త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Etala Rajendar | కార్మికులు కంపెనీల‌కు వ్య‌తిరేకం కాదు.. వారి సంక్షేమాన్ని కంపెనీలు మ‌ర‌వొద్దు

Etala Rajendar | కార్మికులు కంపెనీల‌కు వ్య‌తిరేకం కాద‌ని.. వారి సంక్షేమాన్ని కంపెనీలు మ‌రిచిపోవ‌ద్ద‌ని మ‌ల్కాజిగిరి ఎంపీ ఈట‌ల రాజేంద‌ర్ సూచించారు. కార్మికుల కృషి వల్లే కంపెనీలు లాభాలు పొందుతున్నాయని చెప్పారు. ఎంటీఏఆర్ టెక్నాలజీస్ సంస్థ, ఐ.డి.ఏ, జీడిమెట్ల రోడ్, గాంధీనగర్‌లో అవుట్‌సోర్సింగ్, కాంట్రాక్ట్ కార్మికులు గ‌త నాలుగు రోజులుగా నిర్వ‌హిస్తున్న ధర్నాలో సోమ‌వారం ఆయ‌న‌ పాల్గొని వారికి మ‌ద్ద‌తిచ్చారు.

S

Hyderabad | Published On Aug 3, 2026, 1.16 pm IST

Etala Rajendar | కార్మికులు కంపెనీల‌కు వ్య‌తిరేకం కాదు.. వారి సంక్షేమాన్ని కంపెనీలు మ‌ర‌వొద్దు
Advertisement
  • కంపెనీలు అభివృద్ధి అయితే కార్మికుల జీవితాలు కూడా బాగ‌వుతాయి
  • ఎంటీఏఆర్ టెక్నాల‌జీస్ సంస్థ కార్మికుల ధ‌ర్నాలో మ‌ల్కాజిగిరి ఎంపీ ఈట‌ల రాజేంద‌ర్‌

Etala Rajendar | త్రినేత్ర‌.న్యూస్‌: కార్మికులు కంపెనీల‌కు వ్య‌తిరేకం కాద‌ని.. వారి సంక్షేమాన్ని కంపెనీలు మ‌రిచిపోవ‌ద్ద‌ని మ‌ల్కాజిగిరి ఎంపీ ఈట‌ల రాజేంద‌ర్ సూచించారు. కార్మికుల కృషి వల్లే కంపెనీలు లాభాలు పొందుతున్నాయని చెప్పారు. కంపెనీలు అభివృద్ధి చెందితే కార్మికుల జీవితాలు కూడా మెరుగుపడతాయని తెలిపారు. ఎంటీఏఆర్ టెక్నాలజీస్ సంస్థ, ఐ.డి.ఏ, జీడిమెట్ల రోడ్, గాంధీనగర్‌లో అవుట్‌సోర్సింగ్, కాంట్రాక్ట్ కార్మికులు గ‌త నాలుగు రోజులుగా నిర్వ‌హిస్తున్న ధర్నాలో సోమ‌వారం ఆయ‌న‌ పాల్గొని వారికి మ‌ద్ద‌తిచ్చారు. ఈ సంద‌ర్భంగా కార్మికులు తమకు పీఎఫ్, ఆరోగ్య భద్రత కార్డు, ఉద్యోగ భద్రత, అదనపు పనికి తగిన పారితోషికం, డబుల్ సాలరీ వంటి సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు.

అనంత‌రం ఈటల మాట్లాడారు. కార్మికుల సమస్యలను కంపెనీ యాజమాన్యంతో చర్చించే ప్రయత్నం చేస్తానని హామీ ఇచ్చారు. యుద్ధ పరిస్థితుల తర్వాత వస్తువుల ధరలు భారీగా పెరిగాయని, కుటుంబ పోషణ, ఇల్లు అద్దె, పిల్లల విద్య, వైద్య ఖర్చులు కార్మికులకు భారమవుతున్నాయని ఆయన పేర్కొన్నారు. నిరుద్యోగ సమస్య తీవ్రంగా ఉందన్నారు. ఉద్యోగాలను కాపాడేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రధాని మోదీ నాయకత్వంలో కంపెనీలకు రుణాలు, ప్రోత్సాహకాలు, వేతన సహాయం అందిస్తోందని తెలిపారు.

యాజ‌మాన్యానికి లేఖ రాసి స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి కృషి చేస్తా..

మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా కార్యక్రమాల ద్వారా పరిశ్రమలకు భూమి, విద్యుత్, నీరు, పన్ను రాయితీలు, మూలధన సహాయం వంటి అనేక సబ్సిడీలు ప్రభుత్వం అందిస్తోందని గుర్తు చేశారు. కార్మికుల కృషి వల్లే కంపెనీలు లాభాలు పొందుతున్నాయని, కార్మిక సంక్షేమాన్ని కంపెనీలు మరచిపోవద్దని సూచించారు. స్థానిక పార్లమెంట్ సభ్యుడిగా యాజమాన్యానికి లేఖ రాసి సమస్యల పరిష్కారానికి తన వంతు ప్రయత్నం చేస్తానని ఈటల రాజేందర్ స్ప‌ష్టం చేశారు. కార్మికులు కూడా శాంతియుతంగా, సామ‌ర‌స్య‌పూర్వకంగా వ్యవహరించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో మేడ్చల్ అర్బన్ జిల్లా బీజేపీ ప్రధాన కార్యదర్శి గిరివర్ధన్ రెడ్డి, సీనియర్ నాయకులు గారిగే శేఖర్ ముదిరాజ్, కట్ట కుమార్, సోరబ్ సింగ్, ఆదిత్య, శ్యామ్ తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement
Advertisement