త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Venezuela | జంట భూకంపాల‌తో వెనెజువెలా అత‌లాకుత‌లం.. 1700 మంది మృతి.. 50 వేల మంది మిస్సింగ్‌

Venezuela | జంట భూకంపాలు (earthquake) సృష్టించిన విధ్వంసానికి వెనెజువెలా (Venezuela)లో మ‌ర‌ణించిన వారి సంఖ్య 1700కి పెరిగింది. 50వేల మంది ఆచూకీ గ‌ల్లంతైంది. వేల సంఖ్య‌లో ఇళ్లు నేల‌మ‌ట్ట‌మ‌య్యాయి.

D

International | Published On Jun 30, 2026, 5.01 pm IST

Venezuela | జంట భూకంపాల‌తో వెనెజువెలా అత‌లాకుత‌లం.. 1700 మంది మృతి.. 50 వేల మంది మిస్సింగ్‌
Advertisement

Venezuela | గ‌త వారం సంభ‌వించిన రెండు వ‌రుస భూకంపాల‌తో వెనెజువెలా (Venezuela) అత‌లాకుత‌ల‌మైంది. ఈ ప్ర‌కృతి ప్ర‌కోపానికి భారీ భ‌వంతులు నేల‌మ‌ట్ట‌మ‌య్యాయి. భారీగా ఆస్తి, ప్రాణ న‌ష్టం సంభ‌వించింది. వెతికే కొద్దీ శిథిలాల నుంచి మృత‌దేహాలు కుప్ప‌లు తెప్ప‌లుగా బ‌య‌ట‌ప‌డుతున్నాయి. ఈ క్ర‌మంలో మ‌ర‌ణించిన వారి సంఖ్య భారీగా పెరిగింది.

జంట భూకంపాల వ‌ల్ల 1,719 మంది మ‌ర‌ణించిన‌ట్లు వెనెజువెలా నేష‌న‌ల్ అసెంబ్లీ అధ్య‌క్షుడు జోర్గే రోడ్రిగ్జ్ తెలిపారు. దాదాపు 50,000 మంది గ‌ల్లంతైన‌ట్లు పేర్కొన్నారు. 775 భ‌వ‌నాలు దెబ్బ‌తిన్న‌ట్లు చెప్పారు. వాటిలో 189 భ‌వ‌నాలు పూర్తిగా కూలిపోయాయ‌ని వెల్ల‌డించారు. అయితే ప‌దివేల ఇళ్లు దెబ్బ‌తిన్నాయ‌ని లేదా పూర్తిగా ధ్వంస‌మ‌య్యాయ‌ని శాటిలైట్ చిత్రాలు వెల్ల‌డిస్తున్నాయి.

గ‌త బుధ‌వారం సాయంత్రం నిమిషాల వ్య‌వ‌ధిలో రెండు అత్యంత శక్తివంత‌మైన భూకంపాలు వ‌ణికించిన విష‌యం తెలిసిందే. రిక్ట‌ర్‌స్టేలుపై వీటి వీవ్ర‌త 7.1, 7.5గా న‌మోద‌యింది. దీంతో రాజ‌ధాని కార‌కాస్‌తోపాటు (Caracas) దేశంలోని ప‌లు న‌గ‌రాలు తీవ్రంగా దెబ్బ‌తిన్నాయి. భూ ప్రకంపనల ధాటికి కారకాస్‌లో పలు భవనాలు కుప్పకూలాయి. లా గుఐరా ప్రాంతంలో దీని ప్ర‌భావం ఎక్కువ‌గా ఉంది. ఈ క‌ష్ట స‌మ‌యంలో ప్ర‌పంచ దేశాలు వెనెజువెలాకు ఆప‌న్న హ‌స్తం అందిస్తున్నాయి. దాదాపు 24 దేశాలు 521 ట‌న్నుల మాన‌వ‌తా సాయాన్ని, స‌హాయ‌క బృందాల‌ను, రెస్క్యూ టీమ్స్‌ను పంపించాయి. ఈ భూ ప్ర‌కంప‌న‌ల‌ కార‌ణంగా దాదాపు 67.6 లక్షల మంది ప్రజలు ప్రభావితమై ఉండొచ్చ‌ని ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మైగ్రేషన్ (IOM) అంచనా వేసింది. ఈ విప‌త్తులో మ‌ర‌ణాల సంఖ్య పెరిగే అవ‌కాశం ఉంద‌ని తెలిపింది.

Advertisement
Advertisement