త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

SIR | ఇలాంటి రోజు ఒక‌టి వ‌స్తుంద‌ని ఊహించామా..? SIR​ ప్రక్రియ, ఈసీ పాత్రను ప్ర‌శ్నిస్తూ సీజేఐకి లేఖ రాసిన 23 విప‌క్ష పార్టీలు

SIR | స‌ర్ ప్ర‌క్రియ‌, ఎన్నిక‌ల సంఘం పాత్ర, ఎన్నిక‌ల‌కు సంబంధించిన స‌మ‌స్య‌లపై ప్ర‌తిప‌క్ష పార్టీలు భార‌త ప్ర‌ధాన న్యాయ‌మూర్తి జ‌స్టిస్ సూర్య‌కాంత్‌కు సంయుక్త లేఖ రాశాయి. జూన్​ 8న జరిగిన ఇండియా జనబంధన్ సమావేశంలో తీసుకున్న నిర్ణ‌యం మేర‌కు సీజేఐకి లేఖ పంపిన‌ట్లు కాంగ్రెస్ సీనియ‌ర్ నేత జైరాం ర‌మేష్ (Jairam Ramesh) ఎక్స్ వేదిక‌గా వెల్ల‌డించారు.

D

National | Published On Jun 30, 2026, 4.26 pm IST

SIR | ఇలాంటి రోజు ఒక‌టి వ‌స్తుంద‌ని ఊహించామా..? SIR​ ప్రక్రియ, ఈసీ పాత్రను ప్ర‌శ్నిస్తూ సీజేఐకి లేఖ రాసిన 23 విప‌క్ష పార్టీలు
Advertisement

SIR | దేశంలో ఎన్నికల ప్రక్రియ, సమగ్ర ఓటరు జాబితా సవరణ (SIR​) అంశాలపై అధికార, ప్రతిపక్షాల (opposition parties) మధ్య మరోసారి రాజకీయ వేడి రాజుకుంది. దేశ‌వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో చేప‌డుతున్న‌ స‌ర్ ప్ర‌క్రియ‌పై అభ్యంత‌రాలు వ్య‌క్తం చేస్తూ ప్ర‌తిప‌క్ష పార్టీలు భార‌త‌ ప్ర‌ధాన న్యాయ‌మూర్తి జ‌స్టిస్ సూర్య‌కాంత్‌ (Chief Justice Surya Kant)కు లేఖ రాశాయి.

స‌ర్ ప్ర‌క్రియ‌తో పాటు ఎన్నిక‌ల సంఘం పాత్ర, ఎన్నిక‌ల‌కు సంబంధించిన స‌మ‌స్య‌ల గురించి స్వ‌తంత్ర ఎంపీ స‌హా 23 విప‌క్ష పార్టీలు సీజేఐకి లేఖ రాశాయి. ఈ లేఖ‌లో ఇండియా బ్లాక్ పార్టీల‌తో పాటు ఆమ్ ఆద్మీ, డీఎంకే పార్టీలు కూడా సంత‌కాలు చేశాయి. ఈ విష‌యాన్ని కాంగ్రెస్ సీనియ‌ర్ నేత జైరాం ర‌మేష్ (Jairam Ramesh) ఎక్స్ వేదిక‌గా వెల్ల‌డించారు. జూన్​ 8న జరిగిన ఇండియా జనబంధన్ సమావేశంలో తీసుకున్న నిర్ణ‌యం మేర‌కు సీజేఐకి లేఖ పంపిన‌ట్లు తెలిపారు. ప్రజాస్వామ్య విలువలు, రాజ్యాంగ పరిరక్షణ, ఎన్నికల పారదర్శకత కోసం కలిసి పోరాడతామని ఈ సంద‌ర్భంగా జైరాం ర‌మేష్‌ స్పష్టం చేశారు.

ఇలాంటి రోజు ఒక‌టి వ‌స్తుంద‌ని ఊహించామా..?

ఎన్నికల సంఘం చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ప్రక్రియపై ప్రతిపక్ష పార్టీలు భారత ప్రధాన న్యాయమూర్తికి (CJI) లేఖ రాయడంపై ఆర్జేడీ (RJD) ఎంపీ మనోజ్ ఝా స్పందించారు. ఇది ప్రతిపక్షాలు తమ రాజకీయ క్షేత్రాన్ని కాపాడుకోవడానికి సంబంధించిన విషయం మాత్రమే కాద‌ని, ఇది ఒక రాజ్యాంగపరమైన బాధ్యతకు సంబంధించిన అంశ‌మ‌ని తెలిపారు.

"పశ్చిమ బెంగాల్‌లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియలో 27 లక్షల మందికి పైగా ఓటర్లు అనర్హులుగా తేలారు. ఒక్కసారి ఊహించండి.. వీరిలో కనీసం 4,000 లేదా 5,000 మంది నిజమైన ఓటర్లేనని తేలితే.. వారికి జరిగిన అన్యాయానికి ఎవరు బాధ్య‌త వ‌హిస్తారు..? ఇటీవ‌లే స‌ర్ ప్ర‌క్రియ‌లో భాగంగా పేరు తొల‌గించ‌డంతో ఒక ప్రముఖ ఆంగ్ల దినపత్రిక మాజీ సంపాదకుడు తన పాస్‌పోర్ట్‌ను పునరుద్ధరించుకోలేకపోయారు. మన దేశంలో ఇలాంటి రోజు ఒక‌టి వస్తుందని మనం ఎప్పుడైనా ఊహించామా..? అందుకే రాజకీయ పార్టీలు సుప్రీంకోర్టుకు లేఖ రాశాయి. చీకటి గుహలో అదొక చివరి ఆశాకిరణంలా వారికి కనిపిస్తోంది. న్యాయం జ‌రుగుతుంద‌న్న ఆశతోనే ఆ లేఖ రాశాము" అని మనోజ్ ఝా పేర్కొన్నారు.

ప్రజాస్వామ్యాన్ని బీజేపీ హైజాక్ చేస్తోంది

"స‌ర్‌ (SIR) ప్రక్రియ ద్వారా ప్రజాస్వామ్యాన్ని బీజేపీ హైజాక్ చేస్తోంది. ఈ అంశంపై ఎన్డీయేతర ప్రతిపక్షాల్లో పూర్తి ఐక్యత ఉంది. స‌ర్ ప్రక్రియ ద్వారా బీజేపీ ఓటర్ల జాబితాను, ఓటింగ్ ప్రక్రియను, ఎన్నికలను మానిప్యులేట్ చేస్తూ, ప్రజాస్వామ్యాన్ని బీజేపీ ఎలా హైజాక్ చేస్తోంది అనే విషయాలపై ప్రతిపక్షాలన్నీ ఏకతాటిపై ఉన్నాయి. ఈసీని అడ్డుపెట్టుకుని బీజేపీ స‌ర్కార్‌ స‌ర్‌ను దుర్వినియోగం చేస్తూ లక్షలాది మంది ప్రజల ఓటు హక్కును లాగేసుకుంటోంది.

బెంగాల్ ఎన్నికల్లో లక్షలాది మంది ఓటు హక్కును కోల్పోయారు. గ‌తంలో ఎన్న‌డూ లేని విధంగా 23 ప్ర‌తిప‌క్ష పార్టీలు భార‌త ప్ర‌ధాన న్యాయ‌మూర్తికి సంయుక్త లేఖ రాశాయి. డీఎంకే, ఆప్ కూడా ఈ లేఖ‌లో సంత‌కాలు చేశాయి. ప్ర‌తిప‌క్ష పార్టీలు భార‌త ప్ర‌ధాన న్యాయ‌మూర్తికి లేఖ రాయ‌డం ఇదే మొద‌టిసారి. రాజ‌కీయ ప్ర‌యోజ‌నాల కోసం బీజేపీ చేస్తున్న ఈ తారుమారుని, అలాగే ప్ర‌తి భార‌తీయ పౌరుడి ఓటు హ‌క్కును ఘోరంగా ఉల్లంఘిస్తున్న ఈ ఉదంతాన్ని దయచేసి పరిశీలించాలని కోరుతూ సీజేఐకి లేఖ పంపాము" అని టీఎంసీ (TMC) ఎంపీ సాగరికా ఘోష్ తెలిపారు.

Advertisement
Advertisement