త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Bhagyaraj | కోలీవుడ్‌లో విషాదం – దిగ్గ‌జ ద‌ర్శ‌కుడు భాగ్య‌రాజ్ క‌న్నుమూత – గురువు మ‌ర‌ణించిన కొద్ది రోజుల‌కే…

త‌మిళ సినీ ప‌రిశ్ర‌మ‌లో విషాదం చోటుచేసుకుంది. సీనియ‌ర్ హీరో, ద‌ర్శ‌కుడు కే భాగ్య‌రాజ్ శ‌నివారం గుండెపోటుతో చెన్నైలో క‌న్నుమూశారు. సుదీర్ఘ సినీ ప్ర‌యాణంలో న‌టుడిగా 75 సినిమాలు చేశారు భాగ్య‌రాజ్‌. 25 సినిమాల‌కు ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. త‌మిళంతో పాటు హిందీ, తెలుగు భాష‌ల్లో సినిమాలు చేశారు.

N

Entertainment | Published On Jun 27, 2026, 10.54 am IST

Bhagyaraj | కోలీవుడ్‌లో విషాదం – దిగ్గ‌జ ద‌ర్శ‌కుడు భాగ్య‌రాజ్ క‌న్నుమూత – గురువు మ‌ర‌ణించిన కొద్ది రోజుల‌కే…
Advertisement

Bhagyaraj | భార‌తీరాజా మ‌ర‌ణం మ‌రువ‌క‌ముందే త‌మిళ సినీ ప‌రిశ్ర‌మ‌లో మ‌రో విషాదం చోటుచేసుకుంది. సీనియ‌ర్ హీరో, ద‌ర్శ‌కుడు కే భాగ్య‌రాజ్ (73) శ‌నివారం చెన్నైలో గుండెపోటుతో క‌న్నుమూశారు. సుదీర్ఘ సినీ ప్ర‌యాణంలో హీరోగా, క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌గా 75 సినిమాల్లో న‌టించారు భాగ్య‌రాజ్‌. 25 సినిమాల‌కు ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. న‌టుడిగా, ద‌ర్శ‌కుడిగా త‌మిళంలోనే కాకుండా తెలుగు, హిందీ భాష‌ల్లో సినిమాలు చేశారు.

భార‌తీరాజా అసిస్టెంట్‌గా...

ఇటీవ‌లే క‌న్నుమూసిన లెజెండ‌రీ డైరెక్ట‌ర్ భార‌తీరాజా వ‌ద్ద అసిస్టెంట్‌గా భాగ్య‌రాజ్ సినీ ప్ర‌యాణం మొద‌లైంది. భార‌తీరాజా చ‌నిపోయిన కొద్ది రోజుల‌కే భాగ్య‌రాజా క‌న్నుమూయ‌డంతో త‌మిళ సినీ ప‌రిశ్ర‌మ‌కు తీర‌నిలోటుగా మారింది. భార‌తీరాజా ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ప‌ద‌హారు వ‌య‌నిథిలే, కిళ‌క్కే పోగుమ్ రైల్‌, సిగ‌ప్పు రోజాక్క‌ల్ సినిమాల‌కు అసిస్టెంట్ డైరెక్ట‌ర్‌గా ప‌నిచేశాడు. కిళ‌క్కే పోగుమ్ రైల్ సినిమాకు క‌థ‌, సిగ‌ప్పు రోజాక్క‌ల్ సినిమాల‌కు డైలాగ్స్ అందించ‌డ‌మే కాకుండా ఇందులో చిన్న రోల్స్ కూడా చేశాడు. ఈ మూడు సినిమాల‌తో త‌మిళంలో భాగ్య‌రాజ్ పేరు మారుమోగింది.

ఒకే ఏడాది హీరోగా...డైరెక్ట‌ర్‌గా...

1979లో గురువు భార‌తీరాజా ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన పుదియ వార్పుగ‌ళ్ సినిమాతో హీరోగా ప‌రిచ‌య‌మ‌య్యారు భాగ్య‌రాజ్‌. ఈ సినిమాకు ఆయ‌నే క‌థ‌, డైలాగ్స్ అందించారు. తొలి సినిమాతోనే బెస్ట్ డైలాగ్ రైట‌ర్‌గా రాష్ట్ర ప్ర‌భుత్వ అవార్డ్ అందుకున్నారు. అదే ఏడాది రిలీజైన త‌మిళ సినిమా క‌న్నిప‌రువ‌త్తిలే సినిమాలో విల‌న్‌గా అస‌మాన న‌ట‌న‌తో మెప్పించారు. 1979లోనే ద‌ర్శ‌కుడిగా కూడా అరంగేట్రం చేశారు. సువ‌రిల్లాద చిత్రాంగ‌ళ్ అనే సినిమాను తెర‌కెక్కించారు. అలా 1979 ...భాగ్య‌రాజ్ సినీ కెరీర్‌లోనే మ‌ర‌చిపోలేని ఏడాదిగా నిలిచింది.

స్క్రీన్‌ప్లే కింగ్‌...

మ‌ధ్య త‌ర‌గ‌తి అనుబంధాలు, అప్యాయ‌త‌ల‌తో పాటు కుటుంబ విలువల ప్ర‌ధానంగా సినిమాల‌ను తెర‌కెక్కించ‌డంలో కోలీవుడ్‌లో సిద్ధ‌హ‌స్తుడిగా పేరు తెచ్చుకున్నారు భాగ్య‌రాజ్‌. భార్యాభ‌ర్తల బంధాన్ని, సామాజిక స‌మ‌స్య‌ల‌ను త‌న సినిమాల‌లో అంత‌ర్లీనంగా చూపించేవారు. కేవ‌లం కుటుంబ క‌థ‌ల‌కే ప‌రిమితం కాకుండా లైంగిక అంశాల విష‌యంలో స‌మాజంలో పేరుకుపోయిన అపోహ‌ల‌ను ఎలాంటి వివాదాల‌కు తావులేకుండా ఎన్నో సినిమాల్లో చూపించారు. స‌మాజంలోని వివ‌క్ష‌, క‌ట్టుబాట్ల‌ను సున్నితంగా వినోదాన్ని జోడించి చెప్ప‌డం భాగ్య‌రాజ్ సినిమాల‌తోనే మొద‌లైంది. భాగ్య‌రాజ్‌ను స్క్రీన్‌ప్లే కింగ్‌గా త‌మిళ సినీ వ‌ర్గాలు చెబుతోంటాయి. సింపుల్ క‌థ‌ల‌ను సైతం త‌న స్క్రీన్‌ప్లే తో వినోదం, భావోద్వేగాలు, ఉత్కంఠ మేళ‌వించి అందంగా చెప్పేవారు. సినిమాల‌కు స్టార్ వాల్యూ కాకుండా క‌థ‌, స్క్రీన్‌ప్లే ముఖ్య‌మ‌ని ఎన్నో సినిమాల‌తో చాటిచెప్పారు. ఇప్ప‌టికీ ఆయ‌న స్క్రీన్‌ప్లేను నేటిత‌రం ద‌ర్శ‌కులు చాలా మంది రిఫ‌రెన్స్‌లుగా వాడుతుంటారు.

పేరు తెచ్చిన సినిమాలు..

అంతు 7 నాట్క‌ల్‌, ముంధానై ముడిచ్చు, మౌన గీతాంజ‌ల్‌, చిన్న‌వీడు, ఒరు కైదియ‌న్ డైరీ, డార్లింగ్ డార్లింగ్ డార్లింగ్‌, ఇదు న‌మ్మ‌భూమితో పాటు ప‌లు సినిమాల‌తో ద‌ర్శ‌కుడిగా, న‌టుడిగా ద‌క్షిణాది ప్రేక్ష‌కుల‌ను మెప్పించారు. ద‌ర్శ‌కుడిగా ర‌జ‌నీకాంత్‌, క‌మ‌ల్‌హాస‌న్‌, అమితాబ్‌బ‌చ్చ‌న్‌తో పాటు ప‌లువురు దిగ్గ‌జ న‌టుల‌తో సినిమాలు చేశారు. తాను ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన త‌మిళ మూవీ ఒరు కైదియ‌న్ డైరీ సినిమాను హిందీలో అఖ్రీ రాస్తా పేరుతో రీమేక్ చేశారు. ఈ రీమేక్‌లో అమితాబ్ బ‌చ్చ‌న్ హీరోగా న‌టించాడు. ద‌ర్శ‌కుడిగా చివ‌ర‌గా సిద్ధు ప్ల‌స్ 2 అనే సినిమా చేశారు. 2010లో రిలీజైన ఈ మూవీలో భాగ్య‌రాజ్ త‌న‌యుడు శంత‌ను హీరోగా న‌టించాడు. రైట‌ర్‌గా 2105లో వ‌చ్చిన తునై ముద‌ల్‌వ‌ర్ భాగ్య‌రాజా చివ‌రి సినిమా. న‌టుడిగా చివ‌ర‌గా తెలుగు మూవీ కుబేర‌లో క‌నిపించాడు.

 

Advertisement
Advertisement