త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Gachibowli Dogs Rescue | ఒకే ఫ్లాట్‌లో 37 కుక్కలను పెంచుతున్న యువతి.. స్థానికుల ఫిర్యాదుతో హైకోర్టు సీరియస్

గచ్చిబౌలిలోని ఓ అపార్ట్‌మెంట్‌లో 37 కుక్కలను పెంచుతున్న యువతికి తెలంగాణ హైకోర్టు 3 వారాల గడువు ఇచ్చింది. అప్పటి లోపు స్థలం చూపించకపోతే దత్తతకు ఆదేశాలు.

J

Hyderabad | Published On Aug 12, 2026, 3.21 pm IST

Gachibowli Dogs Rescue | ఒకే ఫ్లాట్‌లో 37 కుక్కలను పెంచుతున్న యువతి.. స్థానికుల ఫిర్యాదుతో హైకోర్టు సీరియస్
Advertisement
  • గచ్చిబౌలిలోని ఓ త్రీ బెడ్‌రూమ్ ఫ్లాట్‌లో ఏకంగా 37 కుక్కలను పెంచుతున్న కామేశ్వరి అనే ఎంట్రప్రెన్యూర్
  • స్థానికుల ఫిర్యాదుతో కుక్కలను నాగోల్‌లోని 'పీపుల్ ఫర్ యానిమల్స్' (PFA) కేంద్రానికి తరలింపు
  • జంతువులకు కొత్త ఆశ్రయం వెతికేందుకు 'పెట్ పేరెంట్'కు హైకోర్టు 3 వారాల డెడ్‌లైన్
  • గడువులోగా అనువైన వసతి చూపించకపోతే.. కుక్కల దత్తతకు అనుమతిస్తామని కోర్టు హెచ్చరిక

Gachibowli Dogs Rescue | త్రినేత్ర.న్యూస్ : హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో ఓ ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. ఓ గేటెడ్ కమ్యూనిటీలోని త్రీ బెడ్‌రూమ్ ఫ్లాట్‌లో ఏకంగా 37 కుక్కలకు ఆశ్రయం కల్పించిన ఒక 'పెట్ పేరెంట్'కు తెలంగాణ హైకోర్టు (Telangana HC) షాకిచ్చింది. ఆ శునకాల కోసం అనువైన కొత్త ఆశ్రయాన్ని వెతికేందుకు కేవలం మూడు వారాల గడువు విధించింది.

అసలేం జరిగిందంటే..

కామేశ్వరి పిడపర్తి అనే ఎంట్రప్రెన్యూర్ జంతువుల మీద ప్రేమతో ఏళ్ల తరబడి వీధి కుక్కలను రక్షించి తన అపార్ట్‌మెంట్‌లో ఆశ్రయం కల్పిస్తున్నారు. అయితే, ఒకే ఇంట్లో ఇన్ని కుక్కలు ఉండటంతో ఇబ్బంది పడిన స్థానికులు అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో వారు ఆ కుక్కలను నాగోల్‌లోని 'పీపుల్ ఫర్ యానిమల్స్' (PFA) కేంద్రానికి తరలించారు. ఈ డాగ్స్‌ను దత్తత (adoption) ఇచ్చేందుకు అనుమతి కోరుతూ PFA హైకోర్టులో పిటిషన్ వేయగా.. కోర్టు విచారణ చేపట్టింది.

పూర్తయిన స్టెరిలైజేషన్..

జూలై 17న కోర్టు ఇచ్చిన ఆదేశాల ప్రకారం, వైద్య పరంగా ఆరోగ్యంగా ఉన్న కుక్కలకు జూలై 29, 30 తేదీల్లో నిపుణులైన వెటర్నరీ వైద్యులు స్టెరిలైజేషన్ (sterilisation) పూర్తి చేశారు. దీనికి ముందు జీహెచ్‌ఎంసీ (GHMC) శేరిలింగంపల్లి జోనల్ వెటర్నరీ ఆఫీసర్ వాటి బ్లడ్ రిపోర్ట్స్, తదితర ఆరోగ్య పరీక్షలను పర్యవేక్షించారు.

కోర్టు సీరియస్ వార్నింగ్

స్టెరిలైజేషన్ ప్రక్రియపై సంతృప్తి వ్యక్తం చేసిన న్యాయస్థానం.. అసలు సమస్యపై దృష్టి సారించింది. కోర్టు పలుమార్లు అవకాశం ఇచ్చినా.. కామేశ్వరి ఆ కుక్కల కోసం సరైన వసతిని చూపించలేకపోయారని అసహనం వ్యక్తం చేసింది. మరోవైపు, ఆమె తల్లి స్వయంగా కోర్టుకు హాజరై, కుక్కల కోసం పెద్ద స్థలాన్ని ఏర్పాటు చేయడానికి రెండు నెలల సమయం కావాలని కోరారు.

అయితే, రెండు నెలల సమయం ఇచ్చేందుకు నిరాకరించిన కోర్టు.. తదుపరి విచారణను సెప్టెంబర్ 21కి వాయిదా వేస్తూ.. 3 వారాల గడువు మాత్రమే ఇచ్చింది. ఈ లోపు కొత్త అకామడేషన్ (accommodation) చూపిస్తే దాని వివరాలతో అఫిడవిట్ దాఖలు చేయాలని.. అప్పుడు GHMC అధికారులు ఆ స్థలాన్ని ఇన్‌స్పెక్ట్ చేస్తారని స్పష్టం చేసింది. ఒకవేళ గడువులోగా స్థలం చూపించకపోతే.. అందులో ఉన్న చిన్న వయసు కుక్కలను దత్తతకు ఇస్తామని.. మిగిలిన వాటి కస్టడీపై తుది నిర్ణయం తీసుకుంటామని తేల్చి చెప్పింది.

Advertisement
Advertisement