త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Family Dies After Eating Biryani | విషాదం: బిర్యానీ తర్వాత పుచ్చకాయ తిని ఫుడ్ పాయిజన్ అయి ఒకే కుటుంబంలో నలుగురు మృతి

ముంబైలో ఘోర విషాదం చోటుచేసుకుంది. బిర్యానీ, ఆ తర్వాత పుచ్చకాయ తిని ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఫుడ్ పాయిజనింగ్‌తో ప్రాణాలు కోల్పోయారు.

J

Crime | Published On Apr 27, 2026, 5.12 pm IST

Family Dies After Eating Biryani | విషాదం: బిర్యానీ తర్వాత పుచ్చకాయ తిని ఫుడ్ పాయిజన్ అయి ఒకే కుటుంబంలో నలుగురు మృతి

సంక్షిప్త సారాంశం

ముంబైలోని పైధోనీ ప్రాంతంలో ఫుడ్ పాయిజనింగ్ కారణంగా భార్యాభర్తలు, వారి ఇద్దరు కూతుళ్లు మృతి చెందారు. ఏప్రిల్ 25 రాత్రి వీరంతా బంధువులతో కలిసి బిర్యానీ తిన్నారు, ఆ తర్వాత అర్ధరాత్రి పుచ్చకాయ తిన్నారు. మరుసటి రోజు ఉదయం తీవ్ర అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Family Dies After Eating Biryani | త్రినేత్ర.న్యూస్ : ముంబై మహానగరంలో హృదయ విదారక ఘటన వెలుగుచూసింది. రాత్రి భోజనంలో బిర్యానీ, ఆ తర్వాత పుచ్చకాయ (Watermelon) తిన్న ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు అనుమానాస్పద స్థితిలో ఫుడ్ పాయిజనింగ్‌కు గురై ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో భార్యాభర్తలు, వారి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం ఈ ఘటన పైధోనీ ప్రాంతంలో చోటుచేసుకుంది.

అసలేం జరిగిందంటే?

ముంబై పోలీసుల వివరాల ప్రకారం.. పైధోనీ ప్రాంతంలో నివాసం ఉంటున్న అబ్దుల్లా డోకాడియా (40), అతని భార్య నస్రీన్ డోకాడియా (35), కుమార్తెలు ఆయేషా (16), జైనాబ్ (13) ఏప్రిల్ 25వ తేదీ రాత్రి తమ బంధువులతో కలిసి భోజనం చేశారు. రాత్రి 10:30 గంటల ప్రాంతంలో మొత్తం తొమ్మిది మంది బంధువులు కలిసి బిర్యానీ తిన్నారు. ఆ తర్వాత బంధువులు తమ ఇళ్లకు వెళ్లిపోయారు. అయితే, అర్ధరాత్రి 1:00 నుంచి 1:30 గంటల మధ్య ఈ టైమ్‌లో అబ్దుల్లా కుటుంబంలోని నలుగురు పుచ్చకాయ తిన్నారు.

ఉదయాన్నే అస్వస్థత.. ఆస్పత్రిలో చేరిక

మరుసటి రోజు (ఏప్రిల్ 26) తెల్లవారుజామున 5:30 నుంచి 6:00 గంటల సమయంలో నలుగురికి వాంతులు, విరేచనాలు మొదలయ్యాయి. వెంటనే కుటుంబ వైద్యుడిని సంప్రదించి ప్రాథమిక చికిత్స తీసుకున్నారు. పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం జేజే ఆసుపత్రికి (JJ Hospital) తరలించారు.

ఒకరి తర్వాత ఒకరు మృతి

వైద్యులు ఎంత శ్రమించినప్పటికీ ఫలితం దక్కలేదు. ఉదయం 10:15 గంటల సమయంలో చిన్న కుమార్తె జైనాబ్ మృతి చెందగా, అదే రోజు రాత్రి 10:30 గంటలకు తండ్రి అబ్దుల్లా కన్నుమూశాడు. ఆ తర్వాత ఆస్పత్రిలో చికిత్స పొందుతూ భార్య నస్రీన్, పెద్ద కుమార్తె ఆయేషా కూడా ప్రాణాలు విడిచారు.

ఈ ఘటనపై జేజే మార్గ్ పోలీస్ స్టేషన్‌లో యాక్సిడెంటల్ డెత్ కేసు నమోదు చేశారు. మృతదేహాలకు పోస్ట్‌మార్టం నిర్వహించామని, హిస్టోపాథలాజికల్ నివేదికలు వచ్చిన తర్వాతే మరణాలకు గల కచ్చితమైన కారణం తెలుస్తుందని పోలీసులు వెల్లడించారు. బిర్యానీ తిన్న తర్వాతే పుచ్చకాయ తిన్నారని బంధువులు పోలీసులకు ప్రాథమికంగా వాంగ్మూలం ఇచ్చారు. అయితే, ఫుడ్ పాయిజనింగ్‌కు కచ్చితమైన కారణం ఏమిటన్నది ఇంకా స్పష్టం కాలేదని, దర్యాప్తు కొనసాగుతోందని అధికారులు తెలిపారు.

జార్ఖండ్‌లో పానీపూరి తిని బాలుడి మృతి

ఇదిలా ఉండగా, జార్ఖండ్‌లోని గిరిడిహ్ జిల్లాలో ఆదివారం ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. ఓ వీధి వ్యాపారి వద్ద కలుషితమైన పానీపూరి (గోల్‌గప్పా), చాట్ తిని ఏడేళ్ల బాలుడు మృతి చెందగా, మరో 18 మంది అస్వస్థతకు గురై ఆస్పత్రి పాలయ్యారు. బజ్తో గ్రామంలో జరిగిన ఈ ఘటనపై అధికారులు, ఆరోగ్య శాఖ దర్యాప్తు ముమ్మరం చేశారు.

సాధారణంగా కలుషితమైన ఆహారం, నీరు తీసుకోవడం వల్ల ఫుడ్ పాయిజనింగ్ అవుతుందని, దీనివల్ల విరేచనాలు, వాంతులు, కడుపునొప్పి వంటి లక్షణాలు కనిపిస్తాయని వైద్యులు చెబుతున్నారు. వేసవి కాలం దృష్ట్యా ప్రజలు బయటి ఆహారం తీసుకునేటప్పుడు పరిశుభ్రత పట్ల మరింత అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

Advertisement
Advertisement