త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Indian Navy | భారత్‌ కార్గో షిప్‌ని హైజాక్ చేసేందుకు సముద్రపు దొంగల యత్నం.. అందులో ఏముందంటే?

గల్ఫ్ ఆఫ్ ఎడెన్‌లో సముద్రపు దొంగల కిడ్నాప్ యత్నాన్ని ఇండియన్ నేవీ తిప్పికొట్టింది. ఇండియాకు వస్తున్న కార్గో షిప్‌ను మార్కోస్ కమాండోలు ఎలా రక్షించారంటే?

J

International | Published On Jul 2, 2026, 5.36 pm IST

Indian Navy | భారత్‌ కార్గో షిప్‌ని హైజాక్ చేసేందుకు సముద్రపు దొంగల యత్నం.. అందులో ఏముందంటే?
Advertisement
  • గల్ఫ్ ఆఫ్ ఎడెన్‌లో 'ఎంవీ గోల్డెన్ ఆర్సెనల్' షిప్‌పై సముద్రపు దొంగల దాడి
  • వెంటనే 'సేఫ్ రూమ్'లోకి వెళ్లి లాక్ చేసుకున్న నౌక సిబ్బంది
  • డిస్ట్రెస్ కాల్‌తో అప్రమత్తమైన ఐఎన్ఎస్ త్రికండ్ వార్‌షిప్.. దొంగల ఎస్కేప్
  • రంగంలోకి దిగిన మార్కోస్ కమాండోలు.. భారత్‌కు వస్తున్న కార్గో షిప్ సేఫ్

Indian Navy | త్రినేత్ర.న్యూస్ : గల్ఫ్ ఆఫ్ ఎడెన్ (Gulf of Aden) సముద్ర మార్గంలో బుధవారం రాత్రి భారీ హైజాక్ కుట్ర భగ్నమైంది. భారత్‌కు అత్యవసరమైన సరుకులతో వస్తున్న ఓ మర్చంట్ వెసెల్ (కార్గో షిప్)ను సముద్రపు దొంగలు (పైరేట్స్) హైజాక్ చేసేందుకు ప్రయత్నించగా.. ఇండియన్ నేవీ వార్‌షిప్ 'ఐఎన్ఎస్ త్రికండ్' వేగంగా స్పందించి వారి ప్లాన్‌ను తిప్పికొట్టింది.

షిప్‌లో అసలేం జరిగింది?

'ఎంవీ గోల్డెన్ ఆర్సెనల్' (MV Golden Arsenal) అనే ఈ కార్గో షిప్‌లో ఒక భారతీయుడు సహా పలువురు క్రూ మెంబర్స్ ఉన్నారు. బుధవారం రాత్రి అనుమానాస్పదంగా కొందరు పైరేట్స్ షిప్‌ను బోర్డ్ చేసేందుకు (ఎక్కేందుకు) ప్రయత్నించారు. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది.. యాంటీ-పైరసీ ప్రోటోకాల్‌ను ఫాలో అయ్యారు. లోపల ఉన్న ఓ 'సేఫ్ రూమ్'లో లాక్ చేసుకుని, ఎమర్జెన్సీ కమ్యూనికేషన్ ఛానల్ ద్వారా అధికారులకు అలర్ట్ పంపారు.

భయపడి పారిపోయిన పైరేట్స్

ఆ ప్రాంతంలోనే ఆపరేషన్స్‌లో ఉన్న ఇండియన్ నేవీకి చెందిన ఐఎన్ఎస్ త్రికండ్ (INS Trikand) ఈ డిస్ట్రెస్ కాల్ (ఎమర్జెన్సీ మెసేజ్) అందుకుంది. క్షణాల్లో ఆ మర్చంట్ వెసెల్ వైపు దూసుకెళ్లింది. నేవీ వార్‌షిప్ తమవైపు వస్తుండటాన్ని గమనించిన సముద్రపు దొంగలు.. షిప్‌ను తమ కంట్రోల్‌లోకి తీసుకోకముందే భయపడి అక్కడినుంచి పారిపోయారు.

రంగంలోకి మార్కోస్ కమాండోలు

ఆ వెంటనే భారత నావికాదళానికి చెందిన ఎలైట్ మెరైన్ కమాండోలు (MARCOS) గోల్డెన్ ఆర్సెనల్ షిప్‌లోకి ఎంటర్ అయ్యారు. నౌకలో అణువణువూ గాలించి (శానిటైజేషన్ ఆపరేషన్), ఎలాంటి ముప్పు లేదని నిర్ధారించారు. ప్రస్తుతం షిప్‌తో పాటు అందులోని సిబ్బంది అంతా సేఫ్‌గా ఉన్నారని, నౌకకు ఎలాంటి డ్యామేజ్ జరగలేదని అధికారులు వెల్లడించారు. ఈ నౌకలో భారత్‌కు అవసరమైన అత్యంత కీలకమైన కార్గో ఉన్నట్లు తెలుస్తోంది.

అలర్ట్‌గా ఇండియన్ నేవీ

హార్న్ ఆఫ్ ఆఫ్రికాకు దగ్గరగా ఉండే 'గల్ఫ్ ఆఫ్ ఎడెన్' ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే సముద్ర వాణిజ్య మార్గాల్లో ఒకటి. ఇక్కడ పైరేట్స్ దాడులు కామన్. అందుకే, మర్చంట్ షిప్‌లకు రక్షణ కల్పించేందుకు ఇండియన్ నేవీ ఈ ప్రాంతంలో ఎప్పుడూ తన ఫ్రంట్‌లైన్ వార్‌షిప్‌లను మోహరించి ఉంచుతుంది. గత రెండేళ్లుగా అరేబియా సముద్రం, గల్ఫ్ ఆఫ్ ఎడెన్ మీదుగా ప్రయాణించే భారతీయ నావికులను, వాణిజ్య నౌకలను రక్షించడంలో మన నేవీ వరుస యాంటీ-పైరసీ ఆపరేషన్లతో సత్తా చాటుతోంది.

Advertisement

తాజావార్తలు

Advertisement