త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Stock Markets | స్వ‌ల్ప లాభాల్లో ట్రేడ‌వుతున్న సూచీలు.. పెట్టుబ‌డిదారుల‌పై అమ్మ‌కాల ఒత్తిడి..

Stock Markets | రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగించడంతోపాటు అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు తగ్గుముఖం పట్టడం, మధ్యప్రాచ్యంలో దౌత్యపరమైన పరిష్కారంపై ఆశలు పెరగడంతో గురువారం దేశీయ ఈక్విటీ మార్కెట్లు స్వల్ప లాభాలతో ప్రారంభమయ్యాయి.

S

Business | Published On Aug 6, 2026, 10.26 am IST

Stock Markets | స్వ‌ల్ప లాభాల్లో ట్రేడ‌వుతున్న సూచీలు.. పెట్టుబ‌డిదారుల‌పై అమ్మ‌కాల ఒత్తిడి..
Advertisement

Stock Markets | రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగించడంతోపాటు అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు తగ్గుముఖం పట్టడం, మధ్యప్రాచ్యంలో దౌత్యపరమైన పరిష్కారంపై ఆశలు పెరగడంతో గురువారం దేశీయ ఈక్విటీ మార్కెట్లు స్వల్ప లాభాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:21 గంటల సమయానికి బీఎస్‌ఈ సెన్సెక్స్ 186.23 పాయింట్లు (0.24 శాతం) పెరిగి 78,767.23 వద్ద ట్రేడవుతుండగా, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ50 సూచీ 9.95 పాయింట్లు (0.04 శాతం) లాభంతో 24,634.60 వద్ద కొనసాగింది. మార్కెట్లకు ముడి చమురు ధరల తగ్గుదల కూడా ఊతమిచ్చింది. బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్‌కు 80 డాలర్ల దిగువకు చేరుకుని 79.34 డాలర్ల వద్ద ట్రేడవుతుండగా, డబ్ల్యూటీఐ క్రూడ్ 75.01 డాలర్ల వద్ద కొనసాగింది. ఇరాన్-ఒమాన్ చర్చల్లో పురోగతి కనిపించడం, అమెరికా-ఇరాన్ మధ్య విస్తృత శాంతి ఒప్పందానికి మార్గం సుగమం కావచ్చన్న అంచనాలతో చమురు ధరలు తగ్గాయి. చమురు ధరలు తగ్గడం భారత్‌కు అనుకూలంగా మారనుంది. దీంతో ద్రవ్యోల్బణ ఒత్తిడి తగ్గడమే కాకుండా దిగుమతి బిల్లు కూడా తగ్గే అవకాశం ఉంటుంది.

ర్యాలీని కొన‌సాగిస్తున్న ఐటీ షేర్లు..

అయితే ప్రధాన సూచీలు లాభాల్లో ఉన్నప్పటికీ విస్తృత మార్కెట్ మిశ్రమ ధోరణి కనబరిచింది. నిఫ్టీ స్మాల్‌క్యాప్ 100 సూచీ 0.23 శాతం పెరగగా, నిఫ్టీ మిడ్‌క్యాప్ 100 సూచీ 0.20 శాతం తగ్గింది. ఇటీవల మార్కెట్ ర్యాలీ తర్వాత ఇన్వెస్టర్లు ఎంపిక చేసిన షేర్లలో మాత్రమే పెట్టుబడులు పెడుతున్నట్లు ఇది సూచిస్తోంది. ఇదే సమయంలో ఇండియా విక్స్ 0.35 శాతం తగ్గి మార్కెట్‌లో అస్థిరత కొంత తగ్గినట్లు సంకేతాలు ఇచ్చింది. రంగాల వారీగా చూస్తే 16 ప్రధాన రంగాల సూచీల్లో తొమ్మిది లాభాల్లో ట్రేడయ్యాయి. నిఫ్టీ ఐటీ సూచీ 0.31 శాతం పెరిగి ఇటీవలి రికవరీని కొనసాగించగా, ఫార్మా 0.23 శాతం, మీడియా 0.15 శాతం, కెమికల్స్ 0.59 శాతం, ఆయిల్ అండ్ గ్యాస్ 0.16 శాతం, పీఎస్‌యూ బ్యాంక్ సూచీ 0.11 శాతం చొప్పున లాభపడ్డాయి. మరోవైపు నిఫ్టీ ఆటో 0.58 శాతం, రియాల్టీ 0.54 శాతం, ఫైనాన్షియల్ సర్వీసెస్ ఎక్స్-బ్యాంక్ సూచీ 0.14 శాతం నష్టాల్లో కొనసాగాయి.

బ‌ల‌హీన ప‌డ్డ రూపాయి..

షేర్ల వారీగా చూస్తే సెన్సెక్స్‌లో ఐటీసీ, కోటక్ మహీంద్రా బ్యాంక్, బజాజ్ ఫిన్‌సర్వ్, ఎన్‌టీపీసీ, ఎస్‌బీఐ, పవర్ గ్రిడ్, ఏషియన్ పెయింట్స్ ప్రారంభ ట్రేడింగ్‌లో లాభాల్లో ఉండగా, మారుతి సుజుకి, టైటాన్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ షేర్లు నష్టాల్లో ట్రేడయ్యాయి. ఫారెక్స్ మార్కెట్‌లో గురువారం భార‌త రూపాయి కాస్త బ‌ల‌హీన‌ప‌డింది. అమెరికా డాల‌ర్‌తో పోలిస్తే 95.15 వ‌ద్ద ఉన్న రూపాయి సెష‌న్‌లో 0.05 శాతం న‌ష్ట‌పోయింది. క్రితం సెష‌న్‌లో ప్రకటించిన ఆర్‌బీఐ ద్రవ్య విధాన నిర్ణయాలను కూడా మార్కెట్ విశ్లేషిస్తోంది. కేంద్ర బ్యాంక్ రెపో రేటును యథాతథంగా కొనసాగించడమే కాకుండా, 2026-27 ఆర్థిక సంవత్సరానికి జీడీపీ వృద్ధి అంచనాలను పెంచింది. అలాగే ద్రవ్యోల్బణ నియంత్రణ లక్ష్యానికి కట్టుబడి ఉంటామని పునరుద్ఘాటించింది. ఇకపై మార్కెట్ల‌ దృష్టి కంపెనీల త్రైమాసిక ఫలితాలు, అంతర్జాతీయ పరిణామాలపై మరింతగా కేంద్రీకృతమయ్యే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు.

Advertisement
Advertisement