త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Ebola virus | బుండిబుగ్యో ఎబోలా.. ప‌బ్లిక్ హెల్త్ ఎమ‌ర్జెన్సీ ప్ర‌క‌టించిన డబ్ల్యూహెచ్‌వో

Ebola virus | ఆఫ్రికా దేశం ఈశాన్య కాంగోలోని ఇటూరి ప్రావిన్స్‌లో ఎబోలా క‌ల‌క‌లం సృష్టిస్తోంది. రోజురోజుకు మృతుల సంఖ్య పెరుగుతుండటంతో డబ్ల్యూహెచ్‌వో బుండిబుగ్యో ఎబోలాను అంతర్జాతీయ స్థాయిలో పబ్లిక్‌ హెల్త్‌ ఎమర్జెన్సీగా ప్రకటించింది.

S

International | Published On May 24, 2026, 12.17 pm IST

Ebola virus | బుండిబుగ్యో ఎబోలా.. ప‌బ్లిక్ హెల్త్ ఎమ‌ర్జెన్సీ ప్ర‌క‌టించిన డబ్ల్యూహెచ్‌వో
Advertisement
  • కాంగోలో మొత్తం 867 మందికి వ్యాప్తి.. 204 మంది మృత్యువాత‌
  • హెల్త్‌ అడ్వైజరీ జారీ చేసిన భార‌త్‌

Ebola virus | త్రినేత్ర‌.న్యూస్‌: ఆఫ్రికా దేశం ఈశాన్య కాంగోలోని ఇటూరి ప్రావిన్స్‌లో ఎబోలా క‌ల‌క‌లం సృష్టిస్తోంది. రోజురోజుకు వేగంగా వ్యాప్తి చెందుతోంది. మృతుల సంఖ్య పెరుగుతుండటంతో డబ్ల్యూహెచ్‌వో బుండిబుగ్యో ఎబోలాను అంతర్జాతీయ స్థాయిలో ఆందోళనకరమైన పబ్లిక్‌ హెల్త్‌ ఎమర్జెన్సీగా ప్రకటించింది. ప్రస్తుతం కాంగో, ఉగాండ, దక్షిణ సూడాన్‌లలో వ్యాప్తి తీవ్రత ఎక్కువగా ఉన్నట్లు తెలిపింది. శనివారం నాటికి కాంగోలో మొత్తం 867 మందికి ఈ వ్యాధి వ్యాపించగా.. 204 మంది మృత్యువాత ప‌డ్డారు.

హెల్త్ వ‌ర్క‌ర్ మృత్యువాత‌..

ఈశాన్య కాంగోలోని యుద్ధ ప్రభావిత ప్రాంతమైన ఉగాండా సరిహద్దుల్లో తొలి ఎబోలా కేసు నమోదైంది. అక్కడ ఒక హెల్త్‌ వర్కర్‌ వాంతులు, జ్వరంతో చికిత్స తీసుకొని కొద్ది రోజుల వ్య‌వ‌ధిలోనే ప్రాణాలు కోల్పోయారు. ఆ తర్వాత ఆ మృతదేహాన్ని అంత్యక్రియల కోసం ఇంటికి తరలించ‌గా చాలా మందికి ఎబోలా లక్షణాలు బయటపడ్డాయి. వైరస్‌ సోకిన వారికి కొన్ని వారాలపాటు వ్యాధి లక్షణాలు బయటపడకపోవడంతో ఎక్కువ మందికి సోకే అవకాశం ఏర్ప‌డుతోంది. వ్యాధి వ్యాపించిన ప్రదేశం కాంగోలో ప్రధాన మైనింగ్‌ కేంద్రం కావడంతో జనాభా రద్దీ అధికంగా ఉంటుంది. దీంతో 2018లో ఎబోలా వ్యాపించిన సమయంలో దాన్ని కట్టడి చేయడానికి ఏకంగా రెండేళ్ల సమయం పట్టింది.

ప‌ర్వ‌త ప్రాంతంలో మొద‌టిసారి గుర్తింపు..

మనుషులకు సోకే నాలుగు రకాల ఎబోలా వైరస్‌ల్లో బుండిబుగ్యో ఒకటి. దీన్ని ఉగాండాలోని ఓ పర్వత ప్రాంతంలో మొద‌టిసారిగా కనుగొన్నారు. గతంలో రెండుసార్లు మాత్రమే వ్యాపించడంతో అధికారులు పెద్దగా దృష్టి పెట్టలేదు. ఫలితంగా తాజాగా వ్యాపించిన ప్రదేశంలోని ల్యాబ్‌ పరీక్షల్లో దీన్ని గుర్తించే సౌకర్యం లేకపోవడంతో కొంత‌ జాప్యం జరిగింది. మొదటి గుర్తించేందుకు నమూనాను వేల మైళ్ల దూరంలో ఉన్న గవర్నమెంట్‌ రీసెర్చి ల్యాబ్‌కు పంపాల్సి వచ్చింది.

ఎబోలా జైర్‌తో పోలిస్తే..

ఎబోలాలో జైర్‌ అనే స్ట్రెయిన్ కూడా అత్యంత వేగంగా వ్యాపిస్తోంది. దీంతో పోలిస్తే బుండిబుగ్యో ఎబోలా వైరస్‌ కొంచెం నెమ్మదిగానే తన సంఖ్యను పెంచుతుందని పరిశోధనల్లో వెల్ల‌డ‌వుతోంది. జైర్‌ వేరియంట్‌ పశ్చిమాఫ్రికా ప్రాంతంలో 2014లో 11,300 మంది ప్రాణాలను బ‌లిగొంది. ఇది చరిత్రలోనే అతిపెద్ద ఎబోలా వ్యాప్తి. దీంతో పోలిస్తే బుండిబుగ్యో వేరియంట్‌ సోకిన వారిలో 30% మందే మ‌ర‌ణించారు. అయితే ఇప్పటి వరకు ఎటువంటి వ్యాక్సిన్‌, చికిత్స లేకపోవడంతో ప్ర‌జ‌ల్లో తీవ్ర భ‌యాందోళ‌న నెల‌కొంది. కేవలం వారాల వ్యవధిలోనే మూడు దేశాలకు పాకి వందల మందికి సోకింది. ఈ వ్యాధి వ్యాపించిన ప్రదేశంలో కట్టడి చేయడం చాలా కష్టమని అంతర్జాతీయ ఆరోగ్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

మ‌రోవైపు భారత ప్రభుత్వం కూడా బుండిబుగ్యో ఎబోలాపై వ్యాప్తి వేళ‌ అప్రమత్తమైంది. ప్రజలు అత్యవసరమైతే తప్ప కాంగో, ఉగాండా, దక్షిణ సూడాన్‌ దేశాలకు వెళ్లొద్ద‌ని హెల్త్‌ అడ్వైజరీ జారీ చేసింది.

Advertisement
Advertisement