త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Aliganj Fire Accident | లక్నో కోచింగ్ సెంటర్‌లో ఘోర అగ్నిప్రమాదం.. ప్రాణభయంతో పైనుంచి దూకేసిన స్టూడెంట్స్

లక్నోలోని ఓ కోచింగ్ సెంటర్‌లో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. మంటల నుంచి ప్రాణాలు దక్కించుకునేందుకు విద్యార్థులు భవనం పైనుంచి దూకేశారు. పూర్తి వివరాలు ఇవే.

J

Crime | Published On Jun 22, 2026, 4.28 pm IST

Aliganj Fire Accident | లక్నో కోచింగ్ సెంటర్‌లో ఘోర అగ్నిప్రమాదం.. ప్రాణభయంతో పైనుంచి దూకేసిన స్టూడెంట్స్
Advertisement
  • లక్నో (Lucknow) అలీగంజ్ ప్రాంతంలోని ఓ కోచింగ్ సెంటర్‌లో భారీ అగ్నిప్రమాదం
  • గ్రౌండ్ ఫ్లోర్‌లో చెలరేగిన మంటలు.. వేగంగా ఫస్ట్ ఫ్లోర్‌కు వ్యాప్తి
  • ప్రాణభయంతో భవనం పైనుంచి కిందకు దూకేసిన పలువురు స్టూడెంట్స్
  • హుటాహుటిన రంగంలోకి దిగిన 8 ఫైర్ ఇంజన్లు, భవనంలో చిక్కుకున్న వారి కోసం ముమ్మరంగా రెస్క్యూ ఆపరేషన్

Aliganj Fire Accident | త్రినేత్ర.న్యూస్ : ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో (Lucknow) సోమవారం ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. అలీగంజ్ ప్రాంతంలో ఉన్న ఓ కోచింగ్ సెంటర్‌ (Coaching centre) భవనంలో అకస్మాత్తుగా భారీగా మంటలు చెలరేగాయి. క్షణాల్లోనే దట్టమైన పొగలు కమ్ముకోవడంతో లోపల ఉన్న విద్యార్థులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని హాహాకారాలు చేశారు. ప్రాణాలను కాపాడుకునే క్రమంలో పలువురు విద్యార్థులు ఫస్ట్ ఫ్లోర్ నుంచి కిందకు దూకేశారు.

అమాంతం వ్యాపించిన మంటలు..

స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. భవనం గ్రౌండ్ ఫ్లోర్‌లో ఉన్న ఓ షాపులో చిన్న నిప్పురవ్వతో ఈ ప్రమాదం మొదలైనట్లు తెలుస్తోంది. ఆ మంటలు వేగంగా ఫస్ట్ ఫ్లోర్‌లో ఉన్న కోచింగ్ సెంటర్‌కు (Coaching centre) వ్యాపించాయి. సరిగ్గా క్లాసులు జరుగుతున్న సమయంలో ఈ ఘటన జరగడంతో స్టూడెంట్స్ తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. మంటల వేడి, దట్టమైన పొగకు ఊపిరి ఆడకపోవడంతో దాదాపు ఏడు నుంచి ఎనిమిది మంది స్టూడెంట్స్ భవనం పైనుంచి కిందకు దూకేశారు.

Massive Fire at Lucknow Coaching Centre Students Jump to Escape

ముమ్మరంగా రెస్క్యూ ఆపరేషన్ (Rescue Operation)

సమాచారం అందుకున్న వెంటనే ఫైర్ అండ్ రెస్క్యూ సిబ్బంది 8 ఫైర్ ఇంజన్లతో (Fire tenders) ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. ప్రాణభయంతో పైనుంచి కిందకు దూకడం వల్ల గాయపడిన ఇద్దరు విద్యార్థులను వెంటనే కేజీఎంయూ (KGMU) ట్రామా సెంటర్‌కు తరలించారు. మరో 15 మంది వరకు ఆసుపత్రికి వచ్చే అవకాశం ఉందని కేజీఎంయూ ప్రొఫెసర్ ప్రేమ్ రాజ్ సింగ్ వెల్లడించారు.

అయితే, ఈ కోచింగ్ సెంటర్ లోపల ఇంకా 20 నుంచి 25 మంది విద్యార్థులు చిక్కుకుని ఉండొచ్చని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అదృష్టవశాత్తూ ఇప్పటివరకు ఎలాంటి ప్రాణనష్టం జరిగినట్లు రిపోర్ట్ కాలేదని అధికారులు తెలిపారు. భవనంలో చిక్కుకున్న విద్యార్థులను సురక్షితంగా బయటకు తీసుకొచ్చేందుకు పోలీసు, ఫైర్ సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు.

Advertisement
Advertisement