ్’లో రూ.1000 కోట్ల కుంభకోణం: జగదీశ్ రెడ్డి

పీఎం కుసుమ్ పథకంలో రాష్ట్రంలో రూ.1000 కోట్ల భారీ కుంభకోణం జరిగిందని, అధికారుల వేధింపుల వెనుక ప్రభుత్వ పెద్దల హస్తం ఉందని మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు.

J

Telangana | Published On Jun 24, 2026, 6.03 pm IST

PM KUSUM Scam Telangana | కాంగ్రెస్ పాలనలో రోజుకో స్కాం.. ‘పీఎం కుసుమ్’లో రూ.1000 కోట్ల కుంభకోణం: జగదీశ్ రెడ్డి

సంక్షిప్త సారాంశం

పీఎం కుసుమ్ (PM KUSUM) పథకం కింద సోలార్ ప్లాంట్లు నిర్మించిన రైతులను అధికారులు వేధిస్తున్నారని మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి ఆరోపించారు. ప్లాంట్లను సింక్రనైజ్ చేయడానికి ఒక్కో మెగావాట్‌కు కోటి రూపాయలు డిమాండ్ చేస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. రైతు భరోసా కింద రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఇంకా రూ.30 వేల కోట్ల బకాయి పడిందని, వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిల మధ్య ఢిల్లీ వేదికగా రాజకీయ 'మ్యాచ్ ఫిక్సింగ్' నడుస్తోందని విమర్శించారు.

Advertisement

PM KUSUM Scam Telangana | త్రినేత్ర.న్యూస్ : రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను గాలికి వదిలేసిందని, పథకాల అమలు మానేసి రోజుకో స్కామ్‌కు తెరలేపుతోందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి జి. జగదీశ్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో జరిగిన ప్రెస్ మీట్‌లో ఆయన 'హైబ్రిడ్ కాంగ్రెస్' సర్కార్‌ పనితీరుపై సంచలన ఆరోపణలు చేశారు. పీఎం కుసుమ్ పథకంలో భారీ కుంభకోణం జరిగిందని బాంబు పేల్చారు.

పీఎం కుసుమ్‌లో పగటి దోపిడీ.. మెగావాట్‌కు కోటి డిమాండ్

చాలా మంది రైతులు అప్పులు చేసి మరీ పీఎం కుసుమ్ (PM KUSUM) పథకం కింద 1000 నుంచి 1200 మెగావాట్ల సోలార్ ప్లాంట్ల నిర్మాణం చేపట్టారని జగదీశ్ రెడ్డి తెలిపారు. నిర్మాణాలు పూర్తయి రెండు, మూడు నెలలవుతున్నా విద్యుత్ అధికారులు వాటిని సింక్రనైజ్ (Synchronize) చేయడం లేదని మండిపడ్డారు. ఇంధన శాఖ, రెడ్కో (REDCO) కు చెందిన ఇద్దరు ఉన్నతాధికారులు రైతులను తీవ్రంగా వేధిస్తూ, ఒక్కో మెగావాట్‌కు అక్షరాలా కోటి రూపాయలు డిమాండ్ చేస్తున్నారని ఆరోపించారు.

కేంద్రం రూ.3.13 ధర నిర్ణయిస్తే, రాష్ట్ర ఉన్నతాధికారులు రూ.2.90 అని చెబుతూ రైతుల రక్తం తాగుతున్నారని మండిపడ్డారు. ఈ రూ.1000 కోట్ల స్కామ్‌లో ప్రభుత్వ పెద్దల పేర్లు వినిపిస్తున్నాయని, ఉప ముఖ్యమంత్రి, విద్యుత్ శాఖ మంత్రి భట్టి విక్రమార్క దీనిపై వెంటనే స్పందించి చర్యలు తీసుకోకపోతే ఆయనకు కూడా ఇందులో సంబంధం ఉందనుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. త్వరలోనే విద్యుత్ శాఖలోని మరో స్కామ్‌ను, అవినీతి అధికారుల పేర్లను బయటపెడతామని స్పష్టం చేశారు.

Rs 1000 Crore PM KUSUM Scam Jagadish Reddy Targets Revanth Govt

రైతుల బకాయిలు రూ.30 వేల కోట్లు

రాష్ట్రంలో వడ్ల కొనుగోళ్లు పూర్తయ్యాయని మంత్రులు ప్రకటించడం దుర్మార్గమని జగదీశ్ రెడ్డి అన్నారు. ఇంకా మిగిలిన వడ్లను కూడా ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. వానకాలం రైతు భరోసా ఇస్తామంటున్న ప్రభుత్వం.. యాసంగి భరోసా ఎగ్గొట్టిందా? అని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఇంకా రూ.30 వేల కోట్లు బకాయి ఉందని, ఆ మొత్తాన్ని వెంటనే రైతుల ఖాతాల్లో జమ చేయాలని డిమాండ్ చేశారు. అక్టోబర్‌లో రాబోయే స్థానిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే ప్రభుత్వం మళ్లీ రైతులను మోసం చేసే ఎత్తుగడలు వేస్తోందని విమర్శించారు.

రేవంత్, కిషన్ రెడ్డిలది మ్యాచ్ ఫిక్సింగ్ డ్రామా

సీఎం రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిల వ్యవహారశైలిపై జగదీశ్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. ప్రధాని మోదీ, చంద్రబాబుల 'క్రాస్ బ్రీడ్' (Cross breed) రేవంత్ రెడ్డి అని ఎద్దేవా చేశారు. ఎన్నికల సమయంలో తిట్టుకున్న నేతలు, ఇప్పుడు ఢిల్లీలో డ్యూయెట్లు పాడుతున్నారని ఎద్దేవా చేశారు. కేంద్ర కేబినెట్ మంత్రికి భయపడి ఇంకో కేంద్ర మంత్రిని కలవడం దేశ చరిత్రలో ఎక్కడైనా ఉందా? అని, కిషన్ రెడ్డి సీఎంకు పీఏగా పనిచేస్తున్నారా అని ప్రశ్నించారు. మోదీ అండ ఉందన్న ధీమాతోనే రేవంత్ రెడ్డి ఏకంగా ఎస్‌బీఐ (SBI) లాంటి జాతీయ బ్యాంకును బ్లాక్ మెయిల్ (Blackmail) చేస్తున్నారని ఆరోపించారు.

జనసేన కార్యాలయ ఏర్పాటు వివాదం అంతా ఒక డ్రామా అని, ఏ రాష్ట్రంలోనైనా పార్టీ ఆఫీసులు పెట్టుకోవచ్చని, దాన్ని ఎవరూ అడ్డుకోలేదని స్పష్టం చేశారు. మోదీ, చంద్రబాబు, రేవంత్ రెడ్డి, జనసేన అంతా ఒక్కటే టీమ్ అని, వీరంతా కలిసి మ్యాచ్ ఫిక్సింగ్ డ్రామాలు ఆడుతున్నారని జగదీశ్ రెడ్డి దుయ్యబట్టారు.

ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యేలు భాస్కర్ రావు, గాదరి కిషోర్ కుమార్, బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి గాదరి బాలమల్లు, నేతలు చింతల వెంకటేశ్వర్ రెడ్డి, కురువ విజయ్ కుమార్, పడాల సతీష్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement