త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Tooth Extraction | విక‌టించిన వైద్యం.. దంతాన్ని తొల‌గించే క్ర‌మంలో మ‌హిళ మృతి.. డాక్ట‌ర్ ప‌రారీ..

Tooth Extraction | నొప్పిగా ఉన్న దంతాన్ని తొల‌గించుకునేందుకు డెంట‌ల్ క్లినిక్‌కు వెళ్లిన ఓ మ‌హిళ డాక్ట‌ర్ నిర్వాకం కారణంగా ప్రాణాలు కోల్పోయింది. జార్ఖండ్‌లోని హ‌రిహ‌ర్‌గంజ్ లో చోటు చేసుకున్న ఈ సంఘ‌ట‌న‌కు సంబంధించి స్థానిక పోలీసులు, బాధిత కుటుంబ స‌భ్యులు తెలిపిన ప్ర‌కారం వివ‌రాలు ఈవిధంగా ఉన్నాయి.

S

Crime | Published On Mar 21, 2026, 10.53 am IST

Tooth Extraction | విక‌టించిన వైద్యం.. దంతాన్ని తొల‌గించే క్ర‌మంలో మ‌హిళ మృతి.. డాక్ట‌ర్ ప‌రారీ..
Advertisement

Tooth Extraction | నొప్పిగా ఉన్న దంతాన్ని తొల‌గించుకునేందుకు డెంట‌ల్ క్లినిక్‌కు వెళ్లిన ఓ మ‌హిళ డాక్ట‌ర్ నిర్వాకం కారణంగా ప్రాణాలు కోల్పోయింది. జార్ఖండ్‌లోని హ‌రిహ‌ర్‌గంజ్ లో చోటు చేసుకున్న ఈ సంఘ‌ట‌న‌కు సంబంధించి స్థానిక పోలీసులు, బాధిత కుటుంబ స‌భ్యులు తెలిపిన ప్ర‌కారం వివ‌రాలు ఈవిధంగా ఉన్నాయి. బిజాంతి దేవి (35) అనే ఓ మ‌హిళ ఒక దంతం పాక్షికంగా విరిగిపోయి విప‌రీత‌మైన నొప్పి ఏర్ప‌డ‌డంతో భ‌ర్త ముకేష్ చంద్రభార‌తితో క‌లిసి స్థానికంగా ప‌ల‌ము అనే ప్రాంతంలో ఉన్న జ‌న‌తా డెంట‌ల్ క్లినిక్‌కు చికిత్స నిమిత్తం వెళ్లింది. అక్క‌డి వైద్యుడు అష్ర‌ఫ్ అలీ ఆమెకు ర‌క్త‌పోటు, షుగ‌ర్ ప‌రీక్ష‌లు నిర్వ‌హించాడు. ఆమెకు షుగ‌ర్ 140 ఉన్న‌ట్లు తెలిపాడు. త‌రువాత దంతాన్ని తొల‌గించేందుకు శ‌స్త్ర చికిత్స‌కు గాను ముందుగా నొప్పి తెలియ‌ని ఇంజెక్ష‌న్‌ను ఆమెకు ఇచ్చాడు. త‌రువాత ఆమె దంతాన్ని తొల‌గించాడు.

ఇంజెక్ష‌న్ చేసిన వెంట‌నే అప‌స్మార‌క స్థితిలోకి..

అనంత‌రం మ‌ళ్లీ ఓ ఇంజెక్షన్ ఇవ్వాల‌ని డాక్ట‌ర్ సూచించ‌గా కాంపౌండ‌ర్ ఇంజెక్ష‌న్ రెడీ చేసి ఇచ్చిన వెంట‌నే బిజాంతి దేవికి ఒక్క‌సారిగా వాంతులు మొద‌ల‌య్యాయి. ఆమె ఆరోగ్య ప‌రిస్థితి అక‌స్మాత్తుగా క్షీణించింది. కొన్ని నిమిషాల్లోనే ఆమె ముఖం తెల్ల‌గా మారింది, త‌రువాత ఆమె ఎంత పిలిచినా స్పందించ‌లేదు. అప‌స్మార‌క స్థితిలోకి వెళ్లిపోయింది. దీంతో డాక్ట‌ర్ ఆంబులెన్స్ ఏర్పాటు చేస్తాన‌ని చెప్పి క్లినిక్‌ను మూసి అక్క‌డి నుంచి ఉడాయించాడు. అత‌నితోపాటు కాంపౌండ‌ర్ కూడా అక్క‌డి నుంచి పారిపోయాడు. స్థానికుల స‌హాయంతో ముకేష్ త‌న భార్య‌ను ముందుగా స‌మీపంలో ఉన్న ఓ ప్రైవేటు పిల్ల‌ల హాస్పిట‌ల్‌కు త‌ర‌లించాడు. త‌రువాత అక్క‌డి నుంచి ఆమెను హ‌రిహ‌ర్‌గంజ్ క‌మ్యూనిటీ హెల్త్ సెంట‌ర్‌కు తీసుకెళ్ల‌గా అక్క‌డ వైద్యులు ఆమెను ప‌రీక్షించి అప్ప‌టికే మృతి చెందిన‌ట్లు నిర్దారించారు.

న‌కిలీ వైద్యుడ‌ని అనుమానాలు..

డాక్ట‌ర్ అష్ర‌ఫ్ అలీ నిర్వాకం, నిర్ల‌క్ష్యం కార‌ణంగానే త‌న భార్య మృతి చెందింద‌ని, అత‌నిపై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కోరుతూ ముకేష్ స్థానిక పోలీసుల‌కు ఫిర్యాదు చేయ‌గా, వారు కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేప‌ట్టారు. కాగా చికిత్స స‌మ‌యంలో డాక్ట‌ర్ త‌ప్పుడు ఇంజెక్ష‌న్, మెడిసిన్ ఇవ్వ‌డం వ‌ల్లే త‌న భార్య మృతి చెందింద‌ని ముకేష్ పోలీసుల‌కు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఘ‌ట‌న‌పై స్పందించిన పోలీసు అధికారులు మాట్లాడుతూ బాధిత వ్య‌క్తి ఫిర్యాదు ఆధారంగా కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేప‌ట్టామ‌ని, పోస్టుమార్టం నిర్వ‌హించామ‌ని, నివేదిక అందిన త‌రువాత త‌దుప‌రి చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని తెలిపారు. ప‌ల‌ము సివిల్ స‌ర్జ‌న్ అనిల్ శ్రీ‌వాస్త‌వ మాట్లాడుతూ జ‌న‌తా డెంట‌ల్ క్లినిక్‌ను సీజ్ చేశామ‌ని, స‌ద‌రు డాక్ట‌ర్ అష్ర‌ఫ్ రిజిస్ట‌ర్డ్ వైద్యుడు కాడ‌ని అనుమానం వ్య‌క్తం చేశారు. ఆ క్లినిక్ కార్యక‌లాపాల్లోనూ అనేక అక్ర‌మాలు చోటు చేసుకున్నాయ‌ని తెలిపారు. మృతురాలికి చికిత్స స‌మ‌యంలో ఇచ్చిన ఔష‌ధాలు, స‌రైన వైద్య విధానాల‌ను పాటించారా, లేదా అన్న అంశాల‌పై కూడా వివ‌రాల‌ను సేక‌రిస్తున్నామ‌ని తెలిపారు. ఈ కోణంలోనూ కేసు దర్యాప్తు చేస్తున్నామ‌ని, ప్ర‌స్తుతం డాక్ట‌ర్‌, కాంపౌండ‌ర్ ఇద్ద‌రూ ప‌రారీలో ఉన్నార‌ని పోలీసులు తెలిపారు.

Advertisement

తాజావార్తలు

Advertisement