త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

US-Israel-Iran War | ట్రిగ్గర్ మీదే మా చేతులు.. ఇజ్రాయెల్‌కి ఇరాన్ కౌంటర్

అమెరికా-ఇరాన్ మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం మూణ్ణాళ్ల ముచ్చటే అయింది. లెబనాన్‌పై ఇజ్రాయెల్ చేపట్టిన భీకర దాడుల్లో 200 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా, వందలాది మంది గాయపడ్డారు.

J

International | Published On Apr 9, 2026, 6.53 pm IST

US-Israel-Iran War | ట్రిగ్గర్ మీదే మా చేతులు.. ఇజ్రాయెల్‌కి ఇరాన్ కౌంటర్

సంక్షిప్త సారాంశం

మధ్యప్రాచ్యంలో మళ్లీ యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. అమెరికా, ఇరాన్ మధ్య రెండు వారాల కాల్పుల విరమణ ఒప్పందం కుదిరినా.. ఇజ్రాయెల్ మాత్రం లెబనాన్‌పై విరుచుకుపడుతోంది. తాజా దాడుల్లో 200 మందికి పైగా మరణించగా, 1000 మందికి పైగా గాయపడ్డారు. లెబనాన్ ఈ కాల్పుల విరమణ ఒప్పందంలో భాగం కాదని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు స్పష్టం చేశారు. మరోవైపు, ఒప్పందాన్ని పూర్తిగా అమలు చేయకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌ను హెచ్చరించగా.. దాడులు ఆగకపోతే తమ చేతులు తుపాకీ ట్రిగ్గర్ మీదే ఉంటాయని ఇరాన్ అధ్యక్షుడు దీటుగా బదులిచ్చారు.

Advertisement
  • లెబనాన్‌పై ఇజ్రాయెల్ భీకర దాడులు
  • నిప్పుల కొలిమిలా మిడిల్ ఈస్ట్

US-Israel-Iran War | త్రినేత్ర.న్యూస్ : మధ్యప్రాచ్యం మళ్లీ అస్థిరతలో కూరుకుపోయింది. అమెరికా, ఇరాన్ మధ్య కుదిరిన రెండు వారాల కాల్పుల విరమణ ఒప్పందం అమలులోకి వచ్చినా ఉద్రిక్తతలు భగ్గుమన్నాయి. లెబనాన్‌పై ఇజ్రాయెల్ ఎన్నడూ లేని విధంగా విరుచుకుపడింది. ఈ దాడుల్లో 200 మందికి పైగా మరణించగా, సుమారు 1,000 మంది గాయపడ్డారు. గత ఐదు వారాల పోరులో ఇదే అత్యంత రక్తపాతంతో కూడిన రోజుగా నమోదైంది.

వెనక్కి తగ్గేది లేదు: ఇజ్రాయెల్

కాల్పుల విరమణ ఒప్పందంలో లెబనాన్ భాగం కాదని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు తెగేసి చెప్పారు. హిజ్బుల్లా లక్ష్యంగా తమ దాడులు కొనసాగుతాయని స్పష్టం చేశారు. బీరుట్‌లో ఇజ్రాయెల్ జరిపిన తాజా దాడుల్లో హిజ్బుల్లా చీఫ్ నయీమ్ ఖాసిమ్ మేనల్లుడు, ఆయనకు వ్యక్తిగత కార్యదర్శిగా వ్యవహరిస్తున్న అలీ యూసుఫ్ హర్షీ హతమయ్యాడని ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది. ఇజ్రాయెల్ దాడులకు ప్రతీకారంగా హిజ్బుల్లా సైతం ఉత్తర ఇజ్రాయెల్‌పై సుమారు 30 రాకెట్లను ప్రయోగించింది.

ట్రంప్ స్ట్రాంగ్ వార్నింగ్

రెండు వారాల తాత్కాలిక ఒప్పందం నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ట్రూత్ సోషల్ వేదికగా ఇరాన్‌కు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. "నిజమైన ఒప్పందాన్ని ఇరాన్ పూర్తిగా పాటించే వరకు అమెరికా నౌకలు, విమానాలు, సైన్యం ఇరాన్ చుట్టుపక్కలే మోహరించి ఉంటాయి. ఒకవేళ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తే.. మునుపెన్నడూ చూడని స్థాయిలో మా దాడులు ఉంటాయి. ఇరాన్ వద్ద ఎలాంటి అణ్వాయుధాలు ఉండకూడదు. అలాగే హార్ముజ్ జలసంధి పూర్తిగా తెరిచి ఉంచాలి అని ట్రంప్ స్పష్టం చేశారు.

Middle East Tensions Escalate 200 Killed in Lebanon Strikes Despite US-Iran Truce

లెబనాన్ సోదరులను ఇరాన్ ఎప్పటికీ విడిచిపెట్టదు

లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడులను ఇరాన్ తీవ్రంగా ఖండించింది. ఇది కాల్పుల విరమణ ఒప్పందాన్ని బాహాటంగా ఉల్లంఘించడమేనని ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్ మండిపడ్డారు. "ఈ దాడులు ఇలాగే కొనసాగితే దౌత్య చర్చలకు అర్థం లేదు. మా చేతులు ట్రిగ్గర్ మీదే ఉంటాయి. లెబనాన్ సోదరులను ఇరాన్ ఎప్పటికీ విడిచిపెట్టదు" అని హెచ్చరించారు. దాడులకు బాధ్యులైన వారు తీవ్ర మూల్యం చెల్లించుకుంటారని ఇరాన్ ఖుద్స్ ఫోర్స్ కమాండర్ ఎస్మాయిల్ ఖానీ సైతం వార్నింగ్ ఇచ్చారు. కాగా, ఫిబ్రవరి 28న మొదలైన ఈ యుద్ధంలో ఇప్పటివరకు 3,000 మందికి పైగా ఇరానియన్లు మరణించినట్లు ఇరాన్ ఫోరెన్సిక్ చీఫ్ వెల్లడించారు.

మూతపడిన హార్ముజ్ జలసంధి.. ప్రపంచంపై ప్రభావం

కాల్పుల విరమణ ఒప్పందం తర్వాత కూడా వ్యూహాత్మక 'హార్ముజ్ జలసంధి'లో రాకపోకలు దాదాపు నిలిచిపోయాయి. లెబనాన్‌పై దాడుల నేపథ్యంలో ఇరాన్ ఈ జలసంధిని పూర్తిగా మూసివేసినట్లు ఇరాన్ మీడియా 'ప్రెస్ టీవీ' పేర్కొంది. దీంతో పలు ఆయిల్ ట్యాంకర్లు వెనక్కి మళ్లుతున్నాయి. వేలాది నౌకలు సముద్రంలో నిలిచిపోయాయి. హార్ముజ్ జలసంధిని బేషరతుగా తెరవాలని యూఏఈ (UAE) డిమాండ్ చేసింది. ఇదే విషయంపై గల్ఫ్ నేతలతో చర్చించేందుకు యూకే ప్రధాని కీర్ స్టార్మర్ అబుదాబి చేరుకున్నారు. ఎల్పీజీ (LPG) సరఫరా అంతరాయాల నేపథ్యంలో భారత కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరీ ఖతార్‌లో పర్యటించనున్నారు.

Middle East Tensions Escalate 200 Killed in Lebanon Strikes Despite US-Iran Truce

ఇస్లామాబాద్ చర్చలపై సందిగ్ధత

కాల్పుల విరమణలో తదుపరి దశలపై చర్చించేందుకు శుక్రవారం పాకిస్థాన్‌లోని ఇస్లామాబాద్‌లో అమెరికా, ఇరాన్, పాక్ ప్రతినిధుల మధ్య కీలక సమావేశం జరగాల్సి ఉంది. అయితే, తమ బృందం ఇస్లామాబాద్ చేరుకుంటుందని ఎక్స్‌లో (X) పోస్ట్ చేసిన పాకిస్థాన్‌లోని ఇరాన్ రాయబారి.. కాసేపటికే ఆ ట్వీట్‌ను తొలగించారు. దీంతో ఈ చర్చల నుంచి ఇరాన్ తప్పుకుంటోందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాగా, ఇరాన్ గతంలో పంపిన 10-పాయింట్ల ప్రతిపాదనలలో ఒకటి 'చాట్ జీపీటీ' (ChatGPT) ద్వారా రాసినట్లుందని అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఎద్దేవా చేయడం గమనార్హం.

Advertisement
Advertisement