త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

KBR Park One-Way Traffic | కేబీఆర్ పార్క్ చుట్టూ సిగ్నల్-ఫ్రీ ప్రయాణం: రూ.1,090 కోట్లతో మారనున్న హైదరాబాద్ ట్రాఫిక్ రూపురేఖలు!

ఐటీ కారిడార్‌కు వెళ్లేవారికి గుడ్ న్యూస్. ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెడుతూ కేబీఆర్ పార్క్ చుట్టూ రూ.1090 కోట్లతో భారీ ప్రాజెక్టు. 18 నుంచి వన్-వే అమలు!

J

Hyderabad | Published On Aug 16, 2026, 1.27 pm IST

KBR Park One-Way Traffic | కేబీఆర్ పార్క్ చుట్టూ సిగ్నల్-ఫ్రీ ప్రయాణం: రూ.1,090 కోట్లతో మారనున్న హైదరాబాద్ ట్రాఫిక్ రూపురేఖలు!

సంక్షిప్త సారాంశం

హైదరాబాద్‌లో ట్రాఫిక్ రద్దీని నివారించేందుకు రూ.1,090 కోట్లతో రాష్ట్ర ప్రభుత్వం 'హెచ్-సిటీ' ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. సిగ్నల్ ఫ్రీ జంక్షన్ల కోసం కేబీఆర్ పార్క్ చుట్టూ 7 ఫ్లైఓవర్లు, 7 అండర్ పాస్‌ల నిర్మాణం జరగనుంది. పనులను వేగవంతం చేసేందుకు ఈ నెల 18 నుంచి కేబీఆర్ పార్క్ చుట్టూ వన్-వే ట్రాఫిక్ సిస్టమ్ అమలు కానుంది. ఈ ప్రాజెక్టుతో కోర్ సిటీ నుంచి ఐటీ కారిడార్‌కు ప్రయాణ సమయం ఆదాతో పాటు కాలుష్యం గణనీయంగా తగ్గుతుంది.

Advertisement

KBR Park One-Way Traffic | త్రినేత్ర.న్యూస్ : మహానగరంలో నానాటికీ పెరుగుతున్న ట్రాఫిక్ (Traffic) రద్దీకి చెక్ పెడుతూ, నగర రవాణా వ్యవస్థను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లేందుకు రాష్ట్ర ప్రభుత్వం బృహత్తర ప్రణాళికను సిద్ధం చేసింది. హైదరాబాద్ సిటీ ఇన్నోవేటివ్ అండ్ ట్రాన్స్‌ఫార్మేటివ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ (H-CITY) ప్రాజెక్టులో భాగంగా.. అత్యంత రద్దీగా ఉండే కేబీఆర్ పార్క్ చుట్టూ ఉన్న 6 ప్రధాన జంక్షన్లను సిగ్నల్ ఫ్రీగా మార్చనున్నారు. సుమారు రూ. 1,090 కోట్ల వ్యయంతో ఈ మెగా ప్రాజెక్టు రూపుదిద్దుకోనుంది.

దీనికోసం ఏకంగా 7 మల్టీ-లెవెల్ స్టీల్ ఫ్లైఓవర్లు, 7 డైరెక్షనల్ అండర్‌పాస్‌లు (మొత్తం 14 భారీ నిర్మాణాలు) నిర్మించనున్నారు. 24 నెలల రికార్డు సమయంలో ఈ పనులను పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు.

ఈ నెల 18 నుంచి వన్-వే ట్రాఫిక్ అమలు

నిర్మాణ పనులను ఎటువంటి ఆటంకాలు లేకుండా శరవేగంగా పూర్తి చేసేందుకు, ఈ నెల 18వ తేదీ నుంచి కేబీఆర్ పార్క్ చుట్టూ వన్-వే (One-way) ట్రాఫిక్ విధానాన్ని అమలు చేయాలని నగర పోలీస్ విభాగం నిర్ణయించింది. దీనిపై నగర పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనర్ మాట్లాడుతూ.. వాహనదారులకు ఇబ్బంది కలగకుండా.. నిర్మాణ సమయాన్ని తగ్గించేందుకే సమగ్ర అధ్యయనం తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. భవిష్యత్తు ప్రయోజనాల కోసమే ఈ తాత్కాలిక వన్-వే విధానమని, స్థానికులు, వాహనదారులు పోలీసులకు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

రెండు ప్యాకేజీలుగా నిర్మాణ పనులు

మొత్తం ఆరు జంక్షన్లను రెండు ప్యాకేజీలుగా విభజించి ఫ్లైఓవర్లు, అండర్ పాస్‌ల నిర్మాణం చేపట్టనున్నారు.

ప్యాకేజీ-1 (3 జంక్షన్లు): జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్, కేబీఆర్ పార్క్ ఎంట్రెన్స్, ముగ్ధ జంక్షన్. ముఖ్యంగా పంజాగుట్ట వైపు రైట్ టర్నింగ్ కోసం 900 మీటర్ల స్టీల్ ఫ్లైఓవర్, జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ వద్ద రెండు లెవెల్స్‌లో ఫ్లైఓవర్లు, పలు అండర్ పాస్‌లు నిర్మిస్తారు.

ప్యాకేజీ-2 (4 జంక్షన్లు): రోడ్ నంబర్ 45, ఫిలింనగర్, మహారాజా అగ్రసేన్, బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ జంక్షన్లు. ఇక్కడ ప్రతి జంక్షన్ వద్దా స్ట్రెయిట్, రైట్ టర్నింగ్ ట్రాఫిక్ సాఫీగా సాగేందుకు ప్రత్యేక ఫ్లైఓవర్లు, అండర్ పాస్‌లు రానున్నాయి.

KBR Park One-Way Traffic from 18th Rs 1090 Cr Mega Project

పీక్ అవర్స్‌లో పరిస్థితి ఇదీ..

కోర్ సిటీని ఐటీ కారిడార్ (IT Corridor) తో అనుసంధానించే కేబీఆర్ పార్క్ రూట్ నగరంలోనే అత్యంత కీలకమైనది. పీక్ అవర్స్‌ (Peak hours) లో కేవలం జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ వద్దే గంటకు 15,321 ప్యాసింజర్ కార్ యూనిట్ల (PCU) రాకపోకలు ఉంటున్నాయి. కేబీఆర్ ఎంట్రెన్స్ వద్ద గంటకు 13,516 కార్లు దాటుతున్నాయి. మహారాజా అగ్రసేన్, రోడ్ నంబర్ 45 లాంటి చోట్ల గంటకు 10 వేల కార్ల సామర్థ్యంతో సమానమైన ట్రాఫిక్ ఉంటోంది. ఇన్ని వేల వాహనాలను సాధారణ సిగ్నల్స్ ద్వారా కంట్రోల్ చేయడం అసాధ్యంగా మారింది. అందుకే ఈ మల్టీ-లెవెల్ ప్రాజెక్టును డిజైన్ చేశారు.

ఫ్యూచర్ బెనిఫిట్స్ ఏంటి?

ఈ 'హెచ్-సిటీ' నిర్మాణాలు పూర్తయితే కేబీఆర్ పార్క్ ఎంట్రెన్స్, రోడ్ నం. 45, ఫిలింనగర్, క్యాన్సర్ హాస్పిటల్ జంక్షన్ల వద్ద 100% ట్రాఫిక్ కష్టాలు తీరిపోతాయి. అత్యంత రద్దీగా ఉండే జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ వద్ద 80% మేర సమస్య పరిష్కారం అవుతుంది. సిగ్నల్స్ వద్ద ఆగాల్సిన పనిలేకపోవడంతో ఐటీ ఉద్యోగులకు, నగరవాసులకు ప్రయాణ సమయం ఆదా కావడంతో పాటు, కోట్లాది రూపాయల ఇంధనం ఆదా అవుతుంది. అన్నిటికీ మించి వెహికల్ ఎమిషన్స్ (కర్బన ఉద్గారాలు) తగ్గి కేబీఆర్ పార్క్ చుట్టూ పర్యావరణం మరింత మెరుగుపడుతుంది.

Advertisement
Advertisement