త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Food Poisoning | ఆహారాన్ని ఫ్రిజ్‌లో నిల్వ ఉంచి తింటే ఫుడ్ పాయిజ‌నింగ్ అవుతుందా..? వైద్యులు ఏమంటున్నారు..?

Food Poisoning | సాధార‌ణంగా చాలా మంది ఒక పూట వండిన ఆహారం మిగిలితే దాన్ని ఫ్రిజ్‌లో పెట్టి ఇంకో పూట తింటారు. అప్ప‌టికీ ఆ ఆహారం ఇంకా మిగిలే ఉంటే మ‌ళ్లీ ఫ్రిజ్‌లో పెట్టి తిరిగి దాన్ని బ‌య‌ట‌కు తీసి వేడి చేసి తింటారు. ఇది కేవ‌లం భార‌త్‌లోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా దాదాపుగా అన్ని దేశాల‌కు చెందిన ప్ర‌జ‌ల‌కు ఒక సాధార‌ణ అల‌వాటుగా మారింది.

S

Lifestyle | Published On Apr 28, 2026, 12.49 pm IST

Food Poisoning | ఆహారాన్ని ఫ్రిజ్‌లో నిల్వ ఉంచి తింటే ఫుడ్ పాయిజ‌నింగ్ అవుతుందా..? వైద్యులు ఏమంటున్నారు..?
Advertisement

Food Poisoning | సాధార‌ణంగా చాలా మంది ఒక పూట వండిన ఆహారం మిగిలితే దాన్ని ఫ్రిజ్‌లో పెట్టి ఇంకో పూట తింటారు. అప్ప‌టికీ ఆ ఆహారం ఇంకా మిగిలే ఉంటే మ‌ళ్లీ ఫ్రిజ్‌లో పెట్టి తిరిగి దాన్ని బ‌య‌ట‌కు తీసి వేడి చేసి తింటారు. ఇది కేవ‌లం భార‌త్‌లోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా దాదాపుగా అన్ని దేశాల‌కు చెందిన ప్ర‌జ‌ల‌కు ఒక సాధార‌ణ అల‌వాటుగా మారింది. అయితే ఇది ఆరోగ్యానికి ప్రమాదకరమవుతుందని చాలా మందికి తెలియదు. మైక్రోబయాలజిస్టు ప్రిమ్రోస్ ఫ్రీస్టోన్ ఈ విషయంపై అనేక కీల‌క విష‌యాల‌ను వెల్ల‌డించారు. మిగిలిన ఆహారాన్ని ఫ్రిజ్‌లో పెట్టి తింటే వ‌చ్చే ప్రమాదాలను వివరించడంతోపాటు వాటిని ఎలా నివారించాలో కూడా చెప్పారు. ఆమె తెలిపిన ప్రకారం ఫుడ్ పాయిజనింగ్ అనేది పాథోజెనిక్ బ్యాక్టీరియా, ఫంగస్ లేదా వైరస్‌లతో కలుషితమైన ఆహారం తినడం వల్ల లేదా ద్ర‌వాల‌ను తాగ‌డం వ‌ల్ల‌ కలుగుతుంది. చల్లగా ఉంచిన మిగిలిన ఆహారం తినేటప్పుడు సరైన విధంగా హ్యాండిల్ చేయడం, నిల్వ చేయడం అత్యంత కీలకం. లేదంటే ఆహారం క‌లుషితం అవుతుంది.

తిన్నా, తిన‌క‌పోయినా టైమ్ దాటితే ఫ్రిజ్‌లో పెట్టాల్సిందే..

వండిన ఆహారాన్ని రెండు గంటల లోపే ఫ్రిజ్‌లో ఉంచాలి. అంటే ఆ లోపు తిన‌గా మిగిలిన ఆహారాన్ని ఫ్రిజ్‌లో పెట్టేయాల‌న్న‌మాట‌. ఉష్ణోగ్రత 32 డిగ్రీల సెల్సియస్ కన్నా ఎక్కువగా ఉంటే, ఒక గంటలోపే ఫ్రిజ్‌లో పెట్టాలి. అంటే వేస‌విలో ఇంకా త్వ‌ర‌గా ఆహారం పాడ‌వుతుంది క‌నుక వండిన ఆహారాన్ని తిన్నా, తిన‌క‌పోయినా గంట త‌రువాత క‌చ్చితంగా ఫ్రిజ్‌లో నిల్వ చేయాలి. ఇది బ్యాక్టీరియా పెరుగుదలను తగ్గించి ఫుడ్ పాయిజనింగ్‌ను నివారిస్తుంది. సరైన విధంగా నిల్వ చేయని మిగిలిన ఆహారం కూడా ఫుడ్ పాయిజనింగ్‌కు ప్రధాన కారణంగా మారుతుంది. అందుకే ఆహారం నిల్వ విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం అవసరం. పిజ్జా, వండిన బియ్యం, పాస్తా, చికెన్ వంటి ఆహారాలు ఎక్కువ ప్రమాదకరంగా ఉంటాయి. వీటిలో బాసిల్లస్ సెరియస్, సాల్మొనెల్లా వంటి బ్యాక్టీరియా పెరిగే అవకాశం ఉంటుంది.

చికెన్‌, బియ్యం విష‌యంలో..

పిజ్జాను త‌యారు చేసిన రెండు గంటలలోపే ఫ్రిజ్‌లో ఉంచాలి. కవర్ చేసి రెండు రోజుల్లోపు తిన‌వ‌చ్చు. పిజ్జాపై ఉపయోగించే బాసిల్, పెప్పర్, ఒరెగానో వంటి డ్రైడ్ స్పైసెస్ కూడా సూక్ష్మజీవుల కలుషితానికి గురయ్యే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. వండ‌ని చికెన్‌లో క్యాంపిలోబాక్టర్, సాల్మొనెల్లా, క్లోస్ట్రిడియం పెర్ఫ్రింజెన్స్ వంటి బ్యాక్టీరియా ఉంటాయి. కాబట్టి వండేటప్పుడు పూర్తిగా ఉడికించాలి. వండిన చికెన్‌లో రక్తం ఉండకూడదు. అలాంటి చికెన్‌ను తినకూడదు, నిల్వ చేయకూడదు. వండిన చికెన్‌ను గరిష్టంగా మూడు రోజులు మాత్రమే ఫ్రిజ్‌లో ఉంచాలి. వండని బియ్యంలో బాసిల్లస్ సెరియస్ స్పోర్స్ ఉండే అవ‌కాశాలు ఉంటాయి. అందువ‌ల్ల ముడి బియ్యాన్ని తిన‌కూడ‌దు. బాగా ఉడికించే తినాలి. ఇక వండిన తర్వాత కూడా ఈ స్పోర్స్ బతికి ఉండే అవకాశాలు ఉంటాయి. క‌నుక వండిన బియ్యాన్ని త్వరగా చల్లబరచి కవర్ చేసి 24 గంటల్లోపు తినాలి.

ఆమ్లత క‌లిగి ఉంటే..

క్యాన్ ఫుడ్ విషయంలో టమాటా వంటి అధిక ఆమ్లత కలిగిన పదార్థాలు 5-7 రోజులు నిల్వ ఉంటాయి. కానీ తక్కువ ఆమ్లత కలిగిన మాంసం, చేపలు, పండ్లు, కూరగాయలు, పాస్తా వంటి పదార్థాలు మూడు రోజుల వరకు మాత్రమే భద్రంగా ఉంటాయి. ఆమ్లత ఎక్కువగా ఉన్న ఆహారం బ్యాక్టీరియా పెరుగుదలను నిరోధిస్తుంది. ఫ్రిజ్‌లో మిగిలిన ఆహారం ఉంచడం సాధారణమే అయినప్పటికీ సరైన విధానాలు పాటించకపోతే ఆరోగ్యానికి ప్రమాదం ఏర్పడే అవకాశం ఉంటుంది. క‌నుక‌ నిల్వ, వినియోగంలో జాగ్రత్తలు పాటించడం ద్వారా ఫుడ్ పాయిజనింగ్‌ను నివారించవచ్చు.

Advertisement
Advertisement