త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Stock Markets | స్టాక్ మార్కెట్‌లకు బ్రేక్.. 4 రోజుల ర్యాలీకి తెర, ఆర్‌బీఐ నిర్ణయంపై ఉత్కంఠ..

Stock Markets | భారత స్టాక్ మార్కెట్లు మంగళవారం నష్టాల్లో ముగిశాయి. వరుసగా నాలుగు రోజులుగా కొనసాగిన ర్యాలీకి బ్రేక్ పడింది. ఆర్‌బీఐ ద్రవ్య విధాన కమిటీ (ఎంపీసీ) సమావేశ నిర్ణయంపై పెట్టుబడిదారులు అప్రమత్తంగా ఉండటంతోపాటు, సోమవారం క్లోజింగ్ ఆక్షన్ సెషన్ ప్రభావంతో ఏర్పడిన భారీ ర్యాలీని నిఫ్టీ కొంత మేర వెనక్కి వ‌చ్చేలా చేసింది.

S

Flash news | Published On Aug 4, 2026, 4.02 pm IST

Stock Markets | స్టాక్ మార్కెట్‌లకు బ్రేక్.. 4 రోజుల ర్యాలీకి తెర, ఆర్‌బీఐ నిర్ణయంపై ఉత్కంఠ..
Advertisement

Stock Markets | భారత స్టాక్ మార్కెట్లు మంగళవారం నష్టాల్లో ముగిశాయి. వరుసగా నాలుగు రోజులుగా కొనసాగిన ర్యాలీకి బ్రేక్ పడింది. ఆర్‌బీఐ ద్రవ్య విధాన కమిటీ (ఎంపీసీ) సమావేశ నిర్ణయంపై పెట్టుబడిదారులు అప్రమత్తంగా ఉండటంతోపాటు, సోమవారం క్లోజింగ్ ఆక్షన్ సెషన్ ప్రభావంతో ఏర్పడిన భారీ ర్యాలీని నిఫ్టీ కొంత మేర వెనక్కి వ‌చ్చేలా చేసింది. బీఎస్‌ఈ సెన్సెక్స్ 210.08 పాయింట్లు (0.27 శాతం) పడిపోయి 78,428.95 వద్ద ముగిసింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ50 సూచీ 159.40 పాయింట్లు (0.64 శాతం) క్షీణించి 24,614.90 వద్ద స్థిరపడింది. సెన్సెక్స్‌తో పోలిస్తే నిఫ్టీ ఎక్కువ నష్టపోయింది. ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ (ఎఫ్‌అండ్‌ఓ) విభాగంలోని షేర్లకు ఇటీవల అమల్లోకి వచ్చిన కొత్త క్లోజింగ్ ఆక్షన్ సెషన్ (సీఏఎస్) విధానానికి అనుగుణంగా మార్కెట్ సర్దుబాట్లు కొనసాగడం ఇందుకు ప్రధాన కారణంగా నిలిచింది.

అసాధార‌ణంగా ఎగ‌బాకిన నిఫ్టీ..

సోమవారం కొత్త ఆక్షన్ విధానం కారణంగా ట్రేడింగ్ చివరి దశలో నిఫ్టీ అసాధారణంగా ఎగ‌బాకింది. మంగళవారం నమోదైన పతనం మార్కెట్ మౌలిక పరిస్థితులు బలహీనపడినందుకు సంకేతం కాదని, ముందు రోజు ఏర్పడిన ధరల అసాధారణ కదలికలు సాధారణ స్థితికి చేరుకోవడమేనని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. రంగాల వారీగా చూస్తే రియాల్టీ సూచీ అత్యధికంగా 2.39 శాతం పడిపోయింది. ఇటీవల బలంగా ర్యాలీ చేసిన ఐటీ షేర్లలో లాభాల స్వీకరణ కనిపించడంతో నిఫ్టీ ఐటీ సూచీ 0.82 శాతం క్షీణించింది. ఎఫ్‌ఎంసీజీ, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఆటో, కన్స్యూమర్ డ్యూరబుల్స్ రంగాలు కూడా నష్టాల్లోనే ముగిశాయి. అయితే కొన్ని రంగాలు మెరుగైన ప్రదర్శన కనబరిచాయి. నిఫ్టీ మీడియా సూచీ 2.03 శాతం ఎగిసింది. మెటల్ సూచీ 0.91 శాతం లాభపడగా, ఫైనాన్షియల్ సర్వీసెస్ ఎక్స్-బ్యాంక్ సూచీ 0.47 శాతం పెరిగింది. విస్తృత మార్కెట్ల‌లో నిఫ్టీ స్మాల్‌క్యాప్ 100 సూచీ 0.23 శాతం లాభపడగా, మిడ్‌క్యాప్ 100 సూచీ 0.29 శాతం స్వల్పంగా తగ్గింది. మార్కెట్ ఒడిదుడుకులకు సూచికగా భావించే ఇండియా విక్స్ దాదాపు 2 శాతం పెరిగింది.

పెరిగిన చ‌మురు ధ‌ర‌లు..

సెన్సెక్స్‌లోని షేర్లలో ఏషియన్ పెయింట్స్ 1.31 శాతం, టాటా స్టీల్ 1.22 శాతం, కోటక్ మహీంద్రా బ్యాంక్ 1.08 శాతం, ట్రెంట్ 0.97 శాతం, బజాజ్ ఫైనాన్స్ 0.94 శాతం లాభపడ్డాయి. మరోవైపు హిందుస్థాన్ యూనిలీవర్ 0.71 శాతం, ఇన్ఫోసిస్ 0.44 శాతం, టైటాన్ 0.31 శాతం, మారుతి 0.19 శాతం, టీసీఎస్ 0.08 శాతం చొప్పున నష్టపోయాయి. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు కూడా పెరిగాయి. బ్రెంట్ క్రూడ్ ధర 2.46 శాతం పెరిగి బ్యారెల్‌కు 85.83 డాలర్లకు చేరగా, డబ్ల్యూటీఐ క్రూడ్ 1.83 శాతం పెరిగి బ్యారెల్‌కు 81.81 డాలర్ల వద్ద ట్రేడైంది. దీంతో ప్రపంచ ఇంధన ధరలపై ఆందోళనలు కొనసాగుతున్నాయి. రూపాయి విలువ మాత్రం దాదాపు స్థిరంగానే నిలిచింది. విదేశీ పెట్టుబడుల ప్రవాహాలు, దిగుమతిదారుల డాలర్ డిమాండ్, ఆర్‌బీఐ ద్రవ్య విధాన నిర్ణయానికి ముందు జాగ్రత్తల న‌డుమ దేశీయ కరెన్సీ అమెరికా డాలర్‌తో పోలిస్తే 95.3775 వద్ద స్వల్ప మార్పుతో ముగిసింది.

Advertisement
Advertisement