త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Stock Markets | భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. 4 రోజుల్లో రూ.11 ల‌క్ష‌ల కోట్లు లాభం..

Stock Markets | దేశీయ ఈక్విటీ మార్కెట్లు సోమవారం వరుసగా నాలుగో ట్రేడింగ్ సెషన్‌లోనూ బలమైన లాభాలతో ముగిశాయి. అమెరికా, ఇరాన్ మధ్య శాంతి ఒప్పందంపై ఆశలు పెరగడంతో అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు భారీగా తగ్గడం ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను బలపరిచింది. దీంతో బెంచ్‌మార్క్ సూచీలు మరోసారి ర్యాలీ కొనసాగించాయి.

S

Business | Published On Aug 3, 2026, 4.14 pm IST

Stock Markets | భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. 4 రోజుల్లో రూ.11 ల‌క్ష‌ల కోట్లు లాభం..
Advertisement

Stock Markets | దేశీయ ఈక్విటీ మార్కెట్లు సోమవారం వరుసగా నాలుగో ట్రేడింగ్ సెషన్‌లోనూ బలమైన లాభాలతో ముగిశాయి. అమెరికా, ఇరాన్ మధ్య శాంతి ఒప్పందంపై ఆశలు పెరగడంతో అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు భారీగా తగ్గడం ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను బలపరిచింది. దీంతో బెంచ్‌మార్క్ సూచీలు మరోసారి ర్యాలీ కొనసాగించాయి. సెన్సెక్స్ 544 పాయింట్లు (0.70 శాతం) పెరిగి 78,639 వద్ద ముగిసింది. నిఫ్టీ 50 సూచీ 391 పాయింట్లు (1.60 శాతం) ఎగిసి 24,774.30 వద్ద స్థిరపడింది. పెద్ద కంపెనీలతో పాటు మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ షేర్లలో కూడా కొనుగోళ్లు జోరుగా సాగాయి. నిఫ్టీ మిడ్‌క్యాప్ 100 సూచీ 1.21 శాతం పెరగ్గా, నిఫ్టీ స్మాల్‌క్యాప్ 100 సూచీ 1.29 శాతం లాభపడింది. ఒక్కరోజులోనే బీఎస్‌ఈలో లిస్టెడ్ కంపెనీల మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ దాదాపు రూ.486 లక్షల కోట్ల నుంచి రూ.490 లక్షల కోట్లకు పెరిగింది. దీంతో ఇన్వెస్టర్ల సంపద ఒక్క సెషన్‌లోనే సుమారు రూ.₹4 లక్షల కోట్లు పెరిగింది.

నాలుగు రోజుల్లో రూ.11 ల‌క్ష‌ల కోట్ల లాభం..

గత నాలుగు వరుస ట్రేడింగ్ సెషన్‌లలో సెన్సెక్స్ మొత్తం 1,850 పాయింట్లకు పైగా (2.44 శాతం) ఎగిసింది. అలాగే నిఫ్టీ 50 దాదాపు 800 పాయింట్లు (3.3 శాతం) లాభపడింది. జూలై 28న బీఎస్‌ఈలో లిస్టెడ్ కంపెనీల మొత్తం మార్కెట్ విలువ రూ.479 లక్షల కోట్లుగా ఉండగా, నాలుగు సెషన్‌ల వ్యవధిలో అది గణనీయంగా పెరగడంతో ఇన్వెస్టర్ల సంపద సుమారు రూ.11 లక్షల కోట్లు పెరిగింది. ఈ భారీ ర్యాలీకి అనేక అనుకూల అంశాలు కలిసి వచ్చాయి. ముడి చమురు ధరలు తగ్గడం, అమెరికా-ఇరాన్ మధ్య శాంతి చర్చలపై ఆశలు, దేశీయ ఆర్థిక పరిస్థితులు స్థిరంగా ఉండటం, రూపాయి బలపడటం, తొలి త్రైమాసిక (క్యూ1) ఫలితాలు అంచనాలకు మించి రావడం, విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్‌పీఐలు) మళ్లీ కొనుగోళ్లకు రావడం మార్కెట్‌ల‌కు ప్రధాన బలంగా నిలిచాయి.

భారీగా ప‌త‌న‌మైన క్రూడ్ ధ‌ర‌లు..

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌తో చర్చలు జరగనున్నాయని ప్రకటించడంతో బ్రెంట్ క్రూడ్ ధరలు సుమారు 5 శాతం పడిపోయి బ్యారెల్‌కు 84 డాలర్ల సమీపంలో ట్రేడయ్యాయి. దీంతో హోర్ముజ్ జలసంధి తిరిగి సాధారణ కార్యకలాపాలకు వచ్చే అవకాశాలపై ఆశలు వ్యక్తమయ్యాయి. అయితే అమెరికాతో ఎలాంటి చర్చలు జరగడం లేదని ఇరాన్ పేర్కొన్నట్లు సమాచారం. ఇక భారత రూపాయి కూడా డాలర్‌తో పోలిస్తే 12 పైసలు బలపడి డాలర్‌కు 95.31 వద్ద ముగిసింది. చిప్ స్టాక్స్‌లో అమ్మకాల కారణంగా వరుసగా నాలుగు నెలలు భారత మార్కెట్ నుంచి నిధులు ఉపసంహరించుకున్న ఎఫ్‌పీఐలు, జూలై నెలలో మళ్లీ కొనుగోళ్ల వైపు మళ్లడం కూడా మార్కెట్‌ల‌కు మద్దతుగా నిలిచింది.

పెరుగుతున్న ఎఫ్ఐఐల పెట్టుబ‌డులు..

జియోజిత్ ఇన్వెస్ట్‌మెంట్స్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ మాట్లాడుతూ అమెరికా-ఇరాన్ మధ్య చర్చలు పునఃప్రారంభమవుతాయనే అంచనాల కారణంగా ముడి చమురు ధరలు తగ్గాయని, దీంతో ద్రవ్యోల్బణం, కార్పొరేట్ లాభాలపై ఉన్న ఆందోళనలు తగ్గాయని చెప్పారు. విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు తిరిగి పెరగడం, రూపాయి బలపడటం కూడా మార్కెట్‌ల‌కు మద్దతిచ్చాయని, అయితే అమెరికా బాండ్ యీల్డ్‌లు ఇంకా అధిక స్థాయిలో ఉండటం అభివృద్ధి చెందుతున్న మార్కెట్లలో విదేశీ పెట్టుబడుల స్థిరత్వానికి ప్రధాన సవాలుగా మారే అవ‌కాశాలు ఉన్నాయ‌ని అభిప్రాయపడ్డారు. అలాగే క్యూ1 ఎఫ్‌వై27 ఫలితాలు అంచనాలకు మించి వస్తుండగా, ముఖ్యంగా స్మాల్‌క్యాప్ కంపెనీలు లార్జ్‌క్యాప్, మిడ్‌క్యాప్ కంపెనీల కంటే మెరుగైన ప్రదర్శన కనబరుస్తున్నాయని తెలిపారు. రాబోయే ఆర్‌బీఐ ద్రవ్య విధాన సమావేశంలో ద్రవ్యోల్బణం, లిక్విడిటీ పరిస్థితులు, భవిష్యత్ విధాన దిశపై వచ్చే వ్యాఖ్యలపై ఇన్వెస్టర్లు దృష్టి సారించనున్నారని, అయితే వడ్డీ రేట్లలో మార్పు ఉండద‌ని భావిస్తున్న‌ట్లు చెప్పారు.

Advertisement
Advertisement